రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే వారికి శుభవార్త చెప్పేందుకు సర్కార్ సిద్ధమైంది. నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్లు, చైర్మన్లను త్వరలోనే నామినేట్ చేయనున్నట్టు తెలుస్తున్నది.ఇక మీదట పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించకుండా నేరుగా డైరెక్టర్లు, చైర్మన్లను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం.
నామినేటెడ్ విధానంలో సొసైటీలకు, డీసీసీబీలకు డైరెక్టర్లను నియమించనున్నట్టు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడంతో అధికార పార్టీ నాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పీఏసీఎస్లపై నాయకులకు ఆశలు చిగురించాయి.పైసా ఖర్చు లేకుండా పీఏసీఎస్ డైరెక్టర్, చైర్మన్ కావొచ్చని అంచనాలు వేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటే చాలు అనే రీతిలో నాయకులు పావులు కదిపేందుకు ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.గతంలో డైరెక్టర్లు, చైర్మన్ల ఎన్నికలకు డబ్బులు ఖర్చయ్యేవి. నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేయడం వలన డబ్బులు కూడా ఖర్చు అవ్వదని నేతలు భావిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పటికే 908 పీఏసీఎస్లు ఉన్నాయి.మరో 134 కొత్తగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర స్థాయిలొ ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం.త్వరలోనే వీటి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తున్నది. మండలానికి ఒక పీఏసీఎస్ ఐన ఉండాలనే ఉద్దేశంతో కొత్త పీఏసీఎస్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వీటన్నింటినీ కలిపి 1,042 వరకు పీఏసీఎస్ లు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిలో ఒక్కొక్కటిలో గరిష్ఠంగా 13 మంది వరకు డైరెక్టర్లుగా నామినేట్ చేసుకునే చాన్స్ ఉంది. ఇందులో కనీసం 10 మందిని నామినేట్ చేసుకున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికి పైగా కాంగ్రెస్ నేతలకు పదవులు వరించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
రాజకీయ సన్యాసం నుండి కొత్త పార్టీ దాకా.. విజయసాయి రెడ్డి అసలు మాస్టర్ ప్లాన్ అదేనా..?
ఒకేసారి పెద్దమొత్తంలో నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్న కేడర్ను ఎంతో కొంత సంతృప్తి పరచవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఎలాంటి ఖర్చు లేకుండా పార్టీ కేడర్కు పదవులు ఇవ్వడం ద్వారా కింది స్థాయిలో ఉన్న అసంతృప్తిని తొలగించవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి న్యాయపరంగా చిక్కులు రావొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. అలాంటిదేమీ ఉండకపోవచ్చని.. ఏపీలోనూ పీఏసీఎస్లకు ‘నామినేటెడ్’ విధానంలో భర్తీ చేశారని అధికారులు చెబుతున్నారు.ఆ విధానాన్ని అధ్యయనం చేసి రావాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అధికారులకు సూచించారు. అధికారుల బృందం ఏపీలో పర్యటించి నివేదిక అందించింది.ఏపీలో నామినేటెడ్ విధానం అప్లయ్ చేయడం వలన ఎక్కడా కూడా న్యాయపరమైన చిక్కులు రాలేదని, అవాంతరాలు లేకుండా నామినేటెడ్ కమిటీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చని అధికారులు పేర్కొనడంతో ఇక్కడి కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.