ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జాప్యమవుతూ వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సమయం తీసుకుంటున్నది. సర్పంచు ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను వెంట వెంటనే నిర్వహించిన సర్కార్కు ఆ ఎన్నికల్లో మంచి ఫలితాలే వచ్చాయి. ఇదే దూకుడు మీద ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తుందని అంతా అనుకున్నారు. కానీ తీవ్ర జాప్యమే జరుగుతున్నది. అయితే సర్కార్ గతంలో పాటించిన పాత విధానంలో జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే ఎట్లా ఉంటుంది? అని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ ఎన్నికలు ఐదంచెల విధానంలో నిర్వహిస్తున్నారు. మూడంచెల విధానంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అంటే పరోక్ష ఎన్నిక కాకుండా.. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికలకు పోవడం. గతంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కూడా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరిగేది. 1992 తరువాత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఈ ఈ మూడంచెల విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టారు. అయితే అది అమలు చేసే విషయాన్ని మాత్రం రాష్ట్రాలకే అధికారాలిచ్చారు. దీంతో ఉమ్మడి ఏపీలో ఇది అమలైంది. ఇప్పటికీ మహారాష్ట్ర , మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నారు. అయితే ఈ విధానం అమలు ద్వారా ఎంపీటీసీలు, జడ్పీటీసీల వ్యవస్థలు పూర్తిగా రద్దై పోతాయి. ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లే ఉంటారు. సర్పంచులు ఎంపీపీలను ఎన్నుకుంటారు.
జడ్పీ చైర్మన్ను నేరుగా ఆ జిల్లా ప్రజలే ఓటేసి ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది. జడ్పీటీసీల అవసరం లేదు కనుక.. నేరుగా ప్రజలు తమకు ఇష్టమైన వారిని జడ్పీ పీఠంపై కూర్చోబెట్టే చాన్సు ఉంది. ఎంపీపీలు జిల్లా పరిషత్లో డైరెక్టర్లుగా ఎంపిక అవుతారు. వారే జడ్పీ వైస్ చైర్మన్ను ఎన్నుకుంటారు. ఈ పాత విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలే నిర్ణేతలుగా జడ్పీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది కదా అనే కోణంలో సర్కార్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఆశించిన వారికి ఇది నిరాశే మిగల్చనుంది. వాస్తవానికి, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పంచాయతీరాజ్ విభాగంలో పెద్దగా ప్రయోజనం లేనిదనే చెప్పాలి.
వారికి ప్రత్యేక విధులు లేవు. నిధులూ లేవు. ఎంపీటీసీలు ఎంపీపీలను ఎన్నుకుంటారు. జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ను ఎన్నుకుంటారు. ఆ తరువాత వారికి పనేం ఉండదు. ప్రత్యేక కార్యాలయాలు కూడా ఉండవు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా వీరి ఓటు ప్రాధాన్యత ఉంటుంది. అంతే తప్ప ఆ తరువాత వీరంతా ఆరో వేలులాగే పెద్దగా ప్రజలకు ప్రయోజనం లేని పదవుల్లో కొనసాగుతున్నట్టే లెక్క. అందుకే సర్కార్ ఆ పాత మూడంచెల పద్దతిని ఎంచుకుని ప్రత్యక్ష ఎన్నికకు పోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.