మారిన తరానికి తగ్గట్టుగా, వస్తున్న మార్పులను పసిగట్టి తాము పరివర్తన చెందకపోతే కనుమరుగై పోతామనే నిజాన్ని తెలుసుకున్నది కేంద్రంలోని బీజేపీ. యువతరాన్ని, ఆ తరం చేసే ఉద్యమాలను మొదట తక్కువ అంచనా వేసింది. సేమ్ చీఫ్ జస్టిస్ లాగే. ఆయన బొద్దింకలంటూ లైట్గా తీసేశారు. ఆ బొద్దింకలన్నీ కలిసి జంతర్మంతర్ దగ్గర మోడీని ఛూ మంతర్ చేశాయి. దిగొచ్చేలా చేశాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా వదల్లేదు.
ఈ ఉదంతకానికి ముందు తరువాత .. బీజేపీ వ్యవహరించిన తీరు వేర్వేరుగా ఉన్నాయి. ఉద్యమానికి ముందు దీన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలని చేయని ప్రయత్నం లేదు. ఉగ్రవాదుల హస్తం, ప్రమేయమన్నారు. పక్కదారి పడుతోందన్నారు. దేశ విద్రోహ శక్తులకు జంతర్మంతర్ అడ్డాగా మారిందన్నారు. అయినా ఇంచుక మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పోలీసుల యాక్షన్నూ ప్రయోగించారు.
రబ్బరు బుల్లెట్లు, భాష్ప వాయు గోళాలు, లాఠీ చార్జీలు.. ఏమేమీ చేయాలో అన్నీ చేశారు. అయినా తగ్గలేదు. చివరకు కేంద్రమే తగ్గింది. దిగి వచ్చింది. జెన్జీ కోరిన న్యాయమైన కోరికలన్నీ తీర్చుతామని వినమ్రంగా ప్రకటించింది. అయితే ఈ పరిణామాన్ని ముందే పసిగట్టింది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ జంతర్మంతర్ వద్ద జెన్జీ ఉద్యమం తీవ్రతరం చేస్తున్న తరుణంలోనే ఆ ఉద్యమానికి తమ సంఘీభావం తెలిపారు.
అంటే.. కేంద్రంలోని బీజేపీ అనవసరంగా వీరితో పెట్టుకుంటోంది అనే భావన ఆయనకు ఉంది. కానీ అక్కడున్నది మోడీ. ఆయన ఎవరు చెప్పినా వినేవాడు కాదని మోహన్కు తెలుసు. అందుకే మోడీ చేసిన ఈ పొరపాటును తాను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగాడు. మేము మీకు మద్దతుగా ఉంటామని నేరుగా, డేర్గా ప్రకటించడం అప్పట్లో చర్చకు తెర తీసింది.
కానీ మోడీకీ ఆ తరువాత తత్వం బోధపడ్డది. అందుకే తగ్గాడు. దిగివచ్చాడు. వరుసగా రెండు రోజులు అర్థరాత్రులు వీడియో సందేశాలు కూడా అందులో భాగంగానే చూడాలి. అయితే ఆ తరువాత ధర్మేంద్ర ప్రధాన్ను పార్లమెంటులో తోటి ఎంపీలు రిసీవ్ చేసుకున్న విధానాన్ని మళ్లీ అంతా తప్పుబట్టారు.
విద్యార్థుల ఉద్యమానికి రాజీనామా చేసిన ఓ నేతను ఘనంగా స్వాగతం పలకడం.. అతన్ని సత్కరించడమేమిటని ప్రశ్నించారు. ఇదీ ఓ పొరపాటుగా ఆర్ఎస్ఎస్ వెంటనే తెలుసుకున్నది. అందుకే మళ్లీ భగవత్ రంగంలోకి దిగాడు. జెన్జీ మనవాళ్లేనన్నాడు. వారి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, ఉద్యమాల నిర్మాణాలు బాగా మెచ్యూర్గా ఉంటున్నాయని కితాబిచ్చాడు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడవాలని కూడా సూచన చేశాడు.
ఆ తరువాత ధర్మేంద్ర కూడా తప్పు తెలుసుకుని చెంపలేసుకుని పశ్చాత్తాపం పలుకులు పలికాడు. జెన్జీ ఉద్యమాన్ని కీర్తించాడు. తానే రాజీనామా చేస్తానని మోడీకి చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. జెన్జీ తమకు దూరం కావొద్దని, వారితోనే మేముంటామనే విధంగా ఇటు బీజేపీ, అటు ఆరెసెస్ కామెంట్లు ఉంటున్నాయి. ఈ పరిణామాన్ని మారిన కేంద్రం వైఖరికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.