ఊరందరిదీ ఒకదారైతే తెలంగాణ బీజేపీది మరోదారి అన్నట్టుగా ఉంది. నేను చెప్పేది కాక్రోచుల ఆందోళన గురించి. అక్కడ మోడీనే కాక్రోచుల ధాటికి తట్టుకోలేక.. రోజుకో వీడియో విడుదల చేస్తుంటే.. విద్యాశాఖ ప్రక్షాళన పేరుతో రోజుకో సంస్కరణ చేపడుతుంటే.. ఇక్కడ మాత్రం బీజేపీ నేతలు ఇది అరాచకశక్తుల పని అని, హిందూ రాజ్యాన్ని కుప్పకూల్చేందుకు ముస్లింలు ఆడుతున్న నాటకమని ఏదేదో అంటూ మరింత చులకనవుతున్నారు. పలుచవుతున్నారు.
పైగా ఈ లీకులు కామనే.. ఎక్కడ కాలేదు.. ఏ రాష్ట్రంలో కాలేదో చెప్పండి..? అంటూ ఉల్టా దబాయిస్తున్నాడు బండి సంజయ్. స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఏదో మాట్లాడాలె కాబట్టి.. బీజేపీ శ్రేణులను ఆనంద పరిచేందుకు, మోడీ అభిమానులకు ఊరటకలిగించేందుకు మాట్లాడుతున్నాడు తప్ప.. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే బీజేపీలో ఈ నేతలందరికీ కంటే ఈటల రాజేందర్ పై చాలా మందికి గురి. ఏం మాట్లాడిన ఓ లాజిక్ ఉంటుంది. ఓ అర్థం ఉంటుంది. అన్నిటికన్నా మించి వాస్తవికతకు దగ్గరగా ఆయన కామెంట్స్ ఉంటాయి.
రాజకీయాలకతీతంగా తనదైన స్టైల్లో మాట్లాడి విమర్శకుల చేత కూడా అవును.. కరెక్టే కదా అని అనిపించే విధానం ఆయన స్టైల్. కానీ ఈ కాక్రోచుల ఉద్యమంపై ఆయన మొదటి నుంచి సైలెంట్గానే ఉన్నాడు. విద్యార్థి ఉద్యమాలు నిర్మించినోడు.. నక్సల్బరీ విధానాలను ఆకళింపు చేసుకున్నోడు.. ఇప్పుడు పార్టీ మారగానే మొత్తానికి మొత్తం అందులో పరకాయ ప్రవేశం చేశాడంటే ఎవరూ నమ్మరు. ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉంది.
కానీ తప్పదు కాబట్టి బీజేపీ భావజాలాన్ని అలా దిగమించి ప్రచారం చేస్తూ.. పార్టీకి తన వల్ల మేలు జరిగే కార్యక్రమాలుంటే వాటిని చేసుకుంటూ పోతున్నాడు. అంతే తప్ప.. మొత్తం బీజేపీ కోసం బట్టలు చింపుకుని.. నోరు పారేసుకుని అర్థం పర్ధం లేకుండా మాట్లాడే తత్వం ఆయనకు ఇంకా అలవడలేదు. అలా మారే మనిషిలాగా కూడా కనిపించడం లేదు.
ఎందుకంటే.. మొన్ననే కాళేశ్వరంపై తనదైన బాణిని వినిపించాడు ఈటల రాజేందర్. బీజేపీ అంతా కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడితే.. తనొక్కడు మాత్రం.. ఇది నిరూపయోగమైన ప్రాజెక్టు కాదని, రైతులకు అన్యాయం చేయవద్దని, దీనిపై రాజకీయాలు చేయవద్దని సర్కార్కు కూడా హితవు పలికి వార్తల్లో నిలిచాడు. ఉన్నదున్నట్టుగా మాట్లాడటం వల్ల అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచి కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కున్నాడు. కానీ వెనక్కి తగ్గలేదు. తను అన్న కామెంట్కే కట్టుబడి ఉన్నాడు.
ఇప్పుడు కాక్రోచుల వంతు వచ్చింది. బీజేపీ నేతలంతా ఇది అరాచకశక్తుల పనే అంటున్నారు. మోడీని దెబ్బతీసేందుకు వెనుక శక్తులు నడిపించే కృత్రిమ ఉద్యమమని మండిపడుతున్నారు. కానీ ఈటల రాజేందర్ ఎందుకు దీనిపై మాట్లాడటం లేదు..? ఎందుకంటే ఆ ఉద్యమం జరిగిన తీరును చూస్తున్నాడు కాబట్టి..అందులో నిజాయితీ ఉంది కాబట్టి.. ఆ విద్యార్ధులు, కాక్రోచులు అడుగుతున్న, నిలదీస్తున్న వాటిల్లో న్యాయం ఉంది కాబట్టి.. అందుకే ఆయన దీనిపై పార్టీ లైన్కు కట్టుబడి స్పందించడు.
ఒకవేళ స్పందించాల్సి వచ్చినా.. ఆ ఉద్యమంలో నిజాయితీ ఉంది.. వారి కోరికలు, డిమాండ్ల మేరకు కేంద్రం నడుచుకోవాలి.. విద్యార్థులకు న్యాయం చేయాలనే విధంగానే ఆయన కామెంట్స్ ఉంటాయి కావొచ్చు. అలాగే ఉంటాయి కూడా. కానీ అలా మాట్లాడితే.. ఆయనపై విరుచుకుపడాటానికి బీజేపీ శ్రేణులు రెడీగా ఉన్నారు. కాక్రోచుల గురించి మంచిగా మాట్లాడితే క్రోకోడైల్స్లాగా ఈటల మీద పడి కరకర నమిలేస్తారు.