Heatwave Alert: తెలంగాణలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పై హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా 7 జిల్లాల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పు ఎక్స్ గ్రేషియో ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఈ నష్టపరిహారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
మరోవైపు వచ్చే మూడు రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్ ఉండనున్నట్లు మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం అని పొంగులేటి స్పష్టం చేశారు. ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎండల తీవ్రతపై ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు జారీ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు.. ఈ ఎండలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయం, భవన నిర్మాణ కార్మికులు సైతం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హీట్ వేవ్ పై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. వడదెబ్బ కేసులను వెంటనే చికిత్స అందించేందుకు ఆస్పత్రులను సిద్దంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: బీఆర్ఎస్ అధికారంలోకి.. వచ్చేది లేదు సచ్చేది లేదు.. టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కాస్తున్న విపరీతమైన ఎండలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా హీట్ వేవ్ కారణంగా భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల్లో ఇద్దరు వృద్దులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా మంగపేట మండలం పూరేడిపల్లి గ్రామంలో సోమిరెడ్డి (60) అనే వృద్ధుడు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో పుష్కరాల కోసం వచ్చిన భక్తుడు వడదెబ్బతో చనిపోయినట్లు పేర్కొన్నారు. విపరీతమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: సెంట్రింగ్ కార్మికుల ధర్నాకు కవిత సపోర్ట్.. ప్రభుత్వానికి అల్టిమేటం.. చర్చలకు రాకుంటే!