కేంద్రంతో యుద్ద వాతావరణం మంచిది కాదని తెలంగాణ సర్కార్ భావిస్తోందా? పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం కేంద్రంతో గ్యాప్ పెంచుకోవడం సరికాదనే నిర్ణయానికి వచ్చిందా? అంటే అవుననే చెప్పాలి. యాసంగి సీజన్లో కేంద్రం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయలేదు. ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.
గతంలో కేసీఆర్ కూడా ఢిల్లీలో ధాన్యం రోడ్డుపై పోసి ఆందోళన చేశారు. అయినా మోడీ వినలేదు. ప్రభుత్వాలే వెనక్కి తగ్గాయి. ఇప్పుడు రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే సాగుతున్నారు. వెనక్కి తగ్గారు. కానీ కేసీఆర్లాగా మరి తెగేదాకా లాగొద్దని, మంచి మాటగా ఉంటూనే ఢిల్లీలో ప్రభుత్వ పనులు చక్కబెట్టుకోవాలని యోచిస్తున్నారు.
అందుకే మిగులు ధాన్యాన్ని ప్రభుత్వమే ఈ-వేలం ద్వారా అమ్మకానికి పెట్టుకుంంటామని నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇప్పుడు ఈ ధాన్యం లొల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దాన్ని తప్పించినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాసంగి సీజన్లో మొత్తం 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది.
అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. సర్కార్ ఒత్తిడితో ఇందులో మరో 8 లక్షల టన్నులను చేర్చి కొనుగోలు చేసింది. అయినా ఇంకా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం వద్దే మిగిలి ఉంది. ఈ మిగులు ధాన్యం విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. మోడీతో మాట్లాడి కొనిపించాలని, లేదంటే ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి బీజేపీ ఆఫీసు ముందు పోసి నిరసన తెలుపుతామని కూడా రేవంత్ గతంలో హెచ్చరించి ఉన్నాడు.
కానీ… కిషన్రెడ్డితో విభేదాలు పెట్టుకోవడం మూలంగా సమస్య మరింత జఠిలమే అవుతుంది తప్ప.. పరిష్కారం కాదనే భావనకు రేవంత్ రెడ్డి వచ్చినట్టున్నారు. అందుకే అటు ఢిల్లీ తో గ్యాప్ పెంచుకోకుండా.. ఇక్కడ కీలక నేతగా ఉన్న కిషన్రెడ్డితో శత్రుత్వం పెంచుకోకుండా.. మధ్యే మార్గంగా తామే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని డిసైడ్ అయ్యింది రేవంత్ సర్కార్.
అందుకే కనీస మద్దుత ధర రూ. 2389ని రిజర్వ్ ధరగా నిర్ణయించి ఈ-వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా వచ్చే వ్యాపారులు ఐతే మద్దతు ధరకైనా కొనాలి లేదా పోటీ పెరిగితే ఆపై ధరనైనా కోట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల లాభమే తప్ప నష్టం రాదనే అంచనాలు వేసింది సర్కార్.