ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెదో దారి.. అన్నట్టుగా ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం. కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తోంది. ఆమె మాట్లాడే ప్రతీమాట, బీఆరెస్పై చేస్తున్న ప్రతి విమర్శను నిశితంగా పరిశీలిస్తోంది. ఆమె కేసీఆర్పై సంధించిన విమర్శలనే తమ అస్త్రాలుగా సంధించేందుకు వాడుకుంటున్నది. కవిత అడిగిన ప్రశ్నలు… నిలదీసిన వాటిపై జవాబు చెప్పండి ముందు.. అని కేటీఆర్ను, కేసీఆర్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు ఇదే విధానంతో ముందుకు పోతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి కీలకమైన ఈ ఇరువురు తీసుకున్న రాజకీయ స్టాండ్ను మిగితా వారు అందిపుచ్చుకోవాలి.
దాన్ని ఫాలో కావాలి. కానీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాత్రం దీనికి రివర్స్గా సాగింది వ్యవహారం. ఆయనెప్పుడూ అంతే. పార్టీ ఏదో లైన్ తీసుకుంటుంది.ఈయన ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడు. మీడియాకు మంచి ఫీడ్ను ఇస్తాడు. తెలిసి మాట్లాడుతాడో.. తెలియక అమాయకంగా వ్యాఖ్యలు చేస్తాడో.. లేదా వ్యూహంలో భాగంగా సర్కార్నే ఇరుకున పెట్టే విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతాడో ఎవరికి తెలియదు. తాను మాత్రం ఇలా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తాడు. ఆ మాటలు ఏవైనా పార్టీకి ఉపయోగపడతాయా? అంటే.. పైసా మందం కూడా ఉపయోగం లేకపోగా.. బూమరాంగై కూర్చుంటాయి. ఇదిగో ఇప్పుడు కవితపై అలాంటి వ్యాఖ్యలే చేశాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కేసీఆర్ను ఉద్యమకారుడన్నాడు. ఆయన వళ్లే తెలంగాణ వచ్చిందనే విధంగా వ్యాఖ్యానించాడు. ఉద్యమ నాయకుడి కూతురిగా ఆమె బయటకు రావడం… పార్టీ పెట్టడం పెద్ద జోక్ అన్నాడు. తండ్రి పెట్టిన పార్టీ పేరునే తెలివిగా తీసుకుని ఆ టీఆరెస్ పార్టీ పేరుతో ఏవో నాలుగు సీట్లు సంపాదించి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నదన్నాడు. అసలు ఆమె నిలుచున్న చోటైనా గెలుస్తుందా? అని మళ్లీ నోరు జారాడు. కుటుంబ వ్యవహారం, గొడవలు జరిగితే పార్టీ పెట్టాలా? తండ్రిని తిట్టాలా? ఇక్కడే ఆమె ఘోరంగా విఫలమైందని, జనం ఆమెను యాక్సెప్ట్ చేయడం లేదని అనడమే కాదు… తండ్రంటే కూతురికి ఎంత ప్రేముంటుంది? కూతురంటే కూడ తండ్రికి ఎంత ప్రేముంటుంది? అని ఆ ప్రేమను కాదని .. ఇలా తండ్రిని తిట్టడం బాగలేదని విమర్శించాడు రాజగోపాల్రెడ్డి. తామొకటి తలిస్తే.. అన్నట్టుగా కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో కవిత పార్టీ, ఆమె బీఆరెస్పై చేస్తున్న విమర్శలను కీలకంగా తీసుకుంటున్నది.
ఇవి కాంగ్రెస్కు ఉపయోగపడే అంశాలు. రాజకీయ అస్త్రాలు కూడా. మరి ఆ పార్టీ లైన్ కూడా గ్రహించని ఈ లీడర్ ఎలా మంత్రి పదవిని ఆశిస్తున్నాడో..? అనే డిస్కషన్ మొదలైంది. మళ్లీ అదే మీడియాతో..తనకు అధిష్టానంపై నమ్మకముంది..! మంత్రి వర్గ విస్తరణలో తనకు చాన్స్ వస్తుందనుకుంటున్నా.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తా..! అని కూడా కామెంట్స్ చేశాడు. డ్యామేజీ చేసేది చేసి.. పార్టీని ఇబ్బంది పెట్టి.. బెదిరింపు రాజకీయాలు నడిపి.. ఎడ్డెం అంటె తెడ్డం అని వ్యాఖ్యలు చేసి.. చివరాఖరులో అధ్యక్షా! అని అమాయకంగా ముఖం పెట్టడం రాజగోపాల్రెడ్డికే చెల్లుతుంది. ఇదే ఇప్పుడు చర్చించుకుంటున్నారు.