చేసిందంతా చేసి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు పురుగులను చూసినట్టు చూశారు. ఎవరినీ దగ్గరకు రానీయలేదు. తమ పార్టీ ఎదుగుదలకు, అధికారంలోకి రావడానికి కారణమైన ఆ పార్టీ క్యాడర్ను విస్మరించారు. ఉద్యమకారులనైతే దరిదాపుల్లోకి కూడా రానీయలేదు. ఇకపై మాది ఉద్యమపార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని కేటీయారే స్వయంగా అధికార దర్పం తొణికిసలాడగా ప్రకటించిన ఆ కామెంటే .. ఆ పార్టీ నాశనానికి ఆనాడు పడిన మొదటి పునాది. కానీ గుర్తించడానికి పదేళ్లు పట్టింది.
ఇవాళ కేటీఆర్ స్వయంగా ఆ ప్రస్తావన తీశాడు. కూకట్పల్లి నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ ఈ విషయాన్ని మరీ మరీ నొక్కి చెప్పాడు. చాలా మంది తన వద్దకు వచ్చి చెబుతున్నారట. అన్నా.. అప్పుడు మమ్మల్ని కనీసం పట్టించుకోలేదన్నా.. మేము ఎంతగానో పార్టీ కోసం పనిచేశాం.. పదవులు లేవు.. పట్టింపులేదు.. అని మొరపెట్టుకున్నారట. అవును.. నిజమే మేము ఆనాడు పట్టించుకోలేదు. తెలంగాణ అభివృద్ధి మీదే దృష్టి పెట్టి మిమ్మల్ని పట్టించుకోవడం కుదరలేదని.. కవర్ చేసుకునే ప్రయత్నం చేసిన కేటీఆర్ వెంటనే ఆ వేదిక మీదుగా తన పశ్చాత్తాపం ప్రకటించాడు. ఆ విధమైన మాటలతో వారిని కన్విన్స్ చేసి మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇకపై కార్యకర్తలను పట్టించుకుంటామన్నాడు.
ఉద్యమకారులను కూడా కడుపులో పెట్టి చూసుకుంటామని జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో భాగంగా తియ్యటి మాటలైతే చెప్పాడు. వారెంత వరకు నమ్మారో.. నమ్ముతున్నారో తెలియదు కానీ.. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు టీఆరెస్ చీఫ్ కవిత.. ఉద్యమకారుల విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమ పరిస్థితి మరీ ఘోరంగా ఉండబోతుందని అంచనా వేసుకున్నారు కాబోలు.. కేటీఆర్ కూడా మారిన మనిషిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ రీతిన మాట్లాడుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నమైతే చేశాడు ఈ వేదికగా. కచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం.. రాగానే ప్రభుత్వ పదవులు, లేకపోతే పార్టీ పదవులు ఇలా ఏదో ఒకరకంగా ఆదుకుంటాం.
అందరినీ పట్టించుకుంటాం.. అని పశ్చాత్తాప పలుకులు పలికిన కేటీఆర్.. దయచేసి ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వచ్చేలా అందరూ సమిష్టిగా కష్టపడండి అనే వేడుకోలు మాటలు కూడా మాట్లాడాడు. ఈ మాటలకు ముందు.. మళ్లీ పాత మాటలనే వళ్లెవేశాడు. మేం చెబితే వినలేదు. గ్రామీణ ప్రాంతాల్లో జనం కాంగ్రెస్ మాటలకు మోస పోయారు. సిటీలో మనవైపే ఉన్నారు. అంటూ గ్రామీణ ఓటర్లను అవమానించే రీతిలోనే.. వారిని తప్పుబట్టే విధంగానే గతంలో మాట్లాడిన మాటల మాదిరిగానే సాగింది కేటీఆర్ ప్రసంగం. ఆ తరువాత మారిన మనిషి రూపంలోకి పరకాయ ప్రవేశం చేసి వెంటనే పశ్చాత్తాపంతో కూడిన ప్రాధేయపూర్వక మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు.
ప్లీజ్ ప్లీజ్ క్షమించండి.. మళ్లీ అలాంటి పొరపాట్లు చేయం.. కడుపులో పెట్టి చూసుకుంటాం.. అందరినీ కాపాడుకుంటాం.. పదవులిస్తాం.. పార్టీలో మంచి పొజిషన్ ఇస్తాం.. నమ్మండి.. ప్లీజ్ నమ్మండి.. నిజ్జంగా! అనే విధంగా కేటీఆర్ కొత్త పలుకులు పలికాడు ఈ వేదికగా. అంతే కాదు.. కవిత ఏ వర్గాలతోనైతే దగ్గరవుతున్నారో ఆ సెక్షన్ల వారిని ఉద్దేశించి కూడా పనిలో పనిగా తాము న్యాయం చేస్తామని, మా ప్రభుత్వం రాబోతుందని మైలేజీ ఇతర పార్టీలకు పోకుండా.. తమ పార్టీ ఖాతాలో వేసుకునే నక్కజిత్తుల మంత్రాన్ని కూడా ఈవేదిక మీద నుంచి జపించాడు కేటీఆర్.
మొత్తానికి జనాన్ని నమ్మించే ప్రయత్నంలో తన మాటలతో వారిని మచ్చిక చేసుకునే క్రమంలో పరితపించిన ప్రసంగమే చేశాడు. కానీ ఆ మాటలను ఎవరు ఎంత వరకు విశ్వసించారు? నమ్ముతున్నారా? వారితో కలిసే ఉన్నారా? ఎప్పుడో విడిపోయే ఇతర పార్టీల పంచన చేరారా? అనే ప్రశ్నలకు సమాధానాలు కేటీఆర్కే కరెక్టుగా తెలుసు.