Chepala Iguru: చేపల కూర అంటే ఇష్టపడని వారుండరు. అందులోనూ మసాలాలు దట్టించి వండిన చేపల ఇగురు ఉంటే అన్నం మొత్తం దాంతోనే తినేయాలనిపిస్తుంది. తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా, ఇంట్లో వారందరికీ నచ్చేలా ఘుమఘుమలాడే చేపల ఇగురును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఒక కిలో శుభ్రం చేసిన చిన్న చేపలు తీసుకోవాలి. దీనికి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి ముద్ద, రెండు ఉల్లిపాయల తరుగు, రెండు పచ్చిమిర్చి సిద్ధం చేసుకోవాలి. మసాలాల కోసం మూడు టీస్పూన్ల కారం, అర స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు, స్పూను ధనియాల పొడి, అర స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను గరం మసాలా అవసరమవుతాయి. వీటితో పాటు మూడు స్పూన్ల నూనె, రెండు రెమ్మల కరివేపాకు, అర కప్పు టమోటా గుజ్జు మరియు తగినంత కొత్తిమీర తరుగును దగ్గర పెట్టుకోవాలి.
Also Read: ఎగ్ లేకుండానే ఆమ్లెట్.. ఇదిగో ఇలా తయారు చేయండి, భలే టేస్టీగా ఉంటుంది!
శుభ్రం చేసిన చేప ముక్కలకు కొద్దిగా ఉప్పు, పసుపు పట్టించి పావుగంట పాటు పక్కన ఉంచాలి. దీనివల్ల ముక్కకు ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి, అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ తరుగు వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటా ప్యూరీతో పాటు కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం ఇగురులా తయారయ్యాక కొద్దిగా నీళ్లు పోసి, గరం మసాలా మరియు పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేయాలి. మూత పెట్టి చిన్న మంట మీద చేపలు మెత్తబడే వరకు ఉడికించి, చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే చేపల ఇగురు రెడీ అయినట్టే.
Also Read: కోవా బన్ ఎక్కడ బాగా ఫేమస్? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి?