తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కీలకమైన అంశాల్లో సాగునీరు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ దళపతి కేసీఆర్నే సీఎం చేశారు జనాలు. రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఆ పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ ప్రజలు సాగునీటిపై పెట్టుకున్న ఆశలను తీర్చలేదు. ఆకాంక్షలను నేరవేర్చలేదు.. ఈ విషయాలను స్వయంగా టీఆరెస్ అధ్యక్షురాలు కవితే ప్రకటించారు. పాలమూరు వేదికగా ఆమె ఇక తెలంగాణలో తన నేతృత్వంలో నీటి ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధన కోసం షాద్నగర్లోని లక్ష్మీదేవి పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. జూరాల రిజార్వాయర్ నుంచి తీసుకోవాల్సిన నీటిని శ్రీశైలం ప్రాజుక్టు నుంచి తీసుకుంటామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించడం.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎత్తు పెంచడం మూలంగా తెలంగాణకు రావాల్సిన న్యాయమైన నీటి వాటా దక్కలేదన్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం జరిగిందన్నారామె. దసరా వరకు సీఎం రేవంత్రెడ్డికి టైమ్ ఇచ్చారు. అప్పటి వరకు రిజర్వాయర్లు పూర్తి చేయకపోతే తెల్లారి నుంచి తానే ఇక్కడి నుంచి నీటి ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు.
తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏ ఒక్క సాగునీటి ప్రాజక్టు ద్వారా సరిపడా నీరందడం లేదని, ఒక్క మెదక్ జిల్లాలో తప్ప.. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు నీరందించేందుకు గత పాలకులు చిత్తశుద్దితో పనిచేయలేదని ఆమె కేసీఆర్ పాలనను విమర్శించారు. కీలకమై సాగు నీళ్ల విషయంలో పదేళ్లు పాలించిన పాలకుడు విస్మరించాడని, ఇప్పుడున్న సర్కార్ అసలే పట్టించుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి కోసం టీఆరెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతానని ఆమె పాలమూరు వేదికగా శపథం తీసుకున్నారు. టీఆరెస్ పార్టీ పెట్టిన తరువాత .. అధ్యక్షురాలిగా ఆమె తొలిసారిగా పెట్టిన సభ ఇదే.
అందులోనూ సాగునీటికి సంబంధించిన అంశాన్నే ఆమె ప్రధానంగా తీసుకుని మాట్లాడారు. వాస్తవానికి, కేసీఆర్కు తెలంగాణ నీటి వనరుల మీద అపారమైన పట్టు ఉంది. ఏ జిల్లాలో ఏ సాగునీటి వనరులున్నాయి…? ఎన్ని టీఎంసీ నీరు అవసరం.. ? ఎలా అందిచాలనే అంశాలపై లోతైన అధ్యయనం చేసి ఉన్నాడాయన. కానీ, ఇప్పుడు కవిత ఇదే టాపిక్పై కేసీఆర్ను విమర్శించడం చర్చకు తావిచ్చింది.కీలకమైన ఈ సాగునీటి అంశంపై మాట్లాడాలంటే లోతైన అధ్యయనం తప్పనిసరి. మరి కవిత అదిచేయకుండానే పైపైనే ఆరోపణలు చేయరు.
దీంతో ఈ వేదికగా ఆమె సాగునీటిపై మాట్లాడిన ప్రతీ మాట .. ఆరోపణ, విమర్శ సూటిగా కేసీఆర్ను, ఆపార్టీని తాకుతున్నది. ఇటు సర్కార్ ను కూడా ఆమె టార్గెట్ చేశారు. రేవంత్రెడ్డిని నమ్మే పరిస్థితి లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న ఆమె పాంచజన్యం లో భాగంగా అందించే ఐదు హామీలను కూడా జనాలకు మరోసారి వివరించారు. ప్రధాని మోడీ.. రంగారెడ్డి- పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.