Kerala Elections: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ (LDF)ను గద్దె దించుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) భారీ మెజారిటీతో విజయం దిశగా దూసుకుపోతోంది. దీంతో దేశంలో మసకబారుతున్న కాంగ్రెస్ ప్రాభవానికి ఈ విజయం.. జవసత్వాన్ని తీసుకొచ్చినట్లైంది. అయితే ఈ విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలు, ‘తెలంగాణ ఫార్ములా’ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో బీఆర్ఎస్ను గద్దె దించిన జోష్తో కేరళలోనూ అదే తరహా దూకుడును ప్రదర్శించారు. కేరళ సీఎం పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ చేసిన విమర్శలు అక్కడి ఓటర్లను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా విజయన్ పాలనను, బీజేపీకి ఆయన పరోక్ష సహకారం అందిస్తున్నారని రేవంత్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. పైగా కీలక ప్రాంతాల్లో రేవంత్ నిర్వహించిన ర్యాలీలకు భారీ స్పందన సైతం లభించింది. యువతను ఆకర్షించడంలో ఆయన శైలి అక్కడి కాంగ్రెస్ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన కొన్ని కీలక సూత్రాలను రేవంత్ కేరళలోనూ ప్రయోగించారు. తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాలను ఉదాహరణగా చూపిస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేరళలోనూ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలవుతాయని ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను (Anti incumbency) ఆయుధంగా మలుచుకుని, కాంగ్రెస్ ‘సంక్షేమ నమూనా’ను ప్రజల ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ ఎన్నికల సమయంలో అనుసరించిన గ్రౌండ్ లెవల్ మేనేజ్మెంట్ను కేరళలోని స్థానిక నాయకత్వంతో సమన్వయం చేయడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారని సమాచారం.
Also Read: బెంగాల్లో బద్దలైన దీదీ కోట.. 15 ఏళ్ల పాలనకు శుభంకార్డ్.. ఫలించిన మోదీ-షా వ్యూహం!
ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే.. కేరళలో కాంగ్రెస్ కూటమి (UDF) మ్యాజిక్ ఫిగర్ను దాటేసి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీఎం పినరయి విజయన్ తన సొంత నియోజకవర్గం ధర్మడంలో సైతం తీవ్ర పోటీని ఎదుర్కోవడం గమనార్హం. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలోని దాదాపు 12 మందికి పైగా మంత్రులు వెనుకంజలో ఉండటం, ప్రజలు మార్పును ఎంత బలంగా కోరుకున్నారో అన్నదానికి అద్దం పడుతోంది. కర్ణాటక, తెలంగాణ తర్వాత ఇప్పుడు కేరళలోనూ కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతుండటం ఆ పార్టీలో కొత్త జోష్ తీసుకొస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. దక్షిణాదిపై కాంగ్రెస్ తన పట్టును మరోమారు నిలుపుకుంటోందని చెప్పుకొస్తున్నారు.
Also Read: విజయ్ సునామీలో.. కొట్టుకుపోయిన ద్రవిడ సిద్దాంత పార్టీలు.. 6 దశాబ్దాల చరిత్రకు 6 నెలల్లో చెక్!