దేశం కోసం .. ధర్మం కోసం అనే ముసుగులో కేవలం రాజకీయాలు చేసినా చెల్లుబాటవుతున్న రోజులివి. వాటికే బ్రహ్మాండమైన మద్దుతు లభిస్తున్న తీరు ప్రస్తుతం దేశం ముందున్నది. కానీ కాంగ్రెస్.. ఆశయాలు.. సిద్దాంతాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. కాంగ్రెస్ చరిత్ర లోతుల్లోకి పోవడం లేదు. సోనియా గాంధీ గురించే ఇప్పుడు చర్చించుకునేది. ఇప్పుడే ఎందుకు? అని అంటే.. ఇవాళ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా. ఓ ముచ్చట తెరపైకి వచ్చింది.
మన తెలుగు రాష్ట్రాల గురించే చెప్పుకుందాం. రాజశేఖర్రెడ్డి హఠాన్మరణం తరువాత .. కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు పార్టీ కనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. ఎక్కడా ఒత్తిడికి లోను కాలేదు. కష్టకాలంలో ఓ పార్టీ ఎలా వ్యవహరించాలె..? ఆ పార్టీని నడిపే పెద్ద ఎలా నిర్ణయాలు తీసుకోవాలో.. సోనియాను చూసి నేర్చుకోవచ్చు. ఆ నిర్ణయాలు అప్పటి సందర్భంలో ఆ పార్టీకి నష్టమే కలిగించి ఉండొచ్చు. అధికారానికి దూరం చేసి ఉండొచ్చు. ఆకాశం నుంచి ఒక్కసారిగా ఢాం అని కిందపడేయనూ వచ్చు. కానీ సోనియా తొణకలేదు. బెణకలేదు.
ఆమె అనుకున్న సిద్దాంతానికే కట్టుబడింది. రాజకీయాలను, ఆ తరువాత జరిగే పరిణామాలనూ ఆమె ఏనాడూ పట్టించుకోలేదు. మాటిస్తే నిలుపుకునే రకం. కానీ అవతలివారు కూడా అలాగే ఉండరు కదా! అదే జరిగింది కాంగ్రెస్ పార్టీ విషయంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో. వైఎస్ మరణం తరువాత సీఎం కావాలన్నది జగన్ ఆకాంక్ష. అందరూ ఆశలు రేపారు. కానీ అది పార్టీ సిద్దాంతం కాదని తేల్చింది సోనియా. అక్కడే జగన్ వేరు కుంపటి ఆలోచన.. పార్టీ నష్టానికి దారి తీసింది. ఆయనా వెనుకడుగు వేయలేదు సోనియా.
క్రమంగా పార్టీ ఉనికే లేకుండా పోయింది ఏపీలో. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడా ఆమె ఇచ్చిన మాటకే కట్టుబడ్డారు. కానీ ఇక్కడ మాటిచ్చి మాయ చేసి మోసం చేసింది మాత్రం కేసీఆర్. పార్టీని విలీనం చేస్తా అన్నాడు. సీఎం పదవి అన్నాడు. పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకోలేదామె. కానీ తెలంగాణ మాత్రం ఇచ్చింది. అది తానే తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్.. తన అధికారాన్ని కాపాడుకోగలిగాడు.
ఇచ్చిన కాంగ్రెస్ను నామరూపాల్లేకుండా చేయగలిగాడు. మూడోసారి కాంగ్రెస్కు అధికారం ఇచ్చింది కూడా ఇక్కడ సోనియా సభలో.. ఒక్కసారి అవకాశం ఇవ్వండనే ఆ మాట తెలంగాణ గుండెలకు తాకింది. ఇచ్చిన అధికారాన్ని ఎంతకాలం కాపాడుకుంటారో ఇప్పటి పాలకుల చేతుల్లో ఉంది. కానీ పార్టీని పూర్తిగా నాశనం చేసిన చరిత్ర కేసీఆర్ది అయినా.. ఎప్పుడూ కేసీఆర్ పట్ల ఆమెకు వ్యతిరేకత లేదు.
జగన్ పార్టీని అడుగు పట్టించినా.. అతన్ని వైఎస్ బిడ్డగానే ఆమె చూస్తున్నది తప్ప..విలన్గా చూడలేదు. రాజకీయాల కోసం ఆమె సిద్దాంతాలను వదులుకోలేదు. అధికారం కోసం రాజకీయాలనూ నడపలేదు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కష్టనష్టాలను చవి చూసింది. ఓ కేసీఆర్, ఓ జగన్ ఇద్దరూ సోనియాను మోసం చేశారు.
పార్టీ పంచన ఉంటూ.. పార్టీ వల్ల లాభం పొంది.. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా వీరిద్దరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాతాళానికి తొక్కేస్తే.. ! తెలంగాణలో సీన్ మారింది. మరి ఏపీలో ఇంకా ఆ మోసం చేసిన దెబ్బ గాయాలు మానలేదు. అక్కడ పార్టీ ఇంకా నష్టాల్లోనే ఉంది. అధికారం కోసం కేసీఆర్, జగన్ మాటతప్పారు. రాజకీయంగా తమ తోవ తాము చూసుకున్నారు. సోనియా అనుకున్న మాటమీదే ఉంది. ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంది. ఇదీ వీరికి, ఆమెకూ ఉన్న తేడా!