కాంగ్రెస్ నాయకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల జాతర కొనసాగనుంది.దీనికి సీఎం పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. పలుమార్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇంచార్జి మీనాక్షి నటరాజన్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తాజాగా మరోమారు దీనిపై చర్చించిన సీఎం .. పది నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
ఆయా జిల్లాల వారీగా సీనియర్ నేతలు, మంత్రులు ఇచ్చిన లిస్టును అనుసరించి.. సామజిక సమీకరణలు, సీనియార్టీ, పార్టీ కోసం సిన్సియర్ పనిచేసిన నేతలు.. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని చివరగా ఓ పద మంది పేర్లతో లిస్టును రెడీ చేసినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. వివిధ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులతో పాటు బోర్డు డైరెక్టర్లు, రాష్ట్ర స్థాయి సంస్థల పదవుల డ భర్తీని వడివడిగా చేపడుతున్నది సర్కార్. చాలా మంది పదవులను ఆశించడం.. వారందరికీ సకాలంలో పదవులు ఇవ్వలేకపోవడం, జాప్యం జరగడంతో కొంత అసంతృప్తి నెలకొన్నది.
ఇప్పటికే దాదాపు 40 మంది వరకు వివిధ కార్పొరేషన్లు, రాష్ట్ర స్థాయి పదువుల భర్తీని చేపట్టింది ప్రభుత్వం. మరో మూడు నెలల వ్యవధిలో వీరి కాల పరిమితి తీరనుంది. టెన్యూర్ ముగిసిన తరువాత మళ్లీ వారందరికీ రెన్యూవల్ చేయకుండా.. కొందరికి మాత్రమే చేసి.. మిగిలినవి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ఇవ్వాలని లెక్కలేసుకున్నట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు పది మంది కొత్తవారికి ఇచ్చి.. మరో మూడు నెలల తరువాత ఖాళీ కాబోతున్న కార్పొరేషన్ పదవుల్లో కూడా అసంతృప్తులకు, వెయిటింగ్లో ఉన్న సీనియర్లకు అవకాశం కల్పించాలని భావిస్తోంది అధిష్టానం. తాజాగా పది మందితో కూడిన లిస్టు రెడీ అయ్యింది. అది ఇవాళో రేపో విడుదల చేసేందుకు పీసీసీ చీఫ్ సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఇందులో తెలంగాణ జన సమితికి చెందిన నేతలున్నారా? అనేది సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన కోదండరామ్తో టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి మాటిచ్చి ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు, పదవుల పంపకాల్లో టీజేఎస్కు ప్రయార్టీ ఇస్తామని చెప్పి ఉన్నారు. దీంతో పలు మార్లు ఇదే అంశంపై కోదండరామ్తో కలిసి సీఎంను, పీసీసీ చీఫ్ను, ఇంచార్జి మీనాక్షి నటరాజన్ను టీజేఎస్ నేతలు కలిశారు. సర్కార్కు మిత్ర పక్షంగా ఉన్న తమకు ఇచ్చిన మాట ప్రకారం పదవుల్లో అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చారు.
ప్రధానంగా టీజేఏస్ లో ఉన్న యువ నేతలు సలీమ్ పాషా, మాసంపల్లి అరుణ్ కుమార్, రమేష్ ముదిరాజ్, ఆశప్పలు పదవులు ఆశిస్తున్నారు. వీరు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల కేసీఆర్ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో పోరాటాలు చేశారు.ఆ పార్టీలో కీలక హోదాల్లో ఉన్నారు. తాజా లిస్టులో టీజేఎస్ నేతలున్నారా? ఆ తరువాత క్రమంలో విడుదల చేసే జాబితాలో ఎవరెవరకి అవకాశాలు దక్కుతాయనే అంశం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. గాంధీభవన్ నుంచి ఎప్పుడు ఏ సమాచారం వస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.