ఒక్క కవిత… అన్ని పార్టీలపై నిలదీతల పర్వం! ఇదిప్పుడు చర్చకు వచ్చిన అంశం. కలకలం రేపుతున్న రాజకీయ పరిణామం. ఏ పార్టీని వదలడం లేదు. ఆమె రేవంత్ వదిలిన బాణం అన్నారు. కానీ ఇవాళ ఆమె సంధించిన ప్రశ్నలు, నిలదీతలు, ఆరోపణలు.. అధికార పార్టీ కౌంటర్లు ఇచ్చేందుకు వెతుకులాడే పరిస్థితి కనిపించింది. ఎంత కాదన్నా బీఆరెస్తో ఆమెకు బంధాలుంటాయి అన్నారు. ఆమె సంధించిన భూ కుంభకోణాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావునూ బాధ్యులను చేసిన వైనం.. గులాబీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసింది. ఆఖరికి బీజేపీని కూడా ఆమె వదల్లేదు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ద్వంద్వ వైఖరిపై ఆధారాలతో నిలదీసిన తీరు.. తెలంగాణ బీజేపీ నేతలు భుజాలు తడుముకునే పరిస్థితిని క్రియేట్ చేశాయి. అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్, బీజేపీ దేన్నీ వదలని ఆమె.. తను అడగాల్సింది అడుగుతూనే.. సవాల్ విసురుతూనే.. మున్ముందు పార్టీ చేయబోయే భవిష్యత్ కార్యాచరణపైనా వార్నింగ్ బెల్స్ మోగించారు. పవన్ కళ్యాణ్ పై అంతా ఒకలా స్పందిస్తే కవిత స్పందించిన తీరు.. ఆధారాలతో కోడి కుంట చెరువు కబ్జా అంశాన్ని బయటపెట్టిన అంశం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అందరితో ఒక లెక్క.. నాతో ఒక లెక్క..! అన్నట్టుగానే ఆమె అన్ని పార్టీలనూ వదలని తీరు.. ఆరోపణలతో అష్టదిగ్భంధనం చేస్తున్న విధానం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఆమె మాటల్లోని, ఆరోపణల్లోని, నిలదీతల్లోని.. ముఖ్యంగా చర్చకు వస్తున్న అంశాలివీ!
– హైడ్రా అనే సంస్థ కూకట్ పల్లిలోని మంజీర కాలనీకి నిన్న కూడా వెళ్లి పేదల భూములను ఖాళీ చేయించింది.
అదే మూసీకి మరకగా మారిన, రివర్ బెడ్ లోనే కడుతున్న శ్రీ ఆదిత్య బిల్డింగ్ ను మాత్రం టచ్ చేయటం లేదు. చెరువులో ఏడు ఎకరాలను కబ్జా చేశారు.
– మెగాకు చెందిన ఐకాం అనే ఆయుధాల తయారీ సంస్థ నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఐదు ఎకరాలు కబ్జా చేసింది. శ్రీ ఆదిత్య వాళ్లు మూసీ గర్భంలో పెద్ద బిల్డింగ్ కడుతున్నారు. మూసీ గర్భశోకం ఎవరికీ మంచిది కాదు.
గతంలో ఈ అవినీతికి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులు తెరిచింది.
– కోడికుంట అనే చెరువు లో 10 ఎకరాల శిఖం భూమినే కొన్నారు. ఆ భూమికి సంబంధించి సర్వే నంబర్ 706. ఇది శిఖం భూమియే అని ఇరిగేషన్ శాఖ నోటిఫై కూడా చేసింది. కానీ రిజిస్ట్రేషన్ లో చాలా తప్పులు చేశారు. మూడు ఎకరాలు మాత్రమే శిఖం అని మిగతాది మాగాణి అంటూ రిజిస్ట్రేషన్ చేశారు.
– గద్దరన్న కు కారు కొనిచ్చానని పవన్ అనడం ఆయనను అవమానించడమే. మీరు కళాకారుడిగా ఉంటూ మరొక కళాకారుడిని అవమానిస్తారా?
– బీజేపీకి ఇక్కడ లీడర్ లేక పవన్ కళ్యాణ్ తో రెండు ఓట్లు తెచ్చుకుందామనుకుంటుంది. పంజాబ్ లో మొత్తం ధాన్యం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం ఎందుకు పరిమితులు విధిస్తోంది. దానిపై బీజేపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు? వచ్చే సరి ఎనిమిది మంది కాదు కదా ఒక్క ఎంపీ కూడా గెలవరు?
– సీఎం రేవంత్రెడ్డి ఆంధ్రాకు 260 టీఎంసీలు నీళ్లు తీసుకోండి అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడిని కలిసి 200 టీఎంసీలు మనకు కావాలని అడగాలి. బనకచర్లకు మీరు అంగీకరిస్తే మనకు నీటి ద్రోహం చేసినట్లే.
– ఉద్యమకారులకు కచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే. దాని కోసం ఉప్పల్ భగాయత్ లో వచ్చే నెల పోరాటం చేయబోతున్నాం. నాదర్ గుల్ లో ఉన్న రెండు వందల ఎకరాల భూమిని కూడా ఉద్యమకారులకు ఇవ్వాలి.
ఇవీ ఇప్పుడు స్టేట్ హాట్ టాపిక్స్.. కాస్కోండి పార్టీల్లారా! అని కవిత సవాల్ విసురుతుంటే.. ఎలా స్పందించాలో, నిందించాలో, నిలదీయాలో… అధికార పార్టీ సహా మిగిలిన పార్టీలు రెడీ అవుతున్నాయి. అన్ని పార్టీలు ఒకవైపు.. కవిత ఒక వైపు అన్నట్టుగా మారింది ప్రస్తుత పరిస్థితి.