Nizamabad: నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో జరిగిన భర్త హత్య ఉదంతం మరువకముందే.. మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి నరకం చూపిస్తున్నాడనే కోపంతో.. భార్య, కన్న కొడుకు, కోడలు కలిసి ఇంటి యజమానిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మద్యం మత్తులో గొడవ..
పోలీసుల వివరాల ప్రకారం.. మోపాల్ మండలంలోని అమ్రాబాద్ తండా గ్రామపంచాయతీ పరిధిలో గల కొక్య నాయక్ తండాకు చెందిన బానవత్ హరి (55) అనే వ్యక్తికి మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను శారీరకంగా, మానసికంగా వేధించడం అతడికి అలవాటుగా మారింది. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా హరి పూర్తిస్థాయిలో మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు.
పక్కా స్కెచ్తో అంతమొందించారు
రోజూ పడుతున్న నరకానికి ఎలాగైనా ముగింపు పలకాలని భావించిన కుటుంబ సభ్యుల సహనం ఆ రాత్రి వీడింది. భార్య, కొడుకు, కోడలితో పాటు కొడుకు బావమరిది కూడా జతకలిశారు. అందరూ కలిసి హరిపై దాడి చేశారు. భార్య, కోడలు కలిసి గొంతు నులిమి గట్టిగా పట్టుకోగా.. కొడుకు, అతని బావమరిది కలిసి హరి మర్మాంగాలు దెబ్బతినేలా బలంగా కొట్టి, ఊపిరాడకుండా చేసి అక్కడికక్కడే ప్రాణాలు తీశారు.
Also Read: మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 15 మంది
రంగంలోకి దిగిన పోలీసులు
మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘోరం బుధవారం ఉదయం బయటపడటంతో స్థానికులు షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న మోపాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.