ఇదేంటీ! చంద్రబాబుపై బీఆరెస్ పార్టీలో చర్చించేందుకు ఏముంది? అనుకుంటున్నారా? ఓ వైపు తండ్రి, మరోవైపు కొడుకు.. ఇద్దరూ చంద్రబాబు విషయంలో చెరోస్టాండ్ తీసుకోవడం ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చకు వస్తోంది. కేటీఆర్ ఈ మధ్య చంద్రబాబు పాలన ఉత్తమ పాలనగా కితాబిచ్చాడు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటామనే మాట కూడా చెప్పారు. దానికో వ్యూహం ఉంది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్.. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం.. అనే పాత నినాదాలకు కాలం చెల్లింది. ఆ విషయం కేటీఆర్కు తెలుసు. ఓడిన తరువాత నేల విడిచి సాము చేయకుండా.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? వాస్తవలేమిటో..? జనం నాడి ఎలా ఉందో..? తెలుసుకునే ప్రయయత్నం చేస్తున్నాడు కేటీఆర్.
అందుకే రాజకీయ లౌక్యాన్ని ప్రదర్శించడంలో భాగంగానే ఆయన చంద్రబాబును పొగిడాడు. హైదరాబాద్లో బీఆరెస్కు మంచి పట్టుంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో సీట్లు గణనీయంగా కోల్పోయిన బీఆరెస్… హైదరాబాద్, దాని శివారు ప్రాంతాల్లో మేజర్ సీట్లు గెలుపొందింది. దీంతో ఇక్కడ పార్టీని ఇలాగే బలోపేతంగా ఉంచి, అధికార పార్టీని ఢీకొట్టాలని భావిస్తున్నాడు కేటీఆర్. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలుపొంది.. మెల్లగా హైదరాబాద్లో పాగా వేసింది. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తన పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇక్కడ సెటిలర్లు, టీడీపీ శ్రేయోభిలాషులు, కార్యకర్తల మద్దతు కావాలని రెండు పార్టీలు కోరుకుంటున్నాయి. దీంతో పాటు టీడీపీ కూడా జీహెచ్ఎంసీలో పోటీ చేసే ఆలోచన చేస్తున్నది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. గడిచిన రాజకీయాలను మరిచి, ప్రస్తుత అవసరాలకే ప్రాధాన్యతనిస్తున్నాడు కేటీఆర్. కానీ కేటీఆర్ వ్యూహాన్ని కేటీఆర్ దెబ్బతీశాడు. జగిత్యాలలో జరిగిన సభలో .. ఆయన చంద్రబాబును ఇంకా తెలంగాణ వ్యతిరేకిగా ప్రజల ముందుంచే ప్రయత్నం చేశాడు. తన గత చరిత్ర చెప్పి జనాల్లో సెంటిమెంట్ రాజేసే క్రమంలో ఆయన పాత చరిత్రంగా చెప్పుకుంటూ వచ్చాడు. విద్యుత్ చార్జీల పెంపుతో తాను తిరగబడ్డానని, తెలంగాణకు టీడీపీతో మేలు జరగదని తెగేసి చెప్పి బయటకు వచ్చానని ఆయన పాత విషయాలను ఇక్కడ అసందర్భంగా ప్రస్తావించారు.
ఇప్పుడిదే కొంప ముంచిందంటున్నారు బీఆరెస్ శ్రేణులు. కాంగ్రెస్లోకి రేవంత్రెడ్డి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు మనిషిగానే చూస్తున్నది బీఆరెస్ పార్టీ. చాలా సందర్బాల్లో రేవంత్ను ఇరుకున పెట్టేందుకు ఈ అస్త్రాన్ని బాగా వినియోగించారు. ఓటుకు నోటు కేసును కూడా బాగా వాడుకున్నారు. కానీ రేవంత్ సీఎం అయిన తరువాత.. బీఆరెస్ ఓటమి తదనంతర పరిణామాల నేపథ్యంలో.. టీడీపీకి దూరం కావొద్దనేలా కేటీఆర్ ప్రవర్తన మారింది.
వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్నీ తానై చూసుకుంటున్న కేటీఆర్.. తన వ్యూహాలేవో తను చేసుకుంటున్నాడు. అన్నీ తండ్రితో చర్చించే సీన్ లేదు. ఆయన వినడు కూడా. కానీ మారిన కొడుకు స్టాండ్ ఏంటీ? ఏం మాట్లాడుతున్నాడో కూడా కేసీఆర్ చూసినట్టు లేడు. గమనించి ఉండడు. ఒకవేళ ఇదే జరిగితే .. మొన్న జగిత్యాల సభలో చంద్రబాబు ప్రస్తావన రాకపోయేది. కేసీఆర్ మళ్లీ మూస పోకడలు పోతూ.. తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్కవుట్ కాదని కేటీఆర్కు తెలుసు. కేటీఆర్ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ.. రాజకీయ లౌక్యాన్ని ప్రదర్శిస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఇంకా ఫామ్హౌజ్ రాజకీయాలనే నడుపుతున్నాడనే వాదన ఆ పార్టీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తోంది.