ఉద్యమకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కేకే కమిటీ ఉస్మానియా వర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాల నాయకులకు ఆహ్వానం పంపింది. రండి.. చర్చిద్దాం.. సంక్షేమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పండి..! అంతా కలిసి ఉద్యమకారుల సంక్షేమం కోసం ఓ నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందిద్దాం..!అని లేఖలు రాశారు.
ఈనెల 6న సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకంలో ఉదయం 11 గంటలకు సమావేశం అవుదామని వారికి సమాచారం అందించారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమయ్యింది కేకే కమిటీ. ఉద్యమకారులను ఎలా గుర్తించాలి..? అనే అంశంపై రాజకీయ నాయకులతో భేటీ అయ్యింది కమిటీ. ఈ మీటింగు తరువాత ఓ నాలుగు కేటగిరీలుగా ఉద్యమకారులను గుర్తించాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
కేసులు అయి జైళ్లకు వెళ్లిన ఉద్యమకారులు.. కేసులు అయిన వారు మాత్రమే… ఉద్యమంలో పాల్గొన్నవారు.. ఇలా కేటగిరీలుగా విభజించనున్నారు. దీన్ని బట్టి సర్కార్.. ఏఏ కేటగిరీకి ఎలాంటి సంక్షేమం అమలు చేయాలి..? అనే విషయంలోఓ క్లారిటీకి రానున్నది. పింఛన్, భూమి ఎవరెవరికి ఇవ్వాలి.. కేవలం పింఛన్ ఏ కేటగిరీకి చెందిన ఉద్యమకారులకు ఇవ్వాలి..? అనే అంశాలే సర్కార్ ముందున్న ప్రధాన అంశాలు.
ఇక అందరికీ గుర్తింపు కార్డులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత వైద్యం లాంటి సౌకర్యాలను కూడా అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. జార్ఖాండ్ తరహాలో ఉద్యమకారులకు సంక్షేమం ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. దీనిపైనా అధ్యయనం చేస్తోంది సర్కార్.
నెలకు 25వేల పింఛన్, 250 గజాల ప్రభుత్వ స్థలం ఇచ్చే విషయంలోనే సర్కార్ ఇబ్బందిగా ఫీలవుతోంది. వీటిని ఎంతమందికి అమలు చేయాలి..? అనే దానిపైనే క్లారిటీ కోసం కేకే కమిటీ అన్ని వర్గాలతో మీటింగులు పెడుతూ వారి సలహాలు తీసుకుంటున్నది. వారి అభిప్రాయాలను సర్కార్కు నివేదిస్తున్నది. అంతిమంగా ఓ క్లారిటీతో దీనిపై ఓ పాలసీ ప్రకటన చేయాలని సర్కార్ భావిస్తోంది.
కాగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఇప్పటి వరకు కేకే కమిటీలో భాగస్వామ్యం చేయలేదు. దీనిపై సర్కార్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని కోదండరామ్ గమనించారు. కేకే కమిటీలో సభ్యుడిగా ఉన్న కోదండరాంపైనే ఉద్యమకారులు ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఆయన ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి.. ఓయూ స్టూడెంట్స్ లీడర్స్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు.
ఈ పరిణామాల అనంతరం సర్కార్ తీసుకునే నిర్ణయాలపై కొంత ఉద్యమకారులకు నమ్మకం కుదరనుంది.