కేటీఆర్ మంచి కసి మీదున్నాడు. ఇంకా రెండేండ్లు ఎప్పుడు గడుస్తాయోనని టెన్షన్తో ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఏ మీటింగుకు పోయినా.. ఇంకో రెండేండ్లు ఓపిక పట్టుర్రి మనమే వస్తున్నామని ధీమాగా చెబుతూ వస్తున్నాడు. జనాలు తప్పు తెలుసుకున్నారనీ అంటున్నాడు. కేసీఆర్ యాడున్నావ్..!? అని ఇప్పుడు దీనంగా అరుస్తున్నారు.. ఆయన ఏడుండాల్నో ఆడనే ఉన్నడు.. ఆయన మంచిగనే ఉన్నడు.. కానీ నష్టం ఎవరికీ? అని జనాల్ని నిలదీస్తున్నాడు.
జనానికి నష్టం జరిగినా ఆయనకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏడుండాల్నో ఆడనే ఉన్నడంటే.. ఓడగొట్టారు కాబట్టి.. ఫామ్హౌజ్లనే ఉంటాడని సమర్థించుకుంటున్నాడు. కేసీఆర్ను తక్కువ అంచనా వేశారు.. బాగైందనే విధంగా , బుద్దొచ్చిందా..? అని చిన్నపిల్లలు మారాం చేస్తే తొడపాశం పెట్టి మరీ అడిగినట్టు జనాలను అడుగుతున్నాడు.
ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పు ఇకపై చేయకండి అని చెబుతున్నట్టే చెబుతున్నాడు. చేస్తే చస్తారని బెదిరించినట్టే బెదిరిస్తున్నాడు. మళ్లీ చేస్తే ఇంకా ఇంకా అనుభవిస్తారు.. మాకేం నష్టం లేదు.. అని ఫామ్హౌజ్లో ఉండి తమాషా చూస్తామన్నట్టే కన్నెర్ర చేస్తుండు. ఇదే తీరు. ఎక్కడికి వెళ్లినా.. ఏ మీటింగులో మాట్లాడినా.. దాదాపుగా ఇవే మాటలు. అటూ ఇటూగా.
ఇవాళ పరకాల బీఆరెస్ జనరల్ బాడీ మీటింగులో కూడా ఇవే మాటలు రిపీట్ అయ్యాయి. వీటితో పాటు ఇంకో డైలాగు కూడా. అదీ పాతదే. కానీ.. కొంచెం ఘాటుగా. లోతుగా. తనలోని కసి, కోపం ఏ స్థాయిలో ఉందో చూపేందుకు ఓ కొలమానంలా ఉన్నాయా మాటలు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదన్నాడు. ఇది గతంలో కూడా అన్నదే. అంత మంచోడని ఎవరూ అనుకోవడం లేదు కూడా. దాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ వ్యాఖ్యలను తను ఎందుకు వాడుకున్నాడంటే.. కేసీఆర్ అప్పుడు చాలా మందిని క్షమించి వదిలేశాడు కానీ.. తానైతే ఎవరినీ వదలనని చెప్పడానికి.
తాము ఓడిపోయినప్పటి నుంచి మొత్తం లెక్కలు రాసుకుంటున్నాడట. ఎవరెవరు ఏమేమీ చేస్తున్నారో అన్నింటినీ చూస్తున్నాడంట.. ఎవరినీ వదలడట. పారిపోయినా పట్టుకొచ్చి తంతడట. సప్త సముద్రాలవతల ఉన్న గుంజుకొచ్చి గుద్దుతడట. చంపి పాతరేస్తాడట. కాంగ్రెస్ లీడర్లారా జాగ్రత్త! రెండేండ్లే మీకు టైము.. ఇగ ఉంటది సూడు మీ తమాషా! అని తొడలు చరిచి మరీ వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు కేటీఆర్.
అనడం కాంగ్రెసోళ్లని అన్నడు కానీ.. ఇందులో జర్నలిస్టులు, ఆఫీసర్లు, పోలీసులు, సోషల్ మీడియా వర్కర్లు.. అంతా ఉంటారన్నమాట. కేటీఆర్ది ఒకటే గుడ్డి లెక్క. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లని, ఎదురు మాట్లాడిన వాళ్లని, విమర్శించినోళ్లని, ప్రశ్నించినోళ్లని.. వీరితో పాటు ఇబ్బంది పెట్టినోళ్లని అందరినీ కట్టకట్టి మరీ బజాయిస్తడన్నమాట. ఒక్కొక్కరినీ ఒక్కో టైపుగా.
ఆ పదేండ్ల పాలన లా ఇకపై ఉండదని కూడా అన్నాడు. అంటే అంతకన్నా దారుణంగా ఉండబోతున్నామని కూడా సిగ్నల్ ఇచ్చాడు. మేము తప్ప.. జనానికి ఇంకో ఆల్టర్నేట్ లేదనే అంచనాతో అన్న మాటలవి. చచ్చినట్టు మమ్మల్ని గెలిపిస్తారనే పలుకులవి.