పార్టీ ప్రధాన కార్యదర్శలు, రాష్ట్ర కమిటీతో భేటీ అయిన కేసీఆర్ .. సంస్థాగతంపై దృష్టి కేంద్రీకరించారు. మళ్లీ మొదటి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దాదాపు ఏడు గంటల పాటు సమావేశం నిర్వహించి … కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. కమిటీలన్నీ రద్దయిన నేపథ్యంలో మున్సిపాలిటీలకు, నియోజకవర్గాలకు సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా ఇంచార్జిలను నియమించాలని నిర్ణయించాడు.
మొత్తం డిజిటిల్ రూపంలో సభ్యత్వ నమోదు చేయాలని, గ్రామానికి ఇద్దరు చొప్పున బూత్ ఇంచార్జిలను నియమించుకుని వీరి ద్వారా డిజిటల్ రూపంలో సభ్యత్వ నమోదు చేయాలని తెలిపారు. క్రియాశీల సభ్యత్వానికి రూ. 50, సాధారణ సభ్యత్వానికి రూ. 10చొప్పున తీసుకోవాలన్నారు. గతంతో పోలిస్తే ఈ రుసుము సగానికి తగ్గించేశారు. అయితే 2 లక్షల రూపాయల బీమా విషయంలో మాత్రం కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేకపోయారు. ప్రత్యేకంగా శిక్షణ తరగతులను కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేయాలని చెప్పారు. అయితే ఆ తరువాత ఏర్పాటు చేయబోయే గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలలో మొత్తం 51 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుండాలని ఆ విధంగా 51 శాతం మేర ఆయా కమిటీల కూర్పులో వీరికి పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ స్పదించినట్టు తెలిసింది. రెండు పంటలు కలిపి బీఆరెస్ పాలనలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. మరి రేవంత్ సర్కార్ ఎందుకు ఈ పని చేయలేకపోతున్నది…? అప్పటికి ఇప్పటికీ ఏమిటీ తేడా? మనం ఎలా చేయగలిగాం..? వీరెందుకు చేయడం లేదు..? ఈ విషయం మనం అడగటం కాదు.. రైతులే నిలదీస్తున్నారు… అని ఆయన నాయకులతో చెప్పినట్టు తెలుస్తోంది. రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వారే నిలదీస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలి .. అని వారే స్వయంగా కోరుకుంటున్నారని, ఈ తరుణంలో నాయకులంతా వారికి అండగా ఉండాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు.
ఇకపై పార్టీ కార్యకలాపాల్లో కదలిక వస్తుందని, ఆ మేరకు అంతా రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించినట్టు తెలిసింది.