దక్షిణ తెలంగాణలో బీజేపీ క్రమంగా పట్టుకోల్పోతున్నది. దీనికి తోడు ఆ పార్టీకి కాక్రోచ్ జనతా పార్టీ పక్కలో బల్లెంలా మారింది. ఏపీలో తప్ప.. దక్షిణాదిన ప్రస్తుతానికి బీజేపీ పూర్తిగా బలం కోల్పోయింది. ఏపీలో కూటమి సర్కార్ అండ కొంత ఊరటనిస్తున్నా.. అది పార్టీ మూలాలకు బలాన్నైతే ఇచ్చే అవకాశం లేదు. దీంతో కూటమిలో భాగమైనా సరే.. తమతో కలిసి వచ్చే ప్రాంతీయ శక్తులను కలుపుకుని దక్షిణాదిన బలపడాలన్నదే మోడీ వ్యూహంగా కనబడుతున్నది. తమిళనాడు, తెలంగాణపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
తమిళనాడుతో పోల్చితే అంతో ఇంతో కొంత ఉనికి ఉన్నది తెలంగాణలోనే. అందుకే తమిళనాడులో పరోక్షంగా తన పార్టీకి మేలు జరిగేలా… భవిష్యత్తులో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేలా పావులు కదుపుతున్నది. తెలంగాణలో ఏకంగా తమ అనుకూల శక్తులతో ఈసారి అధికారంలోకే రావాలనుకుంటున్నది. అందుకే రెండు చోట్ల మోడీ రెండు ప్రయోగాలకు సిద్దమయ్యాడు. తమిళనాడులో అన్నామలైను కొత్త పార్టీ పేరుతో రంగంలోకి దింపాడు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ను వాడుకుని రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ ఇమేజ్ను వాడుకోవడం ద్వారా బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల నాటికి జవసత్వాలను అందించాలని మరో ప్రయోగానికి నాంది పలికాడు.
తమిళనాడులో జాతీయ పార్టీల పప్పులు ఉడకవు. అవి ఎప్పటికీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్కు టీవీకే విజయ్ ద్వారా అదృష్టం కలిసి వచ్చింది. అక్కడ కూటమి సర్కార్లో కీలక భూమిక పోషించే స్థితికి ఎదిగింది. దీని ద్వారా క్రమంగా అది కూటమి ద్వారా మరింత బలపడి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పరంగా పుంజుకుని విస్తరించే వీలుంది. కానీ విజయ్ ద్వారా బీజేపీకి గట్టి దెబ్బనే తగిలింది. అన్నాడీఎంకేకూ చేదు అనుభవమే మిగిలింది. దానికీ అర్థమైపోయింది. బీజేపీని నమ్ముకుంటే ఇంతే గతి అని. అందుకే అది బీజేపీకి దూరమైంది. ఇప్పుడు మళ్లీ అన్నామలై దిక్కయ్యాడు బీజేపీకి.
వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు.. అన్నామలై వారికి కొత్త పార్టీ రూపంలో తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన జీవగంజి పోసింది. తన కొత్త పార్టీ పేరు.. అన్నాపార్టీగా పెట్టీ పెట్టగానే విశేష స్పందన లభించింది దానికి. ద్రవిడులు దరి చేర్చుకుంటున్నారు అన్నామలైను వ్యక్తిగతంగా. గొర్రె బలిస్తే.. గొల్లవానికే లాభమన్నట్టు.. అన్నామలై ఈ విధంగానైనా.. టీవీకే కు గట్టి ప్రత్యర్థి కావాలని కోరుకుంటున్నారు. రజినీకాంత్ సపోర్టును కూడా కలుపుకుని మరింత బలమైన పార్టీగా అన్నామలై పార్టీని అక్కడ తీర్చిదిద్దాలనేదే మోడీ వ్యూహంగా ఉంది. రజినీకాంత్కు కూడా విజయ్ సీఎం కావడం నచ్చలేదు. తన మిత్రుడు డీఎంకే స్టాలిన్ పరాభవమూ కుంగదీసింది.
దీంతో మోడీకి మేలు చేసే పనికి కూడా ఇది దారి చూపినట్టైంది. మొత్తానికి అన్నామలైకు కాలం ఇలా కలిసి వచ్చింది. ప్రమాదంలో ప్రమోదంలా.. అందరూ దగ్గరకు చేరి తనకు మద్దతుగా నిలవడంతో భవిష్యత్ రాజకీయాలపై అతనికి భరోసా ఇచ్చినట్టైంది. ఇక తెలంగాణలో చంద్రబాబు పప్పులు ఉడకవు. అది తెలిసిపోయింది మోడీకి. పవన్ కళ్యాణ్ వీరావేశం.. స్టార్ ఇమేజీ.. ఆవేశపు డైలాగులు.. ఏదో రకంగా జనాలను ఆకట్టుకోవడం ద్వారా ఇక్కడి బీజేపీకి జాకీలు పెట్టి లేపే దాంట్లో సహకరిస్తాడని నమ్మకం పెట్టుకున్నాడు.
జీహెచ్ఎంసీ నుంచే ఆ ప్రయోగానికి శ్రీకారం చుడదామనుకున్నా.. పవన్ ఓవర్ యాక్షన్తో కొంత బెడిసి కొట్టింది. కానీ పెద్దగా ఉనికే లేనప్పుడు నష్టపోయేది కూడా ఇప్పుడు ఏమీ లేదు కదా! వచ్చిన ఆ సీట్లు లాభం కిందకే అన్నట్టుగా చూడాలి. అందుకే పవన్పై భారం వేసింది. ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలకు అంత సీన్ లేదని తేలిపోయింది. ఉన్న నలుగురు తలోదిక్కున ఉన్నారు. వీరిని కలపడం, సమన్వయం చేయడం అధిష్టానంతో కాని పని. అందుకే పవన్ను వాడుకునేందుకు అంతా రెడీ అయిపోయింది. దక్షిణాదిన ఇలా పరాన్నజీవిగానైనా సరే.. మొత్తంగా పవర్ సెంటర్లో బీజేపీ కీలకంగా ఉండాలనేది మోడీ, అమిత్ షా ద్వయం వ్యూహం. అదిక్కడ అమలు కానుంది.