జెన్జీని ప్రపన్నం చేసుకునే విషయంలో కాంగ్రెస్, బీఆరెస్లు పోటీలు పడుతున్నాయి. కానీ బీఆరెస్సే ఇందులో ముందంజలో ఉంటున్నది. ఎక్కడ ఏ వేదికగా మాట్లాడిన కేటీఆర్ ఓసారి జెన్జీ ప్రస్తావన తెస్తున్నారు. సందర్భాన్ని బట్టి యువతను ఆకట్టుకునేలా జెన్జీల పోరాటాలను కూడా గుర్తు చేస్తూ వారిని కీర్తిస్తున్నారు.
ఆ ఉద్యమాలను, ఆందోళనలకు తమ పార్టీ తరపున సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా నల్సార్ వర్సిటీలో నెలకొన్నవి వివాదాన్ని కూడా తన పార్టీలైన్ కిందకు తీసుకున్నాడు కేటీఆర్. అక్కడ జరిగింది కూడా జెన్జీ తరహా ఉద్యమమే. విద్యార్థులంతా నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా రానీయొద్దని లేఖ రాసిన ఉదంతం కలకలం రేపింది. దీనిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడం బార్ కౌన్సిల్లో వారిని ఎన్రోల్ చేయమంటూ చేసిన ప్రకటన ఈ వివాదన్ని మరింత పెంచింది.
మళ్లీ సీజేఐ ఈ వేడిని తగ్గించేలా కామెంట్స్ చేశారు. ఇది నాకు, విద్యార్థులకు మధ్య వ్యవహారమని, మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకున్నారంటూ ఆయన పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వివాదానికి మెయిన్ కారణం.. సీజేఐ నిరుద్యోగులను ఉద్దేశించి బొద్దింకలని కామెంట్ చేయడం.. ఆ తరువాత జంతర్మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రిని నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో రాజీనామా చేయాలని చేసి ఆందోళన విషయంలో కూడా కించపరిచేలా స్పందించడంతో యువతలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో నల్సార్ యూనివర్సిటీలో కాన్వకేషన్ ఉండటం.. దీనికి సీజేఐ చీఫ్ గెస్ట్గా రానుండటంతో ఇక్కడి విద్యార్థుల నుంచి స్పందన వచ్చింది. ఇక్కడ ఇంత జరుగుతున్నా కాంగ్రెస్లో మాత్రం దీనిపై ఇసుమంత కూడా చలనం లేదు. స్పందన లేదు. కానీ తెలివిగా కేటీఆర్ దీన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారి ఉద్యమానికి తమ సంఘీభావం ఉంటుందని ప్రకటించారు. త్వరలో హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ గ్రాడ్యూయేట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి దీనిపై సీరియస్గా దృష్టి పెట్టింది బీఆరెస్. ఈ స్థానం నుంచి బీఆరెస్ అభ్యర్థిగా దివంగత పీఎం పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణి గెలిచిన విషయం తెలిసిందే. తాము గెలిచిన ఈ స్థానాన్ని మళ్లీ దక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగా జెన్జీ ఈ ఎన్నికల్లో కీలకంగా ఉన్న నేపథ్యంలో యువతను ప్రసన్నం చేసుకోవాలని కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆయన జెన్జీ మంత్రను విరివిగా వినియోగిస్తున్నారు.