ఇప్పుడు అంతా ఎవరి నోట విన్నా బీజేపీ మాటే వినిపిస్తున్నది. మొన్నటి వరకు పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ప్రభుత్వ ఏర్పాటు. ఆ తరువాత మోడీ రాక.. ఒక ఏడాది పాటు బంగారం కొనండనే పిలుపు.. ! అదే క్రమంలో బండి సంజయ్ కొడుకు.. పోక్సో కేసు.. ఉదంతం.. ! ఏ పార్టీ నోటి వెంట విన్నా.. ఏ నలుగురు కలిసినా.. బీజేపీ బీజేపీ.. బీజేపీ! మోడీ, అమిత్ షా.. బండి సంజయ్..! ఇప్పుడైతే ఈ అంశాలే వైరల్గా ఉన్నాయి. అయితే బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి పదవి పైనా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
అయితే బండి సంజయ్లాగే అంచలంచెలుగా ఎదిగి, పార్టీలో కష్టపడి పైకి వచ్చి ఉన్నత స్థానానికి చేరుకున్న బంగారు లక్ష్మణ్ గురించి ఆ పార్టీ సీనియర్లు గుర్తు చేసుకుంటున్నారు. హైదరాబాద్కే చెందిన బంగారు లక్ష్మణ్ దళితుడు. లా చదివిన విద్యావంతుడు. ఆరెసెస్ నుంచి ఎదిగిన నేత. బీజేపీలో కింద స్థాయి నుంచి పనిచేసి కేంద్ర మంత్రి పదవితో పాటు.. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడి హోదానే దక్కించుకుని రికార్డుల్లో నిలిచివాడు. మామూలుగా బీజేపీలో దళితులకు అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. అగ్రవర్ణాల పార్టీగా బీజేపీకి పేరుంది. అందులో ఓ దళితుడు.. అదీ దక్షిణాది రాష్ట్రాల నుంచి .. అదే మన హైదరాబాద్ నుంచి జాతీయ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు దక్కించుకున్నాడంటే.. దాని వెనుక ఎంతటి శ్రమ.. నిబద్దత, అకుంఠిత దీక్ష దాగున్నాయో అర్థం చేసుకోవచ్చు.
బీజేపీ పెద్దలు కూడా దళితుడైన బంగారు లక్ష్మణ్కు జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా … పార్టీకి దళత వర్గాన్ని దగ్గర చేసుకోవడంతో పాటు.. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలనే యోచన దాగుంది. కానీ ఇదెంతో కాలం నిలవలేదు ఆయనకు. కుట్రలు పన్నారు. ఆ పార్టీకి చెందిన ఓ పెద్ద.. ఏపీకి చెందిన ఆ నేత పేరు చెబుతారు…? తెహల్కా స్టింగ్ ఆపరేషన్ ద్వారా లంచం తీసుకుంటుండగా తీసిన వీడియో… లక్ష్మణ్ ఇటుక, ఇటుక పేర్చి నిర్మించుకున్న సౌధాన్ని ఒక్కసారిగా కూల్చేసింది. ఆ వెంటనే ఆయన రాజీనామా చేయడం.. ఇవన్నీ చకా చకా జరిగిపోయాయి. పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. దేశ రాజకీయాల్లో ఈ అంశం పెద్ద దుమారమే లేపింది.
2012లో ఆయన్ను కోర్టు దోషిగా తేల్చి శిక్ష కూడా విధించింది. అదే సంవత్సరం ఆయన చనిపోయారు. తెహల్క స్టింగ్ ఆపరేషన్ ఈ సంఘటనతోనే మొదలైంది. మీడియాలో స్టింగ్ ఆపరేషన్లు చేయడం అది వరకు. దీన్ని బంగారు లక్ష్మణ్ మీదే ప్రయోగించి.. ఆయన రాజకీయ జీవితాన్ని, తద్వారా ఆయన ఈ లోకంలోనే లేకుండా చేసేసింది. హైదరాబాద్కు చెందిన ఓ దళిత నేత .. ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్లగలడు? ఎంత ప్రతిభ ఉంటే అందరివాడు అనిపించుకోగలడు. కానీ ఓ చిన్నపొరపాటు. తప్పటడుగు.. ఆయన చరిత్రను తిరగరాసింది. గొప్ప రికార్డును డ్యామేజీ చేసేసింది. దళిత వర్గాలకు ఆయన ఆదర్శంగా నిలిచాడు.
ఈ మచ్చలేకపోతే..ఆయన ఇంకా రాజకీయాల్లో మనగలిగేవారేమో. ఆయన తెలంగాణలో ఓ కీలక నేతగా ఎదిగి వారేమో..! అంతే కొన్ని కొన్ని సంఘటనలు.. ఒక్కసారిగా జీవితాలను యూటర్న్ తీసుకునేలా చేస్తాయి. గతి తప్పి.. గమ్యం మారి అగమ్యగోచరంలో జీవితాలను నెట్టేస్తాయి. చివరకు విషాదాంతాలుగా మిగులుతాయి. ఇక్కడ బండి సంజయ్ విషయంలో పార్టీలో శ్రతువులు అతని నాశనాన్ని కోరుకున్నా.. అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కొడుకు తెచ్చిన మచ్చ ఆయన రాజకీయ జీవితానికి, ఇంచు ఇంచు పెంచి పోషించుకున్న పార్టీ భవితవ్యానికి తెచ్చే నష్టమేమీ లేకపోయినా.. ఇదో దేశ స్థాయిలో చర్చకైతే దారి తీసింది.