ఒక రోజు సీఎం…. శంకర్ డైరెక్షన్లో అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా సూపర్ హిట్. కానీ నాదెండ్ల భాస్కర్ రావు ఆనాడు ఆడిన రాజకీయ క్రీడలో ఒక నెల సీఎంగా చేసినా.. అట్టర్ ఫెయిల్యూర్ నేత. ఆ తరువాత ఆయన రాజకీయాలకే కనుమరుగయ్యాడంటే.. ఆ పరిస్థితుల ప్రభావం అంత తీవ్రంగా ఉన్నది. ప్రజాస్వామ్యం.. గవర్నర్ అధికారాలు. ప్రజా మద్దతు అంశాలు తీవ్రంగా చర్చకు వచ్చిన రోజులవి. దేశ వ్యాప్తంగా ఏపీ రాజకీయాల గురించి హాట్ హాట్గా చర్చించుకుంటున్న సందర్బమది. కేంద్ర రాజకీయాలు కూడా ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసించే క్రమంలో జోక్యం చేసుకున్న తీరు తెన్నులు.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా ఉన్నాయనే ఆరోపణలు మూటగట్టుకున్న రాజకీయ చరిత్రకు మూలమది.
అవును… నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ నేపథ్యం.. ఈ ఒక్క నెల సీఎం సంఘటనతో ముడిపడి ఉంది. తెలుగు రాష్ట్రాలు.. అప్పటి ఉమ్మడి ఏపీలో ఆయన పేరు అంతగా వినిపించిందంటే… ఆయన ఎంచుకున్న వివాదస్పద వైఖరి, నిర్ణయమే. ఆ ఒక్కడే ఈ నిర్ణయం తీసుకున్నాడా? ఆ నాటి కేంద్రం జోక్యం.. నాదెండ్ల తన రాజకీయ భవిష్యత్తును రిస్కుల పెట్టి మరీ వేసిన అడుగులు..ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే ఓ చేదు అనుభవాలే. ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు రాజకీయ జీవితాన్ని ఆరంభించిన నాదెండ్ల భాస్కరరావు.. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.
తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టుపెడుతున్నారనే నినాదంతో 1980లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ప్రకంపలను సృష్టించింది. ఆ సెగ ఢిల్లీ పీఠానికి తాకింది. పార్టీ ఆవిర్భావంతోనే పెను సంచలనం సృష్టించిన ఎన్టీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారు. కేంద్రానికి, ఏపీకి మధ్య తీవ్ర రాజకీయ అగాధాన్ని ఏర్పర్పిచాయి ఆనాటి పరిస్థితులు. పార్టీ స్థాపనతోనే ఎన్టీఆర్తో కలిసి నడిచాడు నాదెండ్ల. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కీలక నేతగా, ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ సర్కార్ ఏర్పడిన నాలుగేండ్లకే తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెర లేపాడు నాదెండ్ల.
ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లడం…వెంటనే ఇక్కడ కేంద్రం పెద్దల సహకారం, జోక్యంతో గవర్నర్ తోడు రాగా.. తనకే అధిక సభ్యుల మద్దతు ఉందని.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేశాడ భాస్కర్ రావు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఎన్టీఆర్కు విపరీతమైన మద్దతు, సానుభూతి లభించింది. టీడీపీ కార్యకర్తలు, లీడర్లు రాష్ట్రం వ్యాప్తంగా చేసిన ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిపోయింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయం కూడా తీవ్ర ఆక్షేపణీయంగా భావించారు. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత భావం వ్యక్తమయ్యింది. ఈ తీరు సరైంది కాదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వ్యక్తమయిన నేపథ్యంలో.. నెల రోజుల్లోనే మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. ఎన్టీఆర్ తిరిగి రావడం.. తనకే మద్దతు ఉందని నిరూపించుకోవడం.. నాదెండ్ల వెంటనే రాజీనామా చేయడం… ఎన్టీఆర్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం ఇవన్నీ చకాచకా జరిగిపోయారు.
నాదెండ్ల భాస్కర్రావు సీఎంగా కొనసాగింది సరిగ్గా ఒక నెల రోజులు మాత్రమే. 1984 ఆగస్టు – సెప్టెంబర్లో ఆయన సీఎంగా కొనసాగారు. ఈ కాలమంతా నిరసనలు, ఆందోళనలు, గవర్నర్ అధికారాలపై తీవ్ర చర్చలు, సమావేశాలతోనే గడిచిపోయింది. ఎన్టీఆర్కు అత్యంత ఆప్తుడిగా ఉండి.. వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపి.. రాజకీయ సంక్షోభానికి కారణమైన నాదెండ్ల వ్యవహర తీరుపై మద్దతు కొరవడింది. విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయాలకు ఇలాంటి పరిస్థితులు, పరిణామలు సరికావనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఆ తరువాత నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయాలకు దూరమయ్యారు. కాదు కనుమరుగే అయ్యారు. ఆనాటి సంక్ష్లిష్ట రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిపోయారు.