డీలిమిటేషన్ అంశం ఏమో గానీ తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ రగిలించారా? అన్నట్టు రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. గురువారం పార్లమెంటులో మహిళా చట్ట సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్కు సంబంధించిన మూడు బిల్లులు పార్లమెంటు ముందుకు వచ్చాయి. కేంద్ర మంత్రి అర్జున్ మేఘావల్ ఈ మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు.అనంతరం బిల్లులపై చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానంగా ఎంపీ తేజస్వి సూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ మీద బీజేపీ ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ఆలోచన కూడా కేంద్రానికి లేదన్నారు.
బిల్లులపై చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎంపీ తేజస్వీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి ఎందుకు ఆమోదించకుండా వదిలేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అంతేకాకుండా యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం విభజన దారుణంగా జరిగిందని.. ఇండియా, పాక్ విభజన కంటే దారుణంగా చేశారని ఎద్దేవా చేశారు. దీంతో ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలు తేజస్వీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆయన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజం గొంతెత్తింది.
తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చినందుకు బీజేపీ ఎంపీ తేజస్వీ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. తేజస్వీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదిలాఉండగా, తేజస్వీ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం వెనుకేసుకొచ్చింది. తేజస్వీ అన్నదాంట్లో తప్పు ఏమీ లేదని, ఆనాడు తెలంగాణ ఏర్పాటు కోసం బిల్లు మీద చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష ఎంపీలను బయటకు పంపించి పార్లమెంట్ డోర్లు క్లోజ్ చేసి మరి మూజువాణి ఓటుతో తెలంగాణను ఏర్పాటు చేశారని.. కానీ, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పుడు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఎటువంటి గొడవలు, నిరసనలు లేకుండా చర్చ జరిపాకే ఆమోదం కోసం చూస్తున్నదని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని ఎంపీ తేజస్వీ సైతం క్లారిటీ ఇచ్చారు.
పైసలు పక్కదారి పడితే మీ పని పటా పంచెలే.. కలెక్టర్ వార్నింగ్!
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందుతాయా? అని నాయకులు, పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపంగా మారిందని గురువారం రాత్రి కేంద్రం గెజిట్ విడుదల చేసింది. నిన్న లోక్సభ సభ్యులు( అధికారం+ ప్రతిపక్షం) మద్దతు తెలపడంతో మహిళా రిజర్వేషన్వ బిల్లు ఆమోదం పొందినట్టు తెలిసింది. మొత్తానికి వుమెన్ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడటంతో రాజకీయాల్లోకి రావాలనే ఆశతో ఉన్న మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. మరోవైపు ఈ టెన్షన్ ఉండగానే ఎంపీ తేజస్వి వ్యాఖ్యలతో మరోసారి రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ తెరమీదకు వచ్చింది.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాగృతి అధ్యక్షురాలు కవిత, విపక్షాలు, సీనియర్ లీడర్లు సైతం ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు.