పంద్రాగస్టు నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. ఏటీఎం, పాన్, డ్రైవింగ్ లైసెన్సు కార్డుల మాదిరిగా ఇవ్వనున్నారు. జేబులో పెట్టుకునేలా వాటర్ ప్రూఫ్ పీవీసీ రూపంలో, ఆధునిక క్యూ ఆర్ కోడ్, ఈ – కేవైసీ వివరాలతో ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉండనుంది.
సంగారెడ్డి జిల్లాలో సీఎం ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా.. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా అదే రోజు పంపిణీని లాంఛనంగా చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.06 కోట్ల వరకు రేషన్కార్డులున్నాయి. వీరందరికీ విడతల వారీగా స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. ఇప్పుడు ఈ రేషన్కార్డులకు మోక్షం లభించింది.
కేసీఆర్ పదేళ్ల పాలనలో రేషన్కార్డులను ముద్రించేందుకే ముందుకు రాలేదు. దీంతో జిరాక్స్ పత్రాలతో, రేషన్కార్డు నెంబర్లు చెప్పడం ద్వారా బియ్యం తీసుకున్నారు మొన్నటి దాకా. ఎందుకు అప్పుడు రేషన్ కార్డులు ముద్రించలేదంటే.. ఈటల రాజేందర్ ఫోటోను ఆ కార్డుల పై ముద్రించాలి కాబట్టి.
బీఆరెస్ పాలనలో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల తరువాత సీఎం కేసీఆర్కు, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్కు మధ్య గ్యాప్ పెరిగింది. కొన్ని కార్యక్రమాల్లో టీఆరెస్ పార్టీ ఓనర్లము మేమే అనే విధంగా ఈటల రాజేందర్ చేసిన కామెంట్లు ఆ పార్టీలో చర్చకు తెర తీశారు.
కేసీఆర్ మాటను జవదాటే ఎవరినీ ఉపేక్షించడు. తను చెప్పినట్టు వింటేనే సరి, లేదంటే వారితో మాట్లాడడు. వారి ముఖం కూడా చూడడు. తెలంగాణ సర్కార్ ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఈటలతో గ్యాప్ పెంచుకున్నాడు కేసీఆర్. రెండో టర్ము ప్రభుత్వం ఏర్పడిన తరువాత అసలు ఈటలకు మంత్రి పదవే ఇవ్వొద్దనేంతగా దూరం పెట్టాడు.
రేషన్ కార్డులు ముద్రిస్తే.. తన ఫోటోతో పాటు సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఫోటో కూడా ముద్రించాల్సి వస్తుంది. ఇది ప్రతీ ఒక్కరి ఇంటిలో భద్రంగా ఉంటుంది. ఇది కేసీఆర్కు ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే రేషన్ కార్డులను ముద్రించేందుకు కాంట్రాక్టును ఓ సంస్థకు ఇచ్చిన తరువాత కూడా దీన్ని క్యాన్సల్ చేయించాడు కేసీఆర్.
అంతలా ఈటల రాజేందర్పై కసి పెంచుకున్నాడు. ఆ తరువాత క్రమంలో ఆయనపై అవినీతి ఆరోపణలు చేయించి.. వైద్యారోగ్యశాఖకు అనారోగ్యం పేరిట తన సొంత మీడియా టీ న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ పెట్టించిన ఘనుడు కేసీఆర్. ఈటల పై కోపంతో జనాలకు రేషన్కార్డులే లేకుండా, చూసుకోకుండా చేశాడు. అప్పటి నుంచి జిరాక్స్ పత్రాల చిరిగిన పేపర్లతోనే సరిపెట్టుకున్నారు. ఇదిగో ఇన్నాళ్లకు రేవంత్ సర్కార్ ఇలా స్మార్ట్ కార్డులను ఇస్తోంది. ఇదన్నమాట తెలంగాణ ప్రభుత్వాల రేషన్కార్డుల కథా కమామీషు!