మోడీ పర్యటనమో గానీ చాలా విషయాలను చర్చకు తెర తీసి వెళ్లారు. ఆయన రాజకీయం మాట్లాడినా వివాదమే. రాజకీయాలు మాట్లాడకపోయినా ఓ చర్చే. తాజాగా ఆయన హైదరాబాద్లో పర్యటించి.. బహిరంగ సభలో మాట్లాడిన మాటల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం.. సీఎం రేవంత్రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించడం. నిజానికి ఆయన నేరుగా ఈ మాటనలేదు. నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగానే ఇన్డైరెక్ట్గా.. బహిరంగ వేదిక మీద ఢిల్లీకి వచ్చి కలువొచ్చుగా.. కలిసి గజరాత్ మోడల్ డెవలప్మెంట్ను తెలంగాణలో చేసుకుందామని మాట్లాడటం సర్వత్రా చర్చకు తెర తీసింది.
మోడీకి బహిరంగ వేదికల మీద ఇలా ఓపెన్గా మాట్లాడటం అలవాటు. అంతకు ముందు కేసీఆర్ విషయంలో కూడా ఇలాగే మాట్లాడి రచ్చ రచ్చ చేసేశారు మోడీ. తన వద్దకు కేసీఆర్ వచ్చాడని, ఎన్డీయేలో భాగస్వామ్యమవుతానని చెప్పడంతో పాటు.. తన కొడుకును సీఎం చేయాలని భావిస్తున్నట్టు చెప్పి.. ఓసారి తన వద్దకు కొడుకును పంపుతానని మీ ఆశ్వీర్వాదం ఉండాలని కోరిన విషయాన్ని బహిర్గతం చేయడం రాజకీయంగా కలకలం రేపింది. తాను ఈ వారసత్వ రాజకీయాలకు బద్ద వ్యతిరేకినని కూడా మోడీ ఆ వేదికగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ అంశాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తావిస్తున్నారు. నాడు కేసీఆర్.. రహస్యంగా వెళ్లి మోడీ కాళ్లు పట్టుకున్నాడని, కొడుకు కోసం దిగజారుడు రాజకీయాలు చేశాడని, కానీ రేవంత్ ను తానే ఇక్కడికొచ్చి ఆహ్వానించడం .. రేవంత్కున్న స్టామినాకు అద్దం పడుతుందని తమకు అనుకూలంగా అన్వయం చేసుకుని వైరల్ చేస్తున్నారు.
మోడీ మాట్లాడిన ఆ రెండు వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అసలే ఇప్పుడు కేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితమై.. మొత్తం కొడుకు చేతిలో పార్టీని పెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి నానా తంటాలు పడుతుంటే.. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఇప్పుడు మళ్లీ ఆ పాత ముచ్చట్లెందుకని బీఆరెస్ శ్రేణులు గుర్రుమంటున్నారు. అవును.. అప్పుడు కేసీఆర్కు ఒక్కటే కోరిక… కొడుకును సీఎం చేయాలని. అందుకోసం మోడీని ప్రసన్నం చేసుకోవడానికి అన్నింటికీ వంత పాడాడు. జీఎస్టీని, పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్నిఅసెంబ్లీలో ఓకే చేసి ఆమోదింపజేసి కేంద్రానికి జీ హుజూర్ అన్నాడు.
ఇన్ని చేసినా మోడీ కనుకరించలేదు. తానే స్వయంగా వెళ్లి తన రాజకీయ చతురతను చాటిఆ మోడీని బుట్టలో వేసుకుందామనుకున్నా.. మోడీ వినలేదు. పైగా ఈ విషయన్ని బహిరంగ వేదిక మీద వెల్లడించడాన్ని కేసీఆర్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టాడు. తాను అలా చెప్పలేదని అనలేదాయన.. చాలా విషయాలు చెప్పుకుంటాం.. ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ అలా అన్ని విషయాలు బహిర్గతం చేయొచ్చునా.. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా! అని అన్నాడు కేసీఆర్. అంటే తాను కొడుకును సీఎం చేయడానికి మోడీ ప్రసన్నం కోసం ఆయన దీవెనల కోసం తండ్లాడింది.. తపన పడింది నిజమేనని ఒప్పుకున్నాడు. మోడీ మాటల్లో అబద్దం లేదని తేలింది.
ఇక ఇప్పుడు రేవంత్ను మోడీ ఆహ్వానించడంపై రెండు రకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఒకటి.. రేవంత్ దమ్మున్న నాయకుడు కాబట్టే.. స్వయంగా ప్రధానే బహిరంగ వేదిక మీద ఆయన పార్టీలోకి ఆహ్వానించాలరనేది ఓ వాదన. బీజేపీలో ఇప్పుడున్న నేతలతో తెలంగాణలో అధికారంలోకి రావడం కల్ల అనే విషయం మోడీకి తెలిసిపోయిందని, అందుకే రేవంత్ లాంటి నేత వస్తే తప్ప అది సాధ్యం కాదని తేల్చిపారేశారనే వాదనలు తెరమీదకు వస్తున్నాయి. మోడీ ఈ ఒక్క మాటతో కేసీఆర్ పాత ప్రయత్నలు.. రేవంత్ స్టామినా.. బీజేపీ నేతల చేతకానితనం.. మూడు బయటపడ్డట్టేనని వ్యాఖ్యానించుకుంటున్నారు.