కాక్రోచ్ జనతా పార్టీ (CJP)పై కాషాయ దళం విరుచుకుపడింది. అంతా ఊహించినట్టే ఎటువైపు నుంచి ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదని, ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని ఆ పార్టీ బాధ్యులు భావించినట్టుగానే ..ఈ పార్టీ చేపట్టే ఉద్యమాలను మోరల్గా దెబ్బతీసేందుకు బీజేపీ అనుబంధ శక్తులు .. కుట్రకు తెర లేపాయి. కాక్రోచ్ పార్టీకి వస్తున్న ఆధరణ.. ఆ పార్టీ విధివిధానాలు, ఉద్భవించిన నేపథ్యం.. తీసుకున్న లైన్.. అన్నీ బీజేపీకి వ్యతిరేకమే. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక ఎజెండాతో తన నిరసన రూపాలను ఎంచుకున్నది. మొన్ననే ఢిల్లీ జంతర్మంతర్ వేదికగా నీట్ పేపర్ లీక్ ఉదంతంపై నిరసన తెలిపింది. ఇది సక్సెసయ్యింది కూడా.
ఆ తరువాత కేంద్ర విద్యామంత్రిని వారంలోపు రాజీనామా చేయాలని కూడా ఆ పార్టీ నుంచి హెచ్చరిక ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో ఓ వైపు ఆరెసెస్.. ఆ కాక్రోచ్ పార్టీకి మద్దతిస్తున్నట్టుగా ప్రకటించి దగ్గరయ్యే ప్రయత్నం చేయగా.. తాజాగా సోషల్ మీడియాలో మొన్న జరిగిన నిరసన ఫోటోలకు బదులు తప్పుడు ఫోటోలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడో 2014 నవంబర్ 2న కేరళలోని కొచ్చిలో జరిగిన కిస్ ఆఫ్ లవ్ నిరసన ఫోటోలను ఈ ఉద్యమంలో జరిగిన ఫోటోలుగా వాడుకున్నారు. ఆ కిస్ ఆఫ్ లవ్ నిరసనలో పాల్గొన్న జంటలు ముద్దులు పెట్టుకునే దృశ్యాలు.. వారిని చిత్రీకరిస్తున్న మీడియా.. ఆ ఫోటోలలో ఉన్నాయి.
అచ్చంగా అది కూడా యువతంతా గుమిగూడిన ప్రాంతంగానే ఉండటం.. మీడియా కూడా అక్కడ పోగై ఉండటంతో ఈ ఫోటోలను .. కాక్రోచ్ ఉద్యమ సందర్బంలో చోటు చేసుకున్న సంఘటనలుగా చెబుతూ జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కేరళలో కోజికోడ్లోని ఓ కెఫెలో ఓ జంట పై పోలీసులు దాడి చేయడం ఈ నిరసనకు కారణమైంది. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా ఫేస్బుక్ వేదికగా కిస్ ఆఫ్ లవ్ ఉద్యమానికి యువత పిలుపునివ్వడం.. అంతా కొచ్చిలో గుమిగూడి.. ముద్దులు పెట్టుకుని నిరసన తెలపడం, ఇది వివాదానికి, హింసకు దారి తీసింది. దీన్ని అప్పుడు బీజేపీ అనుబంధ సంస్థలుగా ఉన్న సంఘాలన్నీ వ్యతిరేకించాయి.
వారంతా ఇది సంప్రదాయ విరుద్దమని దీన్ని వ్యతిరేకిస్తూ దాడులకు దిగడంతో పోలీసులు మళ్లీ రంగ ప్రవేశం చేసి లాఠీ చార్జి చేయడం.. కేసులు పెట్టడం.. వివాదమైంది. కాగా ఈ కిస్ ఆఫ్ లవ్ నిరసన మెల్లగా ఢిల్లీతో పాటు ఇతర మెట్రో నగరాలకు కూడా పాకింది. అయితే ఆ వివాదస్పద నిరసన ఫోటోలను, కాక్రోచ్ పార్టీ ఉద్యమానికి ఆపాదిస్తూ .. చూశారా వీరి నిజ స్వరూపాలు.. అని దానికి వ్యాఖ్యానాలు కూడా జోడించి మరీ వీటిని విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. దీనివల్ల సీరియస్గా సాగుతున్న ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం.. యువత ఈ పార్టీ విధానాలను తప్పుబట్టి.. మెల్లగా చీలికలు తేవడం వారి ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది.
ఏదో రకంగా దీన్ని మరింత పెద్దది చేయకుండా.. అందరి దృష్టిని మరల్చి.. దీని ఉద్దేశ్యాన్ని తప్పుదారి పట్టించడం మూలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఆపదను నివారించినట్టు అవుతుందనేది వారి భావనగా కనిపిస్తున్నది. వాస్తవాలు తెలియని చాలా మంది న్యూట్రల్ పీపుల్ కూడా.. ఈ ఫోటోలు చూసి నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఈ ఫోటోలు ఫేక్ అని తెలిసినా.. బీజేపీ సానుభూతి పరులుగా ఉన్నవారు కావాలని దీన్ని ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.