కేసీఆర్ అంటేనే తెలంగాణ సాగునీటి విషయంలో అపార అనుభవమున్న నేతగా చెబుతారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో చేసే ప్రసంగాలలో నీళ్ల ప్రస్తావనే ఎక్కువగా ఉండేది. పూర్తిగా తెలంగాణ భౌగోళిక, వాతావరణ పరిస్థితులను ఔపోసన పట్టిన కేసీఆర్.. ఆంధ్ర …తెలంగాణకు ఎలా అన్యాయం చేస్తుందో.. స్వరాష్ట్రం తెచ్చుకుంటే… మన నీళ్లను మన పంట పొలాలకు ఎలా పారించుకుని సస్యశ్యామలం చేసుకోవచ్చో ఆయన చెప్పే విధానం అందరినీ ఆకట్టుకునేది. ప్రజలంతా కేసీఆర్ అంటే అందుకే అభిమానం.
ఇలాంటి నేత సీఎం అయితే తమకు కష్టాలన్నీ తీరుతాయని జనం నమ్మారు. పదేండ్లు అధికారం ఇచ్చారు. కానీ ఇవాళ సీఎం రేవంత్రెడ్డి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన, భవిష్యత్ కార్యాచరణ గురించి లోతైన అధ్యయనం చేసిన తరువాత మాట్లాడిన మాటలు.. కేసీఆర్ చేసిన తప్పిదాలు, అవినీతి, రైతులకు చేసిన మోసం.. విధానాలు చర్చకు తెరలేపాయి. కాళేశ్వరరావు అని ముద్దుగా పిలిపించుకున్న కేసీఆర్.. అందులోనే అట్టర్ ఫ్లాప్ అయి లక్ష కోట్ల నిధులు గంగపాలు చేశారనే ఆరోపణ ఉండనే ఉంది.
దీని మరమ్మత్తుల గురించి కూడా రేవంత్ క్లారిటీ ఇచ్చారు. నిపుణుల సలహా మేరకు ముందుకు పోతామన్న ఆయన.. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించే విషయంలో మహారాష్ట్రతో చర్చలు జరిపి..దానికి పరిష్కారం చూపి బ్యారేజీ నిర్మణానికి బాటలు వేస్తామని కూడా ఓ క్లారిటీ ఇచ్చారు ఈ వేదికగా. ఇక పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో నైతే కేసీఆర్ పాలనా లోపాలను, తీసుకున్న నిర్ణయాలను ఏకిపారేశారు. పూర్తిగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయాలపై పోస్టుమార్టం చేశారు. కమీషన్లు దండుకునేందుకు మాత్రమే పనులు చేశారని, భూసేకరణ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టారన్నారు.
ఇప్పుడు తప్పించుకునే విధంగా మేము పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, ఈ ప్రాజెక్టు కోసం నిర్దేశించుకున్న నిధుల్లో సగం కూడా ఖర్చు కానప్పుడు 90 శాతం పనులు ఏలా పూర్తి చేసినట్టు అని సీఎం ప్రశ్నించారు. తాము ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాతే.. కొత్తగా భూసేకరణకు అవసరమైన 4వేల ఎకరాలపై దృష్టి పెట్టి.. ఆ తరువాతే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పూర్తి స్థాయిలో నజర్ పెడతామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో చేసిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ అవినీతికి ఆలవాలంగా మారాయే తప్ప.. రైతుకు ఒక్క ఎకరా కూడా నీరందించలేకపోయిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ సీఎంగా.. సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క కొత్త పథకాన్ని ప్రారంభించలేకపోయాడని, కానీ అబద్దాలు చెబుతూ కాలం గడుపుతూ రైతులను మోసం చేశాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చెల్లని రూపాయి నోటుగా కేసీఆర్ను అభివర్ణించడం కూడా కలకలం రేపింది. బీఆరెస్ పార్టీకి గతమే ఉంది కానీ.. భవిష్యత్ లేదన్నారాయన. ఓ పక్కా ప్లానింగ్ ప్రకారం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నామని, ప్రతీ మూడు నెలలకు ఓసారి దీని పురోగతిని సమీక్షిస్తూనే, యుద్ద ప్రాతిపదికన వీటిని పూర్తి చేసేందుకు కంకణ బద్దులమై ఉన్నామన్నారు.