ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 90 సీట్లు గెలుస్తామన్నాడు కేటీఆర్ మొన్న మీట్ ది ప్రెస్లో. అంటే ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటున్నారన్నమాట. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలైతే జరగవు కానీ.. ఇంకా రెండున్నరేండ్లలో జరిగితే.. అప్పుడెన్ని గెలుస్తారు? ఇంతకన్నా ఎక్కువనా? మొన్నటికన్నా ఘోరంగానా? కేటీఆర్ మాటలు అవే అర్థానిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అని కాదు అనాల్సింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ! అని అనాలి. ఇలా అంటే.. మా పట్ల జనం నమ్మకం పెరిగింది.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాకు పట్టం గట్టేలా ఉన్నారు. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాము.. అని అర్థం స్పురిస్తుంది. సేమ్ ఇదే క్రైటేరియాతో.. ఓ సంస్థ సర్వే చేయింది. అదే కేటీఆర్ అన్న కంటెంట్ను బట్టే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..! అనే కాన్సెప్ట్తో. అది ఇంచుమించుగా మళ్లీ బీఆరెస్సే అధికారంలోకి రానుంది. దాదాపుగా 60-70 వరకు బీఆరెస్ గెలిచే చాన్సు ఉంది అని చెప్పింది. ఆ సంస్థ సర్వే చేసింది.. ఇది చెప్పేందుకే! అది బీఆరెస్ చేయించిందన్నమాట. ఇక ఈ సర్వే ఫలితాలను ఎలా వాడుకున్నారో తెలుసా? తాము ఇప్పటికే భారంగా మూడు సార్లు మోసిన సిట్టింగులు, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులను కొందరిని ఏరిపారేసేందుకు.
అవును… ఈ సర్వే ఫలితాలను కేటీఆర్ తన సోషల్ మీడియా టీమ్లో ఒకరికి దీన్ని సెన్సేషనల్ న్యూస్గా ప్రజెంట్ చేయమని ఉసిగొలిపాడు. ఇక దీన్ని ఊదరగొట్టింది ఆ పెయిడ్ యూట్యూబ్ చానెల్. మొన్న ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేల పీడ విరగడ చేసుకునేందుకు, వారి సీటుకు వచ్చేసారి ఎసరు పెట్టేందుకు ఈ సర్వే ఫలితాలను వాడుకున్నాడన్నమాట కేటీఆర్. ఎవరైతే జనం ఛీ కొట్టి.. ఇక వద్దే వద్దు అని అనుకుంటున్నారో.. ఎవరైతే జనంలో బాగా వ్యతిరేకత పెంచుకున్నారో వారిని వదిలించుకునేందుకు వారి నియోజకవర్గాలకు తక్కువ శాతం గెలిచే చాన్సు ఉందని ఈ సర్వే తెలిపింది. దీని ఆధారంగా వారికి వచ్చేసారి టికెట్ ఉండబోదనే విధంగా పరోక్ష సంకేతమిచ్చింది బీఆరెస్ పార్టీ.
అంటే వారిని మానసికంగా ఇప్పటి నంచే సిద్దం చేస్తున్నారన్న మాట. మొన్న హరీశ్రావు కూడా ఓ ఇంటర్వ్యూలో మమ్మల్ని సిట్టింగులను మార్చుమని బాగా ఒత్తిడి పెరిగింది. వారిపై బాగా వ్యతిరేకత ఉందనే విషయం మాకు తెలిసింది. కానీ ఏం చేయలేకపోయాం.. అన్నాడు. అంటే ఈసారి ఆ తప్పిదాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ చేయరన్నమాట. అందుకే నిర్దాక్షిణ్యంగా.. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే.. ఓడిన మాజీలకు, చావు దప్పి కన్ను లొట్టబోయి గెలిచిన సిట్టింగులకు.. ఇక మరోచాన్స్ ఉండబోదనే సంకేతాలనిస్తోంది. దీని ద్వారా దాదాపు 40 మందికి పైగా అభ్యర్థులను మార్చాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
వీరి స్థానంలో కొత్త వారిని రంగంలోకి దింపడం… ఇతర పార్టీల నుంచి తమకు టచ్లో ఉన్న వారికి హామీ ఇచ్చి సమయం చూపి వారిని పార్టీలోకి ఆహ్వానించడం చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే తమకు టికెట్ ఇవ్వబోరని తెలుసుకున్న చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. బీజేపీలోచాన్స్ కోసం ట్రై చేస్తున్నారు.