పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెడుతున్నాయి.మొన్నటివరకు తెలంగాణలో ఎదురైన కొరత ఇప్పుడు ఏపీకి పాకింది. పలు పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.దీంతో ఏపీ వాసులు పెట్రోల్, డీజిల్ దొరకదని భయాందోళనకు గురవుతున్నారు. పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో సామాన్యులకు పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. ఇప్పటికే చాలా బంకుల్లో డీజిల్ కొరత వేధిస్తున్నది.దీంతో హెవీ వెహికల్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం అధికారపార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం భయం తగ్గడం లేదు. భయాంతో బంకులకు క్యూ కడుతున్నారు. బాటిల్స్, క్యాన్స్లో బల్క్లో ఫ్యూయల్ కొనుగోలు చేస్తుండటంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీనిపై నిన్న సీఎం చంద్రబాబు సైతం అత్యవసర సమావేశం నిర్వహించారు. బ్యాంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి తోడు ఇంధన రంగ సంస్థలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. అయితే, ప్రస్తుతం ఇంధన సరఫరా కాస్త తక్కువగా ఉందని వారు సీఎంకు విన్నవించినట్టు తెలిసింది. కానీ రెండ్రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని చెప్పినట్టు సమాచారం.
తెలంగాణలో ఎదురైన పరిస్థితే ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది. ఇక్కడ మొన్నటివరకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల చాలా బంకులు ఫుల్ పేమెంట్ చేయలేక ఫ్యూయల్ తీసుకోలేకపోయాయి. ఫలితంగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. డీలర్లు మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించాలని పట్టుబట్టడం, మొత్తం డబ్బులు ఇచ్చుకోలేకపోవడంతో బంకులు వెలవెలబోయాయి.ప్రస్తుతం ఏపీలోనూ డీలర్లు ఇదే కండీషన్ పెట్టడంతో బంకు యాజమానులు డీజిల్,పెట్రోల్ స్టాక్ కనిపించడం లేదు. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై సీఎం చంద్రబాబు ఆయిల్ కంపెనీ డీలర్లతోనూ సమావేశం అయ్యారు. లైన్ ఆఫ్ క్రెడిట్ ఎందుకు ఇవ్వడం లేదని వారిని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంధన కొరత రావొద్దని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
వాహనదారుల ఇబ్బందులపై ప్రతిపక్ష వైసీపీ నెగెటివ్ ప్రచారం చేస్తున్నదని కూటమి సర్కార్ ఆరోపిస్తున్నది. ఇంధన కొరత గురించి నిజనిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడంపై ఏపీ మంత్రి సీరియస్ అయ్యారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కావాలని పుకార్లు పుట్టించడం వలన జనాలు పానిక్ బైయింగ్ చేస్తున్నారని.. పుకార్లు సృష్టించడం మానుకోవాలని హితవు పలికారు. కూటమి సర్కార్ మీద విషప్రచారం చేసి జనాల్లో భయాందోళనలు సృష్టించాలని వైసీపీనేతలు, సోషల్ మీడియా విభాగం చూస్తున్నదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అధికారులు ఎప్పటికప్పుడు స్టాక్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.