నేల విడిచి సాము ఒకరు చేస్తున్నారు. ఎర్రటి ఎండలో జనం మధ్య వారి సమస్యల పరిష్కారం కోసం మరొకరు తిరుగుతున్నారు. ఇద్దరూ వర్కింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఒకరేమో సోషల్ మీడియాలో పనిచేయడమే పనిగా పెట్టుకున్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరొకరేమో ప్రధాన ప్రతిపక్షం మేమే అనే రేంజ్లో నిత్యం ఏదో ఒక ప్రజా సమస్య మీద ఆందోళన, మెరుపు ధర్నాల వర్కింగ్ బిజీలో ఉన్న టీఆరెస్ చీఫ్. ఇద్దరూ కేసీఆర్ వారసులే. పార్టీలు వేరు. పార్టీల లైన్లు వేరు. మనస్తత్వాలు వేరు.
ఎంచుకున్న పోరాట మార్గాలూ వేరే. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుందామనుకున్న కేటీఆర్.. ఇలా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన పసలేని పనిమంతుడు అవతారమెత్తాడు. తండ్రిలోని లీడర్షిప్ క్వాలిటీస్ను ఔపోసపట్టి.. ఆయనలోని కొన్ని విధానాలనే వ్యతిరేకించేందుకు సైతం వెనుకాడని పరిణతి సాధించి తండ్రిని మించిన తనయురాలనిపించుకుంటున్నారామె. ఇద్దరూ అన్నాచెళ్లెల్లు.. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లే. విషయమేదైనా కానీ.. తమ దైన శైలిలో వాటికి స్పందించే గుణం, సమయస్పూర్తి మెచ్చుకోదగిందే.
కానీ కొన్ని కొన్ని విషయాలు.. కేటీఆర్ లోపాలు, ఆలోచించే దోరణి, మనస్తత్వం.. పాలకు పాలు నీళ్లకు నీళ్లలా ఇద్దరిలోని వైవిద్యాన్ని వేరు చేసి చూపుతాయి. ఇక్కడే ఎవరు పనిమంతులు అనేది తేల్చడం పెద్ద కష్టమైన పనేం కాదు. అసలు ఇద్దరిలో ఈ తేడాలు ఎప్పుడు బయటపడ్డాయి? అప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్లనే పోల్చి పోల్చి చూసిన జనం.. ఆయన వారసుడిగా కేటీఆర్ను ఓన్ చేసుకోవడానికి మంచి లక్షణాలను వెతికి పట్టుకునేందుకు ప్రయత్న చేసిన జనం.. ఇంకా ఏదో వెలితి ఉందని అసంతృప్తి చెందుతున్న జనం, క్యాడర్.. కవిత కొత్త పార్టీ పెట్టిన తరువాత.. ఇప్పుడు ఈ ఇద్దరినీ పోల్చి చూడటం మొదలుపెట్టారు.
నిజమే, ఇద్దరివీ వేర్వేరు దారులు కావొచ్చు. ఎంచుకున్న పోరాట పంథా కూడా వేరే కావొచ్చు. ఇద్దరూ కేసీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని వచ్చినవారు. ఆయన లీడర్షిప్ను చూస్తూ, నేర్చుకుని ఎదుగుతూ వచ్చినవారు. కాబట్టే.. ఇటు బీఆరెస్ క్యాడర్, అటు టీఆరెస్ క్యాడర్.. మిగిలిన పార్టీ నేతలు, ప్రజలు.. అంతా ఇప్పుడు ఈ ఇద్దరినీ నిశితంగా గమనిస్తున్నారు. వీళ్ల పార్టీ గొడుగుల కింద వీరు చేస్తున్న కార్యక్రమాలేంది? సమకాలీన రాజకీయ పరిస్ఙితులపై వీరు స్పందిస్తున్న తీరు ఎలా ఉంది? ఎంచుకున్న ప్రజా సమస్యలేమిటీ? పోరాట మార్గాలెలా ఉన్నాయి. సాధించి ఫలాలేవిధంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నారు. కవిత పార్టీ పెట్టకముందు నుంచే దూకుడుగా ఉన్నారు.
తను ఎంచుకున్న మార్గం వైపు ఓ స్పష్టతతో అడుగేస్తున్నారు. తనేం చేస్తున్న పనిగట్టి.. దానికి సవాలక్ష ఆంక్షలు, ఆటంకాలు సృష్టించే చక్రబంధం నుంచి బయటపడుతూనే తన వ్యూహాలు తను రచిస్తూ… ఎంచుకున్న సమస్య.. అనుకున్న పరిష్కారం కోసం ఆమె చేస్తున్న పోరాటం ఓ దశాదిశా చూపుతున్నది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్ ప్రాజెక్టులపై విప్పిన పోరాట గళం.. బీఆరెస్ను వణికిస్తే.. సర్కార్లో కదలిక తెచ్చింది. అమర వీరుల స్థూపం నిర్మాణమైనా, రైతుల సన్నబియ్యం బోనస్ అయినా.. కార్మికుల కనీస డిమాండ్ల సాధనైనా.. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన న్యాయం జరిగే వరకు తెగించే కొట్లాడే విధానమైన.. తనది ప్రత్యేక శైలి అనే చెప్పాలి.
చేసే పోరాటంలో రాజకీయం కన్నా.. జనంతో మమేకమై వారి మనసు చూరగొనాలనే కమిట్మెంట్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇది ఆమెలోని నిబద్దతతో కూడిన రాజకీయాన్ని పట్టిస్తుంది. జనం నాడిని ఆమె ఈ విధంగా పట్టుకోగలుగుతున్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ ఏకంగా.. సోషల్ మీడియా వారియర్గా మారిపోయాడు. అదే తనను గద్దెనిక్కిస్తుందని నమ్ముతున్నాడు ప్రగాఢంగా. ఇప్పటి రాజకీయాల్లో ఇది అవసరమే. కాదనలేం.
కానీ అదే లోకంగా బతికితే.. దీని ద్వారానే పోరాటాలు చేస్తూ ప్రజలకు న్యాయం చేస్తానని భ్రమలో ఉంటే..వర్కింగ్ ప్రెసిడెంట్ అనరు… సోషల్ మీడియా వర్కర్ అంటారు. వర్కింగ్ బిజీ ఇన్ సోషల్ మీడియా అంటారు. కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చి స్టీరింగ్ చేతిలో పెడితే.. ఒకరేమో ఇలా. పార్టీ నుంచి కొడుకు కోసం తరిమేసి నీ దారి నువ్వు చూసుకో అని వదిలేస్తే.. ఆమె దూకుడుగా దుమ్మురేపుతున్నరిలా!