ఆర్టీసీ సమ్మె..కొనసాగుతున్న ఉద్రిక్తతలను సర్కార్ చాలా సీరియస్గా తీసుకున్నది. ఆర్టీసీ జేఏసీ డిమాండ్లన్నింటినీ పరిష్కరించేందుకు సర్కార్ దాదాపుగా సిద్దంగా ఉంది. ప్రధానమైన … ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.. ఈవీ బస్సులను ప్రైవేటుపరం చేయకుండా సర్కార్ నడిపించడం… ఈ రెండింటిపై చిక్కుముడిగా ఉండింది. శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల కూడా సర్కార్ వెంటనే తేరుకున్నది. ఈ ఆందోళన రాంగ్ రూట్ పడుతుందనే సంకేతాలందుకున్న ప్రభుత్వం వెంటనే దీన్ని నిలువరించి.. కార్మిక లోకానికి న్యాయం చేసే విధంగానే వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ కమిటీని వేసి .. కోదండరామ్ను మధ్యవర్తిత్వంగా సర్కార్ రంగంలోకి దింపింది. ఈ పరిణామం సర్కార్ చేసిన మంచి ఆలోచనగా చెప్పవచ్చు. ఎందుకంటే.. కోదండరామ్పై కార్మిక లోకానికి మంచి గురి ఉంది. సర్కార్కు, కోదండరామ్కు మధ్య సఖ్యత ఉండటం వల్ల కూడా డిమాండ్ల సాధన పరిష్కారం తొందరగా అవుతుందని జేఏసీ భావించింది. అందుకే వెంటనే చర్చలకు వచ్చారు. లేదంటే.. సర్కార్ చర్చలకు పిలిచినా.. రావొద్దని అనుకున్నది జేఏసీ. మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబానికి పది లక్షల పరిహారంతో పాటు అతని కొడుకుకు ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చేందుకు సర్కార్ రెడీ అయ్యింది.
బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని కూడా భరోసాగా నిలిచింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఆయన ఆర్టీసీ రిటైర్మంట్ బెనిఫిట్స్ విషయంలో ఆర్థికంగా ఆదాయ వనరులను సమకూర్చే అంశాలపైనా లోతుగా చర్చించారు. మంత్రుల జీతాల్లో సగం ఇచ్చేందుకు అంతా ముందుకు రావడం, కేబినెట్ ఆమోదించడం చకాచకా జరిగిపోయాయి. ఇదంతా రేవంత్రెడ్డి చొరవేనని చెప్పాలి. అయితే శంకర్ గౌడ్ బలవన్మరణం, తదనంతర పరిణామలు.. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారొద్దని సర్కార్ భావిస్తోంది. వాస్తవానికి కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్టీసీ సమ్మెకు, ఇప్పుడు జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు పోలికలు చాలా ఉన్నాయి.
న్యాయ బద్దమైన కోరికలతో ఆనాడు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగితే వారిని అవమానించేలా కేసీఆర్ మాట్లాడారు. గొంతెమ్మ కోర్కలతో ఆర్టీసీ సమ్మెకు దిగిందని, ఏం తమాషాగా ఉందా? అని కేసీఆర్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సర్కార్ .. ఆది నుంచి సమ్మె విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నది. జేఏసీ నేతలతో, కార్మిక లోకంతో వారు వ్యవహరిస్తున్న తీరు పై కూడా పెద్దగా వ్యతిరేకత లేదు. రెచ్చగొట్టే విధంగా ఎక్కడా సర్కార్ చర్యలు కనిపించలేదు. మొండిగా, సమ్మెను జఠిలం చేయాలనే ఉద్దేశ్యం సర్కార్కు ఏ కోశానా ఉన్నట్టు కనిపించలేదు.
పైగా దీన్ని బీఆరెఎస్ చలిమంటలు కాచుకునే సమ్మెగా చేయాలనే భావిస్తుందనే అనుమానం సర్కార్కు వచ్చింది. కార్మికలోకం తప్పుదోవ పట్టకుండా.. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తాము రెడీగా ఉన్నామనే సంకేతాలు పంపింది. ఇందులో భాగంగానే చర్చలకు పిలిచింది. కోదండరామ్ను మధ్యవర్తిత్వం వహించేలా చేయడంలోనే సమ్మె తీవ్రతను తగ్గించి పరిష్కారం వైపుకు తీసుకెళ్లడంలో తొలి అడుగు వేసింది సర్కార్. ఈ పరిణామలు త్వరలోనే సమ్మె విరమణ దిశగా సాగుతాయనే ఆశావహ వాతావరణమైతే కనిపిస్తున్నది.