బీఆరెస్లోకి జీవన్రెడ్డి చేరడాన్ని ఘనంగా చెప్పుకుని భారీ బహిరంగ సభ నిర్వహించడాన్ని కవిత తప్పుబట్టారు. జీవన్రెడ్డి వయస్సేం పెరగలేదని, పదిహేనుళ్లు తగ్గి యువకుడిలా మారడానికి వేదికపై కేసీఆర్ చలోక్తులు విసిరిన విధానంపై కూడా ఆమె సెటైర్లు వేశారు. కురు వృద్ధులను చేర్చుకుని వారే యువకులని మీకు మీరే అనుకుంటే.. మరి తెలంగాణలో యువతే లేదా? అని ఆమె నిలదీశారు. దీనిపై బీఆరెస్ పార్టీ నుంచి క్రిషాంక్ కౌంటర్ ఇచ్చాడు.
మరి మీ పార్టీలో చేరబోతున్న రాథోడ్ బాబూరావు వయస్సెంత అక్క? అరవై ఐదేండ్లు కదా? ఎందుకు ఇవన్నీ మాటలు. కేసీఆర్పై ద్వేషంతో మీ పార్టీని ముందుకు తీసుకుపోకండి.. నిజాలతో మొదలు పెట్టండని హితోక్తులు పలుకుతూ ఓ మెసేజ్ పెట్టాడు. దీంతో కవిత టీం రంగంలోకి దిగింది. హోరాహోరీగా సోషల్ మీడియాలో ఈ వృద్ధ నేతలపై వార్ కొనసాగింది. రాథోడ్ బాబూరావు.. ఉద్యమకారుడని, ఉద్యమంలోంచి వచ్చిన ఆయనకు మీ పెద్దసారు రెండు సార్లు టికెటిచ్చాడనే విషయాన్ని గుర్తు చేశారు. కానీ, కేసీఆర్.. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ జీవన్రెడ్డి కాళ్లు పట్టుకుని మరీ పార్టీలోకి ఆహ్వానించారని విమర్శించారు. వృద్ధ నేతను పట్టుకుని పదిహేనేండ్లు తగ్గాయని, యువకుడిగా మారాడని కేసీఆర్ అన్న మాటలపైనే కవిత మాట్లాడారని, వృద్ధులను కించపరిచినట్టు కాదని దీనికి కౌంటర్ ఇచ్చారు.
ఉన్నదున్నట్టు మాట్లాడే కవితక్క అంటే మీకు పడదు.. అందుకే ఇలా ప్రతీ విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు.. విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు కవిత టీం. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తాజాగా ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్ను ఇష్టానుసారం తిట్టాడని, ముందు అతని సంగతేందో చూడండని హితవు పలికారు. సోషల్ మీడియాలో మీడియా వేదికగా ఈ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు తిట్ల వర్షం కురిపించుకున్నారు. పాత విషయాలన్నీ తోడుకున్నారు. జీవన్రెడ్డిని వ్యక్తిగతంగా కాకుండా తాము సిద్దాంత పరంగా విబేధించామని, కేసీఆర్ వైఖరిని తప్పుబట్టామని, ఉద్యమకారుల గురించి పల్లెత్తు మాట మాట్లాడని కేసీఆర్… జీవన్రెడ్డి పొగడుతూ.. ఇక ఆయనంతటి వాడు లేడని భుజకీర్తులు తొడగడాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరన్నదే తమ అభిమతమని వివరించారు.
అర్వింద్ వ్యక్తిగతంగా దాడి చేసినా అతనికి కౌంటర్ ఇవ్వడం చాతకాదని, కవితే వీరికి టార్గెట్ అని కూడా తిట్ల దండకమందుకున్నారు. జీవన్రెడ్డి చేరకముందు నుంచి కూడా తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు జీవన్రెడ్డిని టార్గెట్ చేశారు. కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిన తరువాత.. నిజామాబాద్కు చెందిన బీఆరెస్ నేతలే కవితను ఓడగొట్టారని జీవన్రెడ్డి ప్రకటించినా.. కేసీఆర్ వారి మీద చర్యలేమీ తీసుకోలేదని, కవితపై అప్పట్నుంచే కేసీఆర్, కేటీఆర్ కుట్రలు చేశారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి తొత్తుగా ఉన్న జీవన్రెడ్డి.. తెలంగాణ కు వ్యతిరేకంగా పనిచేసినా.. ఇప్పుడు కాళ్లు మొక్కి మరీ తీసుకుంటున్న మీరు ఎంతగా దిగజారారో కదా? అనే విమర్శలు కూడా చేశారు జాగృతి నాయకులు సోషల్ మీడియా వేదికగా. పార్టీ పెట్టకముందే తల్లీబిడ్డెల పార్టీలు ఒకర్నొకరు టార్గెట్ చేసుకుంటున్నారని, ఇక ముందు ఈ వార్ ఎంత ముదురుతుందో కదా! అని అనుకుంటున్నారంతా.