Medchal Railway: బొల్లారం స్టేషన్లో దిగాల్సిన ఓ యువకుడు నిద్రమత్తులో స్టేషన్ దాటిపోవడంతో మేడ్చల్ వద్ద కదులుతున్న రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న చాగంటి ఆంజనేయులు (40) బొల్లారం స్టేషన్లో దిగాల్సి ఉంది. అయితే నిద్రమత్తులో స్టేషన్ దాటిపోవడంతో మేడ్చల్ స్టేషన్ వద్ద రైలు ఆగదని భావించి కిందకు దూకాడు.
యువకుడు రైలు, ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోవడంతో ఆయన పొట్ట భాగంలో తీవ్ర గాయాలై ప్రేగులు బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్ కరుణాకర్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
Also read: ఢిల్లీకి మాజీ మంత్రి కొండా సురేఖ, అనుచరులతో భేటీ, మళ్లీ ఏం జరిగింది?
ఈఆర్సీపీ డాక్టర్ కాశిరెడ్డి సూచనల మేరకు ఆంజనేయులుకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఆంజనేయులు కొంపల్లిలోని సెంట్రల్ పార్క్ సాయ్ క్యాసిల్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు తెలిసింది.
Also read: ఫోన్ కెమెరాలో HDR ఆన్ చేస్తే ఏమవుతుంది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!