రేపు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం. ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చడం, డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం.. రాజకీయాలన్నీ హట్ హాట్గా ఉన్న ఈ క్రమంలో కవిత .. కొత్త పార్టీ ద్వారా బయటకు రాబోతున్నారు. ఇంత వేడి రాజకీయాల్లోనూ ఆమె కొత్త పార్టీ పట్ల డిస్కషన్ మాత్రం ఆగలేదు. పార్టీ ప్రకటన చాలా సింపుల్గానే చేస్తున్నట్టు ఆమె చెబుతున్నా.. హడావుడి మాత్రం బాగానే కనిపిస్తున్నది. మేడ్చల్లోని మునీరాబాద్, అద్వయ కన్వెన్షన్లో ఆమె రేపు ఉదయం 11 గంటలకు పార్టీ పేరు, గుర్తు, జెండా, ఎజెండాను ప్రకటించున్నారు.
అన్ని జిల్లాల నుంచి జాగృతి ముఖ్య కార్యకర్తలు, కొంత మంది బీఆరెస్ నాయకులు, తాజా సర్పంచులు, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు.. మాజీలు… మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. కొంత మంది స్వచ్చంధంగా వస్తున్నారు. అయితే .. ఈ పార్టీ ప్రకటన ఆర్బాటంగా, బహిరంగ సభ లా కాకుండా.. సింపుల్గానే కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు కవిత. దాదాపు 15వేల నుంచి 50వేల మంది వరకు ప్రజలు హాజరుకావొచ్చు. పార్టీ పెట్టకముందే చాలా విషయాల్లో కవిత సక్సెసయ్యారు. బీఆరెస్ పార్టీ సస్పెండ్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె చేస్తున్న కార్యక్రమాలన్నీ జాగృతి వేదికగానే. అంటే రాజకీయ పార్టీ వేదిక కాదది.
కానీ ఆమె రాజకీయ వేదిక మీద చేసినట్టే చేశారు. జాగృతిని పార్టీ వేదికగానే మార్చారు. జెండా లేదు, ఏజెండా క్లియర్గా ఉంది. పార్టీ విధి విధనాలు లేవు.. కానీ విధానాలు ఇలా ఉంటున్నాయని ఇప్పటికే విడమర్చి చెప్పారామె జనాలకు. పార్టీ పాలసీ ఏమిటో దాదాపుగా రాజకీయ పార్టీ నాయకులకు, తెలంగాణ ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది. కానీ పార్టీ పేరు, గుర్తుపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయంలో కూడా కవిత సక్సెసయ్యారని చెప్పాలి. అన్నీ లీకులే ఇస్తున్నారు తప్పితే.. ఏదీ ఇదమిత్థంగా చెప్పడం లేదామె.
తెలంగాణ ప్రజా జాగృతిగా దాదాపు అంతా ఫిక్సయ్యారు. ఇప్పుడు అక్కడ తోరణాల దగ్గర తెలంగాణ ప్రజా వికాస్ సమితిగా పేర్లు కొన్ని చోట్ల దర్శనమివ్వడంతో ఇదేనా పార్టీ పేరు అనే డిస్కషన్ మొదలయ్యింది. జాగృతి కార్యాలయంలో కూడా కొత్త పేరు ఇంకా పెట్టలేదు. పాత పేరు మార్చలేదు. దీంతో పాటు ఆమె మీడియాతో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. టీఆరెస్ పేరును కూడా పరిశీలిస్తున్నాం.. అని లీకిచ్చారు. దీంతో బీఆరెస్ వర్గాల్లో ఇది కలకలం రేపింది.
ఈ భయం ఎంతలా పట్టుకుందంటే… కేటీఆర్ వెంటనే మళ్లీ పార్టీ పేరును టీఆరెస్గా మార్చాలని అనుకుంటున్నామని ప్రకటించేదాకా వెళ్లింది పరిస్థితి. అప్పట్నుంచి అందరి దృష్టి టీఆరెస్పై పడింది. ఎవరికి టీఆరెస్ వస్తుంది… టెక్నికల్ ఇష్యూలు అడ్డం వస్తున్నాయా? ఎన్నికల కమిషన్ ఏం చెబుతున్నది? అని ఎవరికి వారే అంచనాలు వేసుకుంటూ, విశ్లేషణలు చేసుకుంటున్నారు. కానీ కేటీఆర్ నోటి వెంట కూడా టీఆరెస్ అని రావడంతో.. బీఆరెస్కే ఇంకా టీఆరెస్ పేరును ఓన్ చేసుకునే చాన్స్ ఉన్నట్టుగా క్లారిటీ వచ్చింది. దీంతో మరి కవిత కొత్త పార్టీ పేరేంది? అని మళ్లీ చర్చ మొదలయ్యింది.
మొత్తానికి తెలంగాణ ప్రజా జాగృతి గానే పేరుంటుందని ఓ అంచనాకు వచ్చారు. తాజాగా అది తెలంగాణ ప్రజా వికాస సమితిగా మారింది. దీనిపైనా ఇంకా క్లారిటీ లేదు. ఇక పార్టీ గుర్తుగా గంట గుర్తు అని ప్రచారం చేస్తున్నారు. ధర్మగంటగా చెబుతున్నారు. ధర్మం, న్యాయం కోసం పోరాడే తమకు ఈ గుర్తు కరెక్టుగా సూట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అంతకు ముందు ఆమె ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీతో టైఅప్ అయ్యారు.సింహం గుర్తుపై మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయించారు. కొన్ని సీట్లు కూడా గెలిచి తన సత్తా చాటారు. అయితే ఆమె సింహం గుర్తుపైనే జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వెళ్తారని అంతా భావించారు.
కానీ.. ఈ ఎన్నికలు మరింత జాప్యం జరిగే అవకాశం ఉండటం.. సింహం గుర్తు ద్వారా పదే పదే ఎన్నికలకు వెళ్తే.. అది కవిత పార్టీ గుర్తుగానే జనాలు స్వీకరించే ప్రమాదం ఉన్నందున ఆమె వెంటనే తన కొత్త పార్టీ ప్రకటన వైపు దృష్టి కేంద్రీకరించారు. పార్టీ పేరు నమోదులో టెక్నికల్ సమస్యలు బాగానే వచ్చినట్టున్నాయి. అయినా వాటన్నింటినీ ఆమె ఓర్పుగా, నేర్పుగా ఎదుర్కొని .. మొత్తానికి తన సొంత, కొత్త పార్టీ వేదికగా కొత్త రాజకీయాలను నడిపేందుకు రెడీ అయ్యారు. నిన్నటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్కగా ఆమె తీరు ఉంటుందని జాగృతి నాయకులు, ఆమె అభిమానులు భావిస్తున్నారు.