ఊరోనికి ఊరాపతి ఉంటే.. ఉసురుకండ్లోనికి దోమల ఆపతి! అన్నట్టు.. అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల్లో జరుగుతున్న తంతు.. ఆసక్తిగా మారింది. ఓ వైపు ఎర్రటి ఎండలు.. బయటకు పోలేకపోతున్నట్టున్నారు. చల్లగా నీడపట్టునే ఉండేలా పార్టీ కార్యాలయాలకే పరిమితమై.. ఏమీ తోచక ఏదో ఒకటి చేసి ఇలా వార్తల్లో వైరల్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోది రెండు పార్టీల కార్యాయాలు.. అదే భవన్ల గురించి. ఇప్పుడు వీటి గురించెందుకు టాపిక్ అంటే.. గాంధీ భవన్లో కాంగ్రెస్ తమ్ముళ్లు తన్నుకున్నారు. ఆధిపత్యం పోరులో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఘటన వైరల్గా మారింది. ఇద్దరు మైనార్టీ నేతలే ఫిరోజ్ఖాన్ను , కార్వాన్ ఇంచార్జి చెంప మీద ఒక్కటి అర్సుకున్నడు. ఫిరోజ్ కింద పడిపోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. అజారుద్దీన్ పాల్గొన్న ఆ వేదికపైన ఆయన పక్కన నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అని ఇలా తన్నులాటకు దిగిర్రంట.
అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నడు. అంతా తమాషా చూసినట్టే చూసిండు కానీ, వారిని ఆపలేదు. వీ హనుమంతరావు ఆపే ప్రయత్నం చేస్తే ఆయన్ను నెట్టేశారు. కిందపడబోయి తమాయించుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఓ వైపు పీసీసీ చీఫ్ బిజీబిజీగా జిల్లాలు చుట్టి వస్తుంటే.. ఇక్కడ గాంధీభవన్లో కాంగ్రెస్ తమ్ముళ్లు తన్నుకుంటూ పెత్తనం కోసం పాకులాడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సఖ్యతే కాదు.. భయం భక్తీ లేదని తేలిపోయిది దీని ద్వారా మరోసారి. ఇక తెలంగాణ భవన్లో ప్రెస్మీట్లకు కొదవ లేదు. ఒకరి తరువాత ఒకరు పోటీలు పడి ప్రెస్మీట్లు పెడుతున్నారు. జనం మధ్యకు పోయేందుకు వీరికి సమయం లేదు గానీ.. నిత్యం తెలంగాణ భవన్లో దర్శనమిస్తున్నారు. ఏదో ఒక ఇష్యూను క్రియేట్ చేసుకుంటారు. దానిపై పుంఖానుపుంఖాలుగా మాట్లాడి ఊదరగొట్టి.. ఏ మీడియాలో అది రాకున్నా.. తమ మీడియాలో వచ్చినా పర్వాలేదు.. సారు మమ్మల్ని చూస్తే చాలు.. అనే విధంగా తయారయ్యారు అక్కడ గులాబీ నేతలు.
మొన్నటిదాకా వరుసగా నియోజకవర్గాల వారీగా మీటింగులు పెట్టుకున్నారు. ఏదో ఒకటి ఈ వేదిక మీద నుంచి మాట్లాడాలె.. దాన్ని వైరల్ చేసుకోవాలె..ఇదే స్ట్రాటజీని అనుసరించాడు కేటీఆర్. కేసీఆర్ సభ్యత్వ నమోదు విషయంలో వీరికి దిశానిర్దేశం చేసినా.. పార్టీని పటిష్ట పరిచి గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేయాలని కోరినా.. వీరికి మాత్రం ఎవరి రాజకీయం వారికి, ఉనికి చాటుకోవడంలో ఎవరికి వారే బిజీ అయిపోయారు. ఎండలో తిరుగొద్దు అని కూడా పనిలో పని ఉచిత సలహాలిస్తున్నారు ప్రజలకు. అంటే మేమందుకే ఎండలో తిరగడం లేదు.. ప్రజలను కలవడం లేదు.. ఇలా చల్లగా ఏసీలో ప్రెస్మీట్లు పెట్టుకుంటున్నామని చెప్పకనే చెబుతున్నారు గులాబీ నేతలు. తెలంగాణ భవన్ అలా ప్రెస్మీట్లు పెట్టే నాయకులతో కిటకిటలాడుతుంటే.. గాంధీభవన్లో బలాబలాలు తేల్చుకునేందుకు తన్నులాట, కుస్తీలాటలు జరుగుతున్నాయి. ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు.