మళ్లీ అవే మాటలు. ఇద్దరి నోటి వెంటా. కేసీఆర్ అదే అంటున్నారు. కేటీఆరూ అదే అంటున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా.. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలు ఇప్పుడు బీఆరెస్కు దొరికాయి. తెలంగాణపై ఆ ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం రేగింది… చల్లారింది. తెలంగాణ బీజేపీకి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. కానీ దీన్ని బీఆరెస్ మాత్రం వదలడం లేదు.
తాజాగా కేసీఆర్ నోటి వెంట తేజస్వీ పేరు వచ్చింది. వెధవ అన్నాడు. తిట్టాడు. అంతా బాగానే ఉంది. కానీ ఆ ఇష్యూను తమ పార్టీకి మైలేజీ కోసం ఆపాదించుకోవడమే ఇక ఆయన వ్యూహంగా చెప్పుకోవాలి. లోక్సభలో బీఆరెస్కు ఒక్క సీటు రాలేదు. దానికి కారణం.. అప్పుడు కేసీఆర్ చేసుకున్న స్వయంకృతాపరాధమే అంటారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారుస్తున్నామని టీఆరెస్ను బీఆరెస్ గా చేసి.. తెలంగాణను వదిలి రాష్ట్రాలు తిరుగుతున్నాడనే అపవాదును ఆయన మూటగట్టుకున్నాడు.
దీంతో ఇక్కడే ఆయనకు ఎదురుగాలి వీచింది. పర్యవసానంగా అధికారాన్ని కోల్పోయింది. ఆ తరువాత పార్టీ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఆ తరువాత ఫామ్హౌజ్లో కేసీఆర్ ప్రమాదావశత్తు పడిపోవడం.. తుంటి ఎముకకు బలంగా దెబ్బ తగలడం.. పార్టీని మరింత కుంగదీసింది. ఈ సమయంలోనే ఎంపీ ఎన్నికలొచ్చాయి. దీంతో కేసీఆర్ కుంటుతూనే ఎన్నికల ప్రచార సభలకు హాజరుకావాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సరైన క్యాండిడేట్లు బీఆరెఎస్కు దొరకలేదు. అంతగా పరిస్థితి చేజారిపోయి ఉంది. ఈ క్రమంలో పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీనికి బాధ్యులు కూడా కేసీఆరేనని చెప్పాలి. కానీ ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్.. ఇద్దరూ తమకు లోక్ సభలో ఒక్క సీటు రాకపోవడానికి బాధ్యులను ప్రజలనే చేస్తున్నారు.
వారిని తప్పుబట్టినట్టే మాట్లాడుతున్నారు. తేజస్వీ సూర్య మాటలకు బీఆరెస్ ఎంపీలుంటే.. అక్కడ రణరంగమే అయ్యి ఉండేదని కేసీఆర్ అన్నాడు.అంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలను మీరు గెలపించినా..మాకు ఉండే కమిట్ మెంట్ వారికి లేదని చెప్పడం ఆయన ఉద్దేశం.మేము అక్కడ లేని లోటు స్పష్టంగా కనిపించిందని కేసీఆర్ అన్న మాటలనే.. కేటీఆర్ కూడా ప్రెస్ మీట్లో అవే మాటలన్నారు. ఇంకా ఒకడుగు ముందుకేసి ఇకనైనా జనం ఆలోచించుకోవాలె..! అని హితోక్తులు కూడా పలకడం గమనార్హం. అంటే.. మీరు చేసుకున్న దానికే జనం ఆనాడు అలా నిర్ణయం తీసుకున్నారు.. ఆ విషయం వీరికీ తెలుసు.
మరి మధ్యలో జనాలని ఎందుకు తప్పుబట్టడం.. ఇంకా మీరు మారరా? మీరింతేనా? అనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఎవరేమనుకున్నా మేమింతే.. అనే తీరులోనే కేసీఆర్, కేటీఆర్ అభిప్రాయాలుంటున్నాయని చెబుతున్నారు ఆ పార్టీకి చెందిన నేతలే.