జెన్జీ తాకిడి ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. యువతను బొద్దింకలుగా సంబోధించడం.. జెన్జీలో విప్లవానికి దారి తీసిన వైనానికి కారకులుగా నిలిచిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్కు ఇక్కడ హైదరాబాద్లో కూడా సెగ తగిలింది.
హైదరాబాద్లోని నల్సార్ (నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్) యూనివర్సిటీకి చెందిన స్నాతకోత్సవం-2026 ప్రోగ్రాంకు ఆయనను ఆహ్వానించారు. అయితే దీనిపై వర్సిటీ విద్యార్థులు విముఖత వ్యక్తం చేయడమే కాదు.. ఏకంగా వర్సిటీ బాధ్యులకు ఓ లేఖ రాశారు. ఆయన హోదా మీద మాకు గౌరవం ఉందంటూనే.. వ్యక్తిగతంగా ఆయన చేసిన కామెంట్స్ సరిగా లేవని, రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయనే విధంగా ఆ లేఖలో పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీసింది.
నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చడమే కాదు.. గత నెలలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జెన్జీ నిర్వహించిన ఆందోళనలో పోలీసుల దమనకాండ పట్లా ఆయన చేసిన కామెంట్స్ సరిగా లేవనే అభిప్రాయాన్ని ఆ లేఖలో విద్యార్థులు పేర్కొనడం చర్చనీయాంశమైంది. మాకేం పని లేదా.. అక్కడేం జరిగిందో చూడటానికి.. అనే కామెంట్స్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
అలాంటి వ్యక్తి నుంచి మేము పట్టాలు స్వీకరించబోమని ఆ విద్యార్తులు తెగేసి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అధికారికంగా ఓ తేదీని ఇంకా నిర్ణయించనందునా.. మరోసారి సీజేఐను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించే విషయంలో పునరాలోచించాలని సున్నితంగానే కోరుతూనే.. ఆయన వద్దనే విషయాన్ని విద్యార్థులు ఆ లేఖ ద్వారా స్పష్టం చేశారు.
పోలీసుల దమన కాండను కూడా పట్టించుకోనట్టుగా మాట్లాడిన వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకుంటే తాము న్యాయవిద్యను నేర్చుకున్న విలువలకు విరుద్దంగా ఉంటుందని అభిప్రాయపడటం గమనార్హం.
అంతే కాదు..ఆగస్టు 2న ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) కాన్వకేషన్ కూడా చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నది. దీనికి చీఫ్ గెస్ట్గా సీజేఐ సూర్యకాంత్ హాజరుకావాల్సి ఉంది. జెన్జీ నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్ల కారణంగా ఇది వాయిదా పడినట్టు తెలిసింది. జెన్జీ ఎఫెక్ట్ కేంద్ర ప్రభుత్వం మీదే కాదు… భారత న్యాయ మూర్తినీ వెంటాడుతున్న క్రమం ఇప్పుడు దేశ వ్యాప్త చర్చకు దారి తీస్తోంది.