ఈ మధ్య ఇద్దరి నోటి వెంట సోషల్ మీడియా రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చింది. తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ ఈ మాటన్నారు. పొద్దస్తమాను ఆ సోషల్ మీడియాలోనే మునిగి తేలకండని. తాజాగా కేటీఆర్ కూడా అన్నారు. ఎప్పుడూ ఆ ఫోన్ చూసుడేనా? ఆ సోషల్ మీడియా పాడుగాను! అని. యథారాజ తథా ప్రజా అన్నట్టు.. వాస్తవానికి కేటీఆర్, కేసీఆర్ ఇద్దరూ సోషల్ మీడియాకు విపరీతమైన ప్రయార్టీ ఇస్తారు. అధికారం కోల్పోయిన తరువాత ఇది మరింత ఎక్కువైంది.
ఖాళీ సమయం దొరకడం, తమ ఓటమికి అదీ ఓ కారణమని వారు భావించడం..తో దానిపై దృష్టి పెట్టారు. ఎంతలా అంటే.. ఓడిన తరువాత ఫామ్హౌజ్కే పరిమితమైన కేసీఆర్.. సర్కార్ను ఘాటుగా విమర్శించే, ఎదురుదాడికి దిగే తమ సోషల్ మీడియా వారియర్స్ను గుర్తించి వారిని పిలిపించి మరీ మెచ్చుకునే లెవల్లో. ఆ ప్రచారం ఎలా పోయిందంటే.. మనం ఏం స్పందిస్తున్నామో.. ఎంతలా తిడుతున్నామో.. అన్నీ పెద్దసారు గమనిస్తున్నారు… ఎక్కువగా తిట్టి.. ఆయన నజర్లో పడాలె. ఒక్కసారి ఆయన పిలుపు రావాలె. పోయి ఫామ్హౌజ్లో కలవాలె.. అనే దాకా వచ్చిందట.
అందుకే కొంచెం విపరీత దోరణి కూడా అలవాటు చేసుకున్నారు. ఇక కేటీఆర్ అయితే.. ఓడిన తరువాత బాహాటంగానే చెప్పుకొచ్చారు. తాము మెడికల్ కాలేజీలకు బదులుగా యూట్యూబ్ చానెళ్లు పెట్టుకుని ఉంటే ఎంతో బాగుండేది.. గెలిచేవాళ్లమని. అంటే దాని ఉద్దేశం తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి .. ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ గెలిచిందని. అందుకే ఆయన కూడా సొంతంగా యూట్యూబర్స్ను, కొన్ని సైట్లను మెయింటేన్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే వీరిద్దరి నోటి నుంచి ఈ సోషల్ మీడియా గురించి తమ నేతలను వారించే పరిస్థితి ఎందుకు వచ్చిందా? అని చర్చ మైదలైంది. దీనికి కారణం.. పెద్దసారు, కేటీఆర్… ఈ ఇద్దరూ సోషల్ మీడియాకు అత్యంత ప్రయార్టీ ఇస్తుంటే.. మనమెందుకు వెనుకడుగు వేయాలె.. ? అని మిగిలిన నేతలంతా అదే బాట పట్టారట.
సర్కార్ ను విమర్శించడం. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దుమ్మెత్తిపోయడం.. పరుష పదజాలాలతో దూషణలకు దిగడం.. ఇలా అది ఓ వైఖరిని సంతరించుకుని ఎటో పోతున్నది. ఇక అందులోనే లీనమై బిజీ బిజీగా ఉన్నారట. ఎంత బిజీగా అంటే.. కనీసం జనంతో కలిసేంత టైం లేకపోవడం.. వారి సమస్యలపై ఆందోళనలు చేసే తీరిక దొరకకపోవడం.. ఉద్యమాలంటే సోషల్ మీడియా వేదికగానే చేయాలనే విధంగా వారి మనస్సుల్లో పాతుకు పోయేంతలా.. ఇది గమనించారు ఇద్దరు. దీంతో ఇది అసలుకే మోసం తెచ్చేలా ఉందని గ్రహించినట్టున్నారు.
అందుకే పరిస్థితిని కంట్రోల్లో పెట్టడానికి ఇలా వేదికల మీదనే వారిని వారిస్తున్నారట. ఈ విషయంలో కస్సుమంటున్నారట. ప్రజాక్షేత్రం వీడిన నేతలకు భవిష్యత్తు ఉండబోదని హెచ్చిరిస్తున్నారు. ఆ హెచ్చరికలు, వారింపులు.. మొత్తంగా సోషల్ మీడియాను వీడమని కాదు.. జనాలకు దూరం కాకండని. అంతేగానీ సోషల్ మీడియా రాజకీయాలు చేయకపోతే.. అందులో ఇతర పార్టీల నేతలతో తలపడకపోతే.. ధీటుగా జవాబులు చెప్పకపోతే.. ఓటమిలో అది కీలక పాత్ర పోషిస్తుందనేది కేసీఆర్, కేటీఆర్ గట్టిగా నమ్ముతున్నారు.
కానీ ఇక ఇదే మొత్తంగా అలవాటు కాకూడదనేది వారి ఉద్దేశ్యంగా ఉంది. కానీ ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పులతో.. ప్రజాక్షేత్రంలోకి పోయేందుకు బలవంతంగానైనాన అలవాటు చేసుకుంటున్నారట గులాబీ దళం.. ఎటుపోయినా.. చేతిలో ఫోన్ తప్పదు. అందులో కామెంట్లు, కౌంటర్లు.. తిట్లు, దూషణలు .. వీటిని మాత్రం విడిచేదే లేదంటున్నారు. ఈ ఇద్దరికీ కావాల్సింది కూడా ఈ రెండే.