మేమూ ఓ ముప్పై యూట్యూబ్లు పెట్టుకుని ఉంటే గెలిచేవాళ్లమే..!అని తమ ఓటమిని అంగీకరించకుండా, కాంగ్రెస్ గెలుపుపై గేలి చేస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా? ఓడినప్పటి నుంచి దాన్నే ఫాలో అవుతున్నాడు కేటీఆర్. ఆయన కోసం, బీఆరెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఓ సెపరేట్ సోషల్ మీడియా టీమ్ను రన్ చేస్తున్నాడు. దాదాపు వీటి కోసం నెలకు 10 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్ని యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకున్నా.. ఎన్ని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ నడిపించినా అవి శృతిమించితేనే అనర్థం. ప్రశ్నించే విధానం.. నిలదీసే వైఖరి.. వాస్తవాలను నిగ్గుతేల్చే శైలి .. వీటిల్లో ఉండవు. వాటికి ఎప్పుడో పాతర వేసేశారంతా.
అంతా మాటల దాడి. తిట్ల పురాణం… బట్టకాల్చి మీదేసే విధానం. అంతే. ఇదే ఈజీగా ఉంది. ఆ జర్నలిజం ..విలువలు, నిబంధనలు, పద్దతులు.. హద్దులు.. సరిహద్దులు.. ఇవన్నీ ఎవడు పాటిస్తాడు? లీగల్గా ఏమైనా సమస్యలు ఎదురైతే మనకో టీం ఉందిగా.. కాపాడుకోడానికి. ఇంకేం..? రెచ్చిపోదాం..! ఇదే వైఖరి ఇప్పుడు కొనసాగుతోంది. ఇది మరీ రోజు రోజుకు విపరీత పోకడలు పోతున్నది. పర్సనల్ విషయాలపైనా అటాక్ జరుగుతున్నది. ఫేక్ న్యూస్ విచ్చలవిడిగా ప్రచారం చేసే స్వేచ్ఛ రాజ్యమేలుతున్నదిక్కడ. ఒకరిపై మరొకరు బురద జల్లుకునే క్రమంలో హద్దులు మీరి మాట్లాడుతున్నారు. రాసుకుంటున్నారు. రోత మాటలను అక్షరాలుగా వదులుతున్నారు.
ఎంత డ్యామేజీ చేశామనేదే లెక్క.. ఎంత వరకు నిజాయితీగా వార్తలందించామా అనేది కాదిక్కడ కొలబద్ద. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఇవాళ.. వీటిపై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేశారు. తెలుగు స్క్రైబ్తో పాటు.. చాలా యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్.. సర్కార్పై బురద జల్లే పని పెట్టుకుని నిత్యం ఫేక్ వార్తలు రాస్తున్నారని ఆయన కొన్ని ఆధారాలను కూడా ఆఫీసర్స్కు సమర్పించారు. పూర్తిగా తప్పుడు కథనాలు, కల్పిత కథనాలు, వండి వార్చి.. ఏర్చి కూర్చి జనాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంటున్నాయనేది చామల ప్రధాన ఆరోపణ. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని, వీటిని కంట్రోల్ చేయాలని కూడా ఆయన కోరారు.
అయితే ఇందులో కేటీఆర్ టీమ్ చానెళ్లు, ఆ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ను ఈజీగానే గుర్తించొచ్చు. వాటి వార్తలు, ప్రజంటేషన్ చూస్తే తెలిసిపోతుంది ఈజీగా అది అసలు జర్నలిజమే కాదని. వాటిపై చర్యలు తీసుకునేందుకు ఆ వార్తల వాస్తవికత, నిబంధనల పాతర వేసే విధానం చాలు. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు.. నోటీసులివ్వడం.. వార్నింగ్ ఇవ్వడం.. కేసులు పెట్టడం.. ఇలా క్రమంగా చేసుకుంటూ పోతారు. కానీ తెలుగు స్క్రైబ్ అనేది ఎవరి పేరు మీద ఉందో ఇంకా గుర్తించలేదు సైబర్ టీం. అది దుబాయ్ కేంద్రంగా నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంట్లో తమ సొంత కవిత్వాలను ధారాళంగా వల్లెవేస్తూ ఉంటారు. ఊహించిన కల్పిత కథనాలు వండి వారుస్తా ఉంటారు. తామే జడ్జిమెంట్లు పాస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీటిపై లోతుగా దర్యాప్తు మొదలైంది. యాక్షన్ తీసుకోవడమే లేటు! చూడాలి ఇది పరిణామాలకు దారి తీస్తుందో!