కేసీఆర్ కులవృత్తులను అడ్డం పెట్టుకుని పేద, బడుగు బలహీన వర్గాలను మరింత బలహీన పర్చాలని చూశారని సీఎం రేవంత్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. బర్లు గొర్లు కాసుకోమన్నారని కేసీఆర్నుద్దేశించి విమర్శల దాడి చేశారు.
చేపలు పట్టుకోవడం, చెప్పులు కుట్టుకోవడంతో బలహీన వర్గాలను పరిమితం చేయడం ద్వారా వారిని రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుతంత్రాలకు పాల్పడ్డారని సీఎం ధ్వజమెత్తడం చర్చకు తెర తీసింది. బీసీలు, దళితులు తమ కులవృత్తులకు పరిమితం చేసి.. వారి పిల్లలను మాత్రం అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను చేర్చాలనే ఎత్తుగడ కేసీఆర్ నాటి నినాదంలో దాగుందని ఆయన ఆరోపించారు.
మన తాతలు, ముత్తాలు, తల్లిదండ్రులు.. ఇవే పనులు చేస్తూ మనల్ని కష్టపడి చదువులు చెప్పిస్తుంటే.. కేసీఆర్ వచ్చి మళ్లీ కులవృత్తుల పేరిట బర్లు, గొర్లు కాసుకోమన్నాడన్నారు. బడుగు బలహీన వర్గాలు కలెక్టర్లు ఎస్పీలు కావొద్దా..? ఇంజినీర్లు, డాక్టర్లు కావొద్దా..? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కావొద్దా..? అని ప్రశ్నించారు సీఎం రేవంత్రెడ్డి.
ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే ఆ యోగ్యం దక్కాలని, బడుగు, బలహీన వర్గాలు తమ చెప్పు చేతల్లో ఉంటూ చెప్పులు కుట్టుకుంటూ, కుల వృత్తులు చేసుకుంటూ ఉండాలనే దొర అహంకారమే కేసీఆర్లో ఉందనే విధంగా చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడున్నది రేవంత్రెడ్డి అని, ఇలాంటి ప్రభుత్వం, సీఎం మళ్లీ మళ్లీ మీకు దొరకడని ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.
నాణ్యమైన విద్య, నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించి.. ఉన్నత చదువులు భారం లేకుండా చదివించే బాధ్యత తనదేనన్నారు. తల్లిదండ్రులపై భారం పడకుండా ఓ అన్నలా చదివించేది నేనే.. మిమ్మల్ని అన్ని రంగాల్లో రాణించేలా చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసేదీ నేనే అని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
చదువుతో మీ తలరాతను మార్చుకోవాలని, తెలంగాణ విద్యాపరంగా ఉన్నతంగా ఎదిగితే దేశానికి మంచి పేరు వస్తుందని, తద్వారా దేశం ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం 18 గంటలు పనిచేస్తానన్నారాయన. మీ కలలను నిజం చేసి చూపుతానన్నారు.
ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండని విజ్ఞప్తి చేసిన సీఎం.. ఇలా విద్యార్థుల కోసం, వారి అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేసే ప్రభుత్వాలు తరుచూ రావన్నారాయన. అందుకే ఈ సర్కార్ను కొనసాగించండని .. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని, దీనికి యువత మద్దతు ఉండాలని పరోక్షంగా యువతను కోరారు ఈ వేదికగా సీఎం రేవంత్రెడ్డి.