కొంచెం అతే అనిపిస్తుంటుంది చంద్రబాబు చేష్టలు. నిర్ణయాలు. ఒక్కొక్కప్పుడు. ఎంతో అనుభవమున్న నేతగా.. అడ్మినిస్ట్రేషన్పై అపారమైన పట్టున్న ప్రభుత్వాధినేతగా ఆయనకు పేరుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఒక్కోసారి చాలా సిల్లీ థింగ్స్పై ఆయన స్పందించే తీరు చర్చకు వస్తుంటాయి. మొన్నటికి మొన్న ఏపీలో జనాభా పెరుగుదలపై ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం చర్చలో భాగమైన విషయం తెలిసిందే. మేమిద్దరం మాకిద్దరు… అనే కుటుంబ నియంత్రణ రోజులకు స్వప్తి పలికి.. నలుగురేసి సంతానాన్ని కనాలని ఆయన ప్రోత్సహించారు. వారికి ఇన్సెంటీవ్లు కూడా ఇస్తామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతున్న తెలుగు జనాభాను పెంచేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఇక తాజాగా పొదుపు మంత్రం అమలు చేయడానికి డిసైడ్ అయ్యిందా సర్కారు. మోడీ ఇలా వచ్చి హైదరాబాద్ వేదికగా.. పొదుపు జపం చేసి చల్లగా జారుకున్నారు. అప్పుడెప్పుడో.. కరోనా సమయంలో అంతా గిన్నెలు, పళ్లేలు… ప్లేట్లతో చప్పుడు చేయండి.. ఆ చప్పుడుకు వచ్చే ధ్వని తరంగాలతో కరోనా పారిపోతుందన్నాడు. అంతా అట్లనే చేశాం. దీపాలు ముట్టించి.. ఆ వెలుగు జిలుగుల నుంచి వచ్చే కాంతి పుంజం మహమ్మారిని మింగేస్తుందన్నాడు. అంతా దీపావళి జరుపుకున్నాం. ఇదిగో ఇప్పుడు ఇలా.. మోడీ శాసించాడు.. ఇక మేం పాటిస్తాం.. అని వెంటనే ఆచరణలోకి తీసుకుచ్చే బృహత్తర, గురుతర బాధ్యతను భుజానికెత్తుకుని జాతికి సందేశమిచ్చాడు.
పొదుపు అమలులో ఏపీ ముందుందని. అంతే అదో కోరిక వీరికి. అన్నింటా మేమే ముందున్నామని, అంతా నేనే చేశానని, అంతా నావల్లే అయ్యిందని అతి చెప్పుకోవడం, భుజకీర్తులు తగిలించుకోవడం అలవాటు. కేసీఆర్కు కూడా. ఈ విషయంలో ఆయనేమీ తక్కువ కాడు. సరే, ఇప్పుడు మనం ఏపీ గురించి.. మన బాబుగోరు గురించి మాట్లాడుకుంటున్నాం.. ! ఇవాళ కేబినెట్ సమావేశం పెట్టారు. ఇందులో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏదో అనుకున్నాం. పెద్దగా వండర్ అయ్యే ముచ్చట్లేమీ లేవు అందులో. ఒకే ఒక కీలకమైనది. అది జనాలకు కాదు. ఆ సర్కార్కు, ఆ నేతలకే అది కీలకమైనది కావొచ్చు బహుశా. అది ఏంటంటే.. పొదుపు చర్యలపై సుధీర్ఘ చర్చ జరిగిందట క్యాబినెట్లో. అంతిమంగా ఏం నిర్ణయానికొచ్చారంటే.. వారానికోసారి నో వెహికిల్ డే.. ని పాటించాలని.
అంటే వారంలో ఒక రోజు వాహనం కాకుండా.. ఆల్టర్నేట్ అంటే.. ఓ బస్సు, ఓ ట్రైన్.. ఓ ఆటో.. ఏదైనా కావొచ్చు. వాటి ద్వారా ప్రయాణం చేయాలట. నిత్య కార్యక్రమాలు చేసుకోవాలట. ఇదీ కేబినెట్ కీలక నిర్ణయం. ఈ నిర్ణయం ఇలా వచ్చిందో లేదో… డిప్యూటీ సీఎం పవన్ గారు తన వాహన శ్రేణిలోని 50 శాతం వాహనాలను తగ్గించేసినట్టు ఓ సంచలన వార్త కూడా వచ్చింది. ఏందయ్యా ఇది..! చేస్తే చేసుకోండి పొదుపు. దీనికి ఇంత ఆర్బాటమెందుకు? ప్రచారమెందుకు? మీరే ఇట్లా చేస్తే.. సామాన్య జనం జడుసుకుంటారు. ముందు ముందు ఆర్థిక సంక్షోభం రాబోతుందని మీరు సంకేతాలిచ్చి.. వారిని హడలెత్తించి.. పెట్టుబడుదారులను ఆలోచనల్లో పడేసేలా చేసి.. రియల్ ఎస్టేట్పై ప్రభావం పడేలా చేసి.. లిక్విడ్ క్యాష్… బందీ అయ్యేలా చేసి.. ఇవన్నీ ఒకదానికొకటి లింకుగా జరిగే ప్రహసనాలు.. ప్రమాదాలు కావంటారా? ఇంత విజనరీ ఉన్న నేత కూడా ఇలా చిన్న విషయాలను పెద్దగా భావించి ఊహించి.. పాటించి.. ఎందుకు ఇంత అతి.. అనుకుంటున్నారట ఏపీ ప్రజలు.
అవునూ.. ఇది కేవలం మోడీగారి దృష్టిలో పడేందుకేగా.. కేసీఆర్ కూడా ఇలాగే చేశాడు స్టార్టింగులో. కానీ ఆ తరువాత అక్కడ ఆయన పప్పులేమీ ఉడకలేదు.