Vijayasai Party: జులైలో కొత్త రాజకీయ పార్టీ పెడతానని విజయసాయి రెడ్డి అన్నారు. ఎస్.. ఇది విన్నప్పుడు ఏపీ ఒక్కటే కాదు పక్కనున్న తెలంగాణ కూడా షాక్ అయింది. తెలంగాణలో ఓ కొత్త రాజకీయ పార్టీ పుట్టిన రోజే.. విజయసాయి నోటి నుంచి ఏపీలోనూ త్వరలోనే కొత్త పార్టీ పెడతానంటూ వచ్చిన కామెంట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ డిబేట్కు దారితీసింది. ఆల్రెడీ రాజకీయ సన్యాసం ప్రకటించి.. సేద్యం చేసుకుంటానని తెరమరుగైన విజయసాయిరెడ్డి.. మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇస్తానని చెప్పడం, వచ్చే జులైలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించడం సంచలనంగా మారింది.
రాజకీయాల్లో నిలకడ లేకపోవడం కొత్తేమీ కాదు. కానీ, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యవహారం అలా కాదు. ఇది.. వెరీ ఇంట్రస్టింగ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా దెబ్బతిన్నాక.. ఆ పార్టీలో నిలవలేక, ఎక్కువ కాలం ఉండలేక.. బయటకొచ్చేశారు. రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఆ తర్వాత.. తనకు రాజకీయాలు సూట్ అవవని చెప్పి.. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ఏకంగా ఏపీలో ఓ రాజకీయ పార్టీనే పెడతానంటున్నారు. అసలు.. విజయసాయికి ఎక్కడ క్లారిటీ లోపించింది? ఎందుకు.. రాజకీయాల నుంచి తప్పుకున్నారు? మీడియా రంగంలోకి వస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు? ఇంతోలనే.. మళ్లీ రాజకీయ పార్టీ ఎందుకు పెడతానంటున్నారు? ఈ యూటర్న్లు దేనికోసం? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే.. విజయసాయి రెడ్డిని సీరియస్ పొలిటికల్ ప్లేయర్గా చూడాలా? ఈడీ సోదాల వల్ల వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక చేస్తున్న హడావుడా? అనే అనుమానాలు వస్తాయ్.
విజయసాయిరెడ్డి యాక్టివ్ పాలిటిక్స్కి దూరమయ్యాక.. కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ వస్తున్నారు. కొన్ని నెలలుగా విజయసాయి రెడ్డి సోషల్ మీడియా పోస్టులు, మీడియా ప్రకటనల గమనిస్తే.. ఎవ్వరికైనా బుర్ర తిరగడం ఖాయం. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ టు అనే ముద్ర ఉన్న విజయసాయి.. ఇప్పుడదే వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితమే.. రాజకీయాలు తనకు సరిపడవని, ఒత్తిడితో కూడుకున్నవని చెప్పారు. ప్రశాంతంగా సొంతూరిలో వ్యవసాయం చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తాననే ఇమేజ్ బిల్డ్ చేశారు. ఇది చూశాక అంతా ఆయన పాలిటిక్స్కు రిటైర్మెంట్ ప్రకటించేశారని భావించారు. ఇంతలోనే.. వచ్చే జులై నుంచి తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ సంచలనంగా మారింది.
Also Read: గుంటనక్కలతో దందాలు చేసింది మీరే కదా.. కవిత పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
ఇటీవలే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు విజయసాయి. త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీషులో డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ ప్రారంభిస్తామన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ.. పబ్లిక్ వాయిస్ వినిపిస్తామన్నారు. ఏ పొలిటికల్ పార్టీకి అనుబంధంగా తాము పనిచేయమని, డిజిటల్ మీడియా తర్వాత తెలుగులో శాటిలైట్ ఛానెల్ కూడా తెస్తామని చెప్పారు. ఇది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఇది జరిగిన కొన్నాళ్లకే.. ఏపీ లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. జులైలో పొలిటికల్ రీఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. అలాగే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో.. ఆయనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం మొదలైంది. బీజేపీలో చేరడానికి అన్ని విధాలా ప్రయత్నించారని, అక్కడ డోర్స్ క్లోజ్ అయ్యేసరికి.. ఇప్పుడు వేరే ఆప్షన్ లేక కొత్త పార్టీ అంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఢిల్లీ లెవెల్లో పరిచయాలు ఉన్న నేతగా, తనపై ఉన్న కేసుల నుంచి రక్షణ పొందడానికి.. ఏదో ఒక పొలిటికల్ అస్తిత్వం అవసరమని విజయసాయి రెడ్డి భావిస్తున్నారనే చర్చ కూడా ఉంది. అయితే, రిటైర్మెంట్ అని ఒకసారి, రీఎంట్రీ అని మరోసారి, మీడియాతో వస్తున్నా అని ఇంకోసారి.. అని చెప్పడం ద్వారా అందరి ఫోకస్ తనపై ఉండేలా చూసుకుంటున్నారనే వాదనలు కూడా ఉన్నాయ్.
Also Read: రేవంత్ సర్కార్ పై బీజేపి బిగ్ బాంబ్.. 1000 కోట్లు ఢిల్లీకి పంపిస్తారా..!