నిన్నటి వరకు ఒక లెక్క. ఇక నుంచి ఒక లెక్క… టీఆరెస్ పార్టీ ప్రకటన తరువాత కవిత మరింత దూకుడు ప్రదర్శించేలా కనిపిస్తున్నారు. పార్టీ ప్రకటన దాకా ఆమె కొంత సంయమనం పాటించినట్టుగా ఉన్నారు. ఎక్కడా కేసీఆర్, కేటీఆర్ పేర్లను ఉచ్చరించడానికి ఆమె ఇష్టపడలేరు. పరోక్షంగా విమర్శలు చేశారంతే. పార్టీ ఆవిర్భావ సభలో ఇక ఖుల్లం ఖుల్లాగా తన వాయిస్ను రేజ్ చేశారు. కేసీఆర్పై ఆమె మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును.. ఇక తాడోపేడో తేల్చుకుందామని బయటకు వచ్చిన తరువాత.. తన కన్నబిడ్డె పట్ల అంత కర్కశంగా ఉండి, నియంతృత్వ రాజకీయాలు నడుపుతానంటే ఆమెకు నచ్చలేదు. బయటకు వచ్చారు. దీన్ని తప్పుబట్టేవారున్నారు.
కానీ జనం కోసం ఓ రాజకీయ పార్టీని నడపడం అంత ఆషామాషీ కాదు. జనం మెచ్చే విధంగా వారితో మమేకమవడం అందరి తరమూ కాదు. ఇదేదో ఆవేశంలో కవిత తీసుకున్న నిర్ణయమూ కాదు. అవమనాలు భరించి భరించి.. చీత్కారాలు ఎదుర్కొని .. ఎదుర్కొని ఇక వారు మారరని డిసైడ్ అయ్యి.. జనానికి మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఇక తండ్రీ లేడు గిండ్రీ లేడు.. అన్నా లేడు.. గిన్నా లేడు.. జనమే ముఖ్యం. వారి సంక్షేమమే ఎజెండాగా ఆమె ముందుకు సాగాలని డిసైడ్ అయ్యారు.
అయినా ఆ తండ్రి తనను నమ్ముకున్న వారికి ఎంత మందికి మేలు చేశాడు? ఉద్యమకారులను పట్టించుకున్నాడా? బీసీలంటే ఎందుకు చిన్నచూపు? మహిళలను దగ్గరకు రానిచ్చాడా? వారికి పదవులిచ్చాడా? ఏ సెక్షన్ కేసీఆర్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసింది? అందుకే కవిత వేసిన అడుగు.. తీసుకున్న నిర్ణయం.. పూలబాటేం కాదు… కానీ సరైన నిర్ణయమే. కేసీఆర్ ఏం తప్పులు చేశాడో.. లోపాల పాలన సాగిన తీరేందో.. అంతా అంతా కవితకు తెలుసు. అవి తన పార్టీలో జరగొద్దని అనుకుంటున్నారు. మంచిదే కదా.
ఏ సెక్షన్లకైతే అన్యాయం జరిగిందో వారందరినీ చేరదీస్తానంటున్నారు. దీంట్లో ఎవరికేం నష్టం? అందుకే కవిత పార్టీకి జనం నుంచి మంచి స్పందనే వస్తున్నది. ఆమె పార్టీ పెట్టకముందు నుంచే అన్ని సమస్యలపై స్పందిస్తున్న తీరూ అభినందనీయంగానే ఉంది. ఇక ఇప్పటి నుంచి మరింత దూకుడుగానే ఉంటుంది ఆమె వేసే ప్రతీ అడుగు. అది బీఆరెస్ అనే కాదు.. కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది.