ఈటల మామూలుగా ఎక్కువ మాట్లాడడు. మాట్లాడితే దానికో అర్థముంటుంది. విమర్శలు కూడా అర్థవంతంగా ఉంటాయి. ఫక్తు రాజకీయాల కోసం మాట్లాడినట్టుగా అనిపించదు. కొంచెం ఆలోచింపజేస్తాయి. రాజకీయాలకు అతీతంగా ఆ కామెంట్లు చర్చకు వస్తూ ఉంటాయి. విమర్శకులు సైతం అవును.. నిజమే కదా..! అని ఆయన మాటలతో ఏకీభవించే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి.
మళ్లీ అలాంటి కామెంట్సే ఇవాళ చేశాడు ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డిపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు. ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలతో అధిష్టానం భేటీ అయిన నేపథ్యంలో అందరికీ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని హితబోధ చేసి పంపారు. బయటకు వచ్చిన తరువాత నేతలు మాట్లాడిన మాటలు చూస్తే వారిలో దూకుడు కనిపించింది. మామూలుగా ఈటల రాజేందర్ సైలెంట్గా ఉంటాడు. అవసరమైతేనే మాట్లాడతాడు. అసందర్భ ప్రేలాపనలు అసలే ఉండవు. ఇవాళ మాట్లాడిన మాటలతో మళ్లీ ఈటల .. తనదైన ఈటెలను వదిలేందుకు రెడీ అయ్యాడా? అని అనిపించేలా ఉన్నాయి.
సీఎం రేవంత్పై మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవి అమలు కాలేదన్నాడు. అసలు వాటిని సంపూర్ణంగా అమలు చేసే అవకాశమే లేదన్నాడు. పరోక్షంగా అన్ని హామీలు నేరవేర్చడం రేవంత్తో సాధ్యం కాదని తేల్చేశాడు. ఈ విమర్శ కొత్తగా ఉంది. నీతో కాదని తేల్చేయడం వెనుక ఉత్త రాజకీయ విమర్శనే లేదు.. వాస్తవికత కూడా ఉంది. ఎందుకంటే.. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సగం కాలం పూర్తయ్యింది. చాలా హామీలు పెండింగ్లో ఉన్నాయి.
ఒక్క ఫ్రీ బస్సు , ఉచిత కరెంటు మినహా సక్సెస్ఫుల్గా అమలైన స్కీమ్ ఒక్కటీ లేదంటే ఆశ్చర్యం లేదు. మరి ఇచ్చిన హామీలు ఈ మిగిలిన గడువులోపు ఎప్పుడు పూర్తి చేస్తాడు? దీనికి సమాధానం దొరకదు. ఈటల దీనికి క్లారిటీ ఇచ్చాడు. రేవంత్తో ఇక ఇది అయ్యే పని కాదని. అంతే కాదు.. పాత స్కీములు.. అంటే కేసీఆర్ అమలు చేసిన స్కీములన్నీ అమలు చేసినా చాలు అని అనడం కూడా రాజకీయంగా చర్చకు తెర తీసింది.
మామూలుగా ఓ పార్టీ లీడర్ .. మరో పార్టీ లైన్ను పొగిడే విధంగా మాట్లాడరు. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఉన్నదున్నట్టుగా చెప్పేశాడు ఈటల రాజేందర్. వాస్తవానికి పాత స్కీములు చాలా వాటిని పెండింగ్లో పెట్టేసింది ఈ సర్కార్. అంటే పాత స్కీములు లేవు.. కొత్తవి రావు అని చెప్పడమే ఈటల ఉద్దేశ్యం. కానీ కేసీఆర్ను కీర్తించడానికి కాదు. ఆ వెంటనే కేసీఆర్ను కూడా అర్సుకున్నాడాయన. ఇంకా కేసీఆర్ అహంకారాన్ని జనాలు మరవలేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
అంటే ఇప్పుడంతా కేసీఆర్ రావాలంటున్నారని బీఆరెస్ విస్తృతంగా ప్రచారం చేసుకంటున్నది. దీనికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అహంకారపు పాలన అని మళ్లీ యాది చేయడం మూలంగా జనాలు అల్టర్నేట్గా బీజేపీని ఎంచుకుంటారని ఆయన భావనలా కనిపించింది. ఇతర నాయకులు విమర్శిచినట్టుగా కాకుండా.. జనం వైపు నుంచి వారి బాధలను అర్థం చేసుకుని అక్కడి నుంచి వచ్చే ఆక్రంధనలనే, వారి అభిప్రాయాలనే తన మాటలుగా చెప్పే ప్రయత్నం చేయడంలో ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉంటాడు.
ఇవాళ అదే చేశాడు. తన మాటలు జనం రిసీవ్ చేసుకోవడంతో పాటు అంతిమంగా తన పార్టీ లక్ష్యం కూడా వారి వద్దకు చేరాలని, ఓ చర్చ జరగాలనేది ఈటల రాజేందర్ వ్యూహంగా కనిపించింది.