ప్రముఖ కవి శ్రీశ్రీ రచనల్లోని మహాప్రస్థానం…చదవని వారుండరు. అందులో ఓ చోట.. మనదీ ఓ బ్రతుకేనా? కుక్కల వలె, నక్కల వలె.. సందులలో పందుల వలె.. అనే కవిత్వం చాలా మందికీ సుపరిచితమే. ఇప్పుడిదెందుకు వచ్చిందంటే.. ఇదే లెవల్లో కేటీఆర్పై ఫైర్ అయ్యారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి. ఈ రాజకీయాల్లోకి ఆయన కవిత్వాలెందుకంటారా? సరే, విషయానికొద్దాం! కేటీఆర్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. అసలు నువ్వు మనిషివేనా? నీకేమైనా విలువలున్నాయా? అని కూడా విమర్శించారు సీఎం.
ఇదంతా ఎందుకొచ్చిందంటే.. ఆయన రాజకీయ వైఖరిపై.. అనుసరిస్తున్న విధానలపై చిరాకెత్తి.. ఏవగింపు కలిగిన దోరణిలో సీఎం అన్న మాటలవి. బండి భగీరథ్ విషయంలో.. సర్కార్పై నిందలేసేందుకు, తన వ్యక్తిగత కక్షసాధింపు రాజకీయంలో భాగంగా బండి సంజయ్తో ఉన్న వైరాన్ని ఈ కేసుకు లింకు చేసి కేటీఆర్ చిల్లర రాజకీయం చేశాడనేది రేవంత్ కోపానికి కారణమైంది. నీ రాజకీయం కోసం మైనర్ బాలిక, ఆ కుటుంబం బాధలు కూడా పట్టవా? వారి ఫోటోలు బయట ప్రదర్శించి… వారి వ్యక్తిగత జీవితాలను బజారుకీడ్చి ఏం సాధించావ్.. రాజకీయంగా నన్ను ఎదుర్కొనేందుకు చాలా వేదికలున్నాయి..! నీకు ఇదే కేసు అవసరమయ్యిందా? అని నిలదీశారు సీఎం రేవంత్రెడ్డి.
కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నాననుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. జడ్జిలా తీర్పులు కూడా వారే ఇచ్చేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల విషయంలో వారు పడే బాధలకు అండగా ఉండాల్సింది పోయి.. సెల్ఫీలు దిగుతూ.. ఇదిగో రైతు చనిపోయాడు.. అని ప్రచారం చేసుకుంటున్నారని.. అసలు కనీస మానవత్వం, విలువలు లేని రాజకీయాల చేస్తున్నాడని కేటీఆర్ పై విమర్శలు గుప్పించారాయన. వేలాది కోట్లు సంపాదించారు కదా.. బాధిత రైతు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాల్సింది అని హితవు పలికారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించాల్సింది… పక్కా శాడిస్టులా ఆ పార్టీ, కేటీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రేవంత్.
వరేసుకుంటే..ఉరేసుకున్నట్టేనని.. కేసీఆర్ మాత్రం తన ఫామ్హౌజ్లో 150 ఎకరాల్లో వరి సాగు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మేం వరి ధాన్యం కొనం.. ప్రభుత్వమేమన్నా వ్యాపార సంస్థనా.. రూ. 4,500కోట్లు ఎక్కడ్నుంచి తేవాలి..? అని మాట్లాడిన ఆపార్టీ ఇప్పుడు దిగజారి , మానవత్వం మరిచి రాజకీయం చేస్తుందని తిట్టిపోశారు. ధాన్యం కొనుగోలు చేసిన తరువాత ఆరు నెలలైనా వారికి మద్దతు ధరను అకౌంట్లలో అప్పుడు బీఆరెస్ ప్రభుత్వం వేయలేదని, తాము 72 గంటల్లో వేస్తున్నామన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారాయన.
ఈ సీజన్లలో ఈ పాలనలో ఎంత కొనుగోలు చేశారు..? మా పాలనలో ఎంత కొనుగోలు చేశామో లెక్కలతో చర్చకు రావాలన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ పైలట్ రోహిత్రెడ్డిని ఇంత వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదని, నీతులు చెప్పేందుకేనా? ఆచరించేందుకు కాదా? అని కేటీఆర్ తీరును విమర్శించారు. మైనర్ బాలిక ఫోక్సో కేసులో కేసీఆర్ ఎందుకు స్పందించలేదు..? తన పార్టీలో అవతలి పార్టీ వ్యక్తి జాయిన్ అయితే మాత్రం జగిత్యాల దాకా పోతాడు..? ఇలాంటి సంఘటనలపై ఎందుకు స్పందించడు? అని కేసీఆర్ వైఖరినీ తప్పుబట్టారు సీఎం. కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాలను ఖండిస్తూనే.. మైనర్ బాలిక కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు రాకపోగా.. తమ రాజకీయాల కోసం వారిని బజారుకీడ్చే చిల్లర ప్రచారాలు చేశారని .. ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏం చేయాలో అన్ని చట్టపరిధిలో కరెక్టుగానే చేశామని విరవించారు సీఎం రేవంత్ రెడ్డి.