Dravidian Politics: తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. చారిత్రాత్మక రాజకీయ మార్పుల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో 6 దశాబ్దాల పాటు పెనవేసుకుపోయిన ద్రవిడ సిద్దాంతంను తెరమరుగు చేసే విధంగా.. టీవీకే పార్టీ అధినేత, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దూసుకుపోతున్నారు. ద్రవిడ సిద్దాంత పునాదులపై నిలబడ్డ డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AI DMK) పార్టీలు.. 1967 నుంచి తమిళ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా తమదైన ముద్రవేశాయి. సి.ఎన్. అన్నాదురై, కరుణానిధి (డీఎంకే), ఎం.జి రామచంద్రన్ (అన్నాడీఎంకే), జయలలిత, ఎంకే స్టాలిన్, పళనిస్వామి.. ఈ ద్రవిడ సిద్దాంత పాలిటిక్స్ ఆధారంగా సీఎం అయినవారే. అయితే తొలిసారి విజయ్.. ఆ సిద్దాంతానికి అతీతంగా వచ్చి అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ‘ద్రవిడ సిద్ధాంతం’ కేవలం ఒక రాజకీయ విధానం మాత్రమే కాదు. అది ఒక బలమైన సామాజిక, సాంస్కృతిక ఉద్యమం. బ్రాహ్మణేతర వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో 1916లో తొలిసారి ‘జస్టిస్ పార్టీ’ ఏర్పడింది. 1944లో జస్టిస్ పార్టీని ఈ.వి. రామస్వామి (పెరియార్) ‘ద్రవిడ కజగం’ (DK)గా మార్చారు. 1949లో పెరియార్తో విభేదించి ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)ను సి.ఎన్. అన్నాదురై స్థాపించారు. ఈ పార్టీ ద్రవిడ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
1967లో డీఎంకే పార్టీ తమిళనాడులో తొలిసారి అధికారంలోకి వచ్చింది. అన్నాదురై మరణం తర్వాత సీఎం బాధ్యతలను కరుణానిధి తీసుకున్నారు. అప్పటివరకూ కరుణానిధితో సంబంధాలు కలిగి ఉన్న సినీ నటుడు ఎం.జి. రామచంద్రన్ (MGR).. ఆయనతో విభేదించి అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) స్థాపించారు. ద్రవిడ సిద్దాంతాలతో పుట్టిన ఈ పార్టీలతోనే అప్పటి నుంచి ఇప్పటివరకూ తమిళ సీఎం పీఠం ట్రావెల్ చేస్తూ వచ్చింది. కరుణానిధి తర్వాత ఆయన తనయుడు, ఎం.కె స్టాలిన్.. డీఎంకే బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. అటు ఏఐడీఎంకే తరపున జయలలిత తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు. ఆమె తర్వాత పళనిస్వామి ఆ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. దాదాపు 59 ఏళ్లుగా ఆ రెండు పార్టీల మధ్యే ప్రధానంగా తమిళ రాజకీయాలు తిరుగుతూ వచ్చాయి. ఇన్నాళ్ల తర్వాత విజయ్ రూపంలో వాటికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
తమిళ స్టార్ హీరో విజయ్.. 2026 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగం తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam – TVK) పార్టీని ప్రకటించారు. ప్రారంభంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైనే విజయ్ దృష్టి పట్టారు. ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ఉండగా విజయ్.. రాజకీయ కధనరంగంలో చురుగ్గా మారారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే పార్టీని తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ ఎండగడుతూ వచ్చారు. మరోవైపు బీజేపీ, అన్నాడీఎంకే వంటి పార్టీలు.. పొత్తుకు ఆసక్తి చూపినా విజయ్ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగారు. తాజాగా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలకు అతి చేరువలో విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వార్త రాసే సమయానికి విజయ్ పార్టీ 108/234 స్థానాల్లో ముందంజలో ఉంది. దీనిని బట్టి సుమారు 60 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తూ వస్తున్న డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలకు తమిళ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని స్పష్టమవుతోంది. ద్రవిడ సిద్దాంత రాజకీయాలకు తమిళనాట తెరపడనుందా? అన్న అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 2026 ఎన్నికల ఫలితాలు.. బీజేపీదే హవా.. ‘ఇండియా’ కూటమికి అంతిమ ఘడియలు అంటున్న జీవీఎల్
టీవీకే అధినేత విజయ్.. తమిళగ వెట్రి కళగం (TVK) స్థాపించినప్పటి నుండి ద్రవిడ సిద్ధాంతంపై చాలా స్పష్టమైన, సమతుల్యమైన వైఖరిని అవలంభిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఎక్కడా కూడా ద్రవిడ సిద్దాంతాన్ని సమర్థిస్తున్నట్లు గానీ, వ్యతిరేకిస్తున్నట్లు గానీ ప్రకటించలేదు. అందుకే ద్రవిడ సిద్దాంత పార్టీలతో గానీ, ఈ సిద్దాంతాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీతో గానీ విజయ్ ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు. ఈ అంశంలో ఆయన చాలా తెలివిగా రాజకీయ చతురతతో అడుగువేశారు. కాగా, ద్రవిడ పార్టీలు.. గత దశాబ్దాలుగా నాస్తికవాదాన్ని సమర్ధిస్తూ వచ్చాయి. దైవం పట్ల వ్యతిరేకతను ఆయా పార్టీలు బహిరంగానే చాటాయి. మరీ ముఖ్యంగా ఈ విషయంలో డీఎంకే పార్టీ చాలా దూకుడుగా వ్యవహరించి.. హిందువుల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో ఉదయ్ నిధి స్టాలిన్ పోల్చడం అప్పట్లో తీవ్ర దుమారమే రేపింది. కానీ విజయ్ మాత్రం.. ఇందుకు భిన్నంగా దైవ భక్తి ఉన్నవారిని, అన్ని మతాలను కలుపుకుపోయే విధంగా సమ్మిళిత రాజకీయాలను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.