అనువుగాని చోట అధికుల మనరాదు.. కొండ అద్దమందు కొంచెమై ఉండదా? అనే వేమన పద్య సారాంశాన్ని ఫాలో అయ్యారు మొన్నటి దాకా బీజేపీ నేతలు. దేశంలో ఏయే రాష్ట్రాల్లో తమ పార్టీ బలహీనంగా ఉందో వారికి తెలుసు. ఇప్పట్లో అధికారంలోకి రాదు.. అని కూడా వారికి తెలుసు. అందుకే తమ బలమేంటో, ఏపాటిదో తెలుసుకుని మసలుకున్నారు.
కానీ కేంద్రంలో అధికారంలో ఉండాలనేదే అల్టిమేట్ లక్ష్యం. అందుకే దాని కోసమే పావులు కదిపారు. వ్యూహాలు పన్నారు. ఎత్తులకు పైఎత్తులు వేశారు. మొత్తానికి కాంగ్రెస్ను ఖాళీ చేసే పన్నాగాలే పన్నింది బీజేపీ. అక్కడ అధికారంలో ఎవరైనా ఉండని, వారికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్పై ఉసిగొల్పింది. దాని మూలాలు దెబ్బతీయాలనేదే ప్రధాన టార్గెట్.
అందుకే శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నినాదాన్నే పాటించింది. ఆ విధానంలోనే వ్యూహాలు పన్నింది. అక్కడ కాంగ్రెస్కు ఆల్టర్నేట్ శక్తిగా ఉన్న పార్టీ భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ను ధన్ ధన్ మంటూ కాల్చేందుకు ఎప్పడూ రెడీగా ఉన్నది. కావాల్సినంత సహకారం వారికి అందిస్తూ వచ్చింది.
కానీ ఇంకెన్ని రోజులు ఇలా? తామూ అధికారంలోకి రావాలె కదా? అందుకే ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నది. సమయం కోసం చూస్తున్నది. దెబ్బ కొడితే అధికార పీఠం దక్కించుకోవాలంతే.. అనే విధంగా పంజా రెడీ చేసుకుంటున్నది. పశ్చిమ బెంగాల్లో అది నిర్విగ్నంగా పూర్తి చేసి చూపించింది. ఆ ఫలితాలనే తెలంగాణలోనూ రాబట్టాలనుకుంటున్నది. నిన్నటి మీటింగులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ నేతలకు ఉపదేశించింది ఇదే మంత్రం.
బెంగాల్ తరహా వ్యూహం.. పన్నాగాలతోనే తెలంగాణను కైవసం చేసుకోవాలి.. చేసుకోబోతున్నామని ఓపెన్గానే చెప్పుకుంటున్నారు. బాహాటంగానే ప్రకటించుకుంటున్నారు. ఒంటరిగా పోతామంటున్నారు. ఎవరి పొత్తుల కోసం వెంపర్లాడే స్థితిలో మేంలేమనే మెసేజ్ను పంపడం ద్వారా ఇక్కడి బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని ప్రోదీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఓ పదేండ్ల నుంచి సీరియస్గా పనిచేస్తూ వచ్చింది బీజేపీ. అప్పటి వరకు మమతను ఎంకరేజ్ చేసింది. టీఎంసీ వస్తే రానీ.. కానీ కాంగ్రెస్ రావొద్దనేది బీజేపీ అభిమతం. నాకు దక్కనిది కాంగ్రెస్కు అసలే దక్కకూడదనేదే దాని విధానం. అందుకే అక్కడ మమత మిత్రురాలైంది. ఆమె భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ కాల్చి ఖతం చేసింది. ఆ తరువాత మమతనే కాల్చేసింది. సర్తో టీఎంసీ ఆయువుపట్టు మీద దెబ్బ కొట్టింది.
బీజేపీ భావజాలం వ్యాపింపజేసుకుని అధికారాన్ని అందిపుచ్చుకున్నది. సేమ్ ఇదే ఫార్మూలా మొన్నటి వరకు తెలంగాణలో కూడా ప్లే చేసింది బీజేపీ. కాంగ్రెస్ను ఖతం చేసేందుకు బలంగా ఉన్న కేసీఆర్ను వాడుకున్నది. కేసీఆర్కు కావాల్సినవన్నీ చేసి పెట్టింది. అడిగినవన్నీ ఇచ్చింది. కానీ కేటీఆర్ను సీఎం చేయాలనే కోరిక దగ్గరే కేసీఆర్ను దూరం పెట్టింది. కేసీఆరూ దూరం పెట్టాడు. అందుకే ఇప్పుడు బీఆరెస్కు ఆల్టర్నేట్ మేమే అనే విధంగా బీజేపీ తనకు తాను ప్రొజెక్టు చేసుకుంటూ వచ్చింది.
బీఆరెస్ను బలోపేతం చేసినా ఏదో ఒకరోజు మమత లాగే టార్గెట్ చేయాలనేదే మోడీ, అమితాషాల లక్ష్యం. కానీ ఇలా అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చి పడుతుందని ఊహించలేదు. ఇంతలా కేసీఆర్ను పెంచి పోషిస్తే.. కాంగ్రెస్కు జీవం పోసిండే అని బాధపడింది బీజేపీ. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఇద్దరు శత్రవులు బీజేపీకి. మెల్లగా వంగి ఉన్న బీఆరెస్ను లొంగ దీసుకోవడం లేదా మరింత బలహీన పరచడం, కాంగ్రెస్కు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను ఆసరా చేసుకుని .. ఈ సారే గట్టిగా ప్రయత్నం చేసి దెబ్బ కొట్టడం వల్ల అధికారంలోకి రావడం.. దీనికి సర్ కూడా ఎంతో కొంత తోడు వస్తుందనే నమ్మకంతో ఉన్నది బీజేపీ.
ఒకవేళ అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు రాకున్నా.. తన చంకలోని బీఆరెస్ను కలుపుకుంటే సరిపోతుందనే సమీకరణ కూడా మధ్యేమార్గంగా ఆలోచించి వ్యూహాలు పన్నడం స్టార్ట్ చేసింది బీజేపీ. అందుకే ఇక్కడ బెంగాల్ ఫార్మూలాతో మేమే అధికారంలోకి రాబోతున్నామంటున్నారు. రెండు పిల్లులు రొట్టె కోసం కొట్లాడితే మధ్యలో వచ్చిన కోతి ఆ ఉన్న రొట్టెముక్కను ఎత్తుకెళ్లినట్టు బీజేపీ ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్నది.
అంతిమంగా.. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా.. తమ నినాదం కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధించినట్టు అవుతుంది.. తాము అధికారంలోకి వచ్చినట్టూ అవుతుంది. ఇదే మాస్టర్ ప్లాన్ ఇప్పుడు బీజేపీ మదిలో ఉన్నది.