BSNL Kavach: సాధారణంగా మెుబైల్ యూజర్లు రీఛార్జ్ సమయంలో తమ నెంబర్లు చాలా ఈజీగా షేర్ చేసేస్తుంటారు. ముఖ్యంగా ఆఫ్ లైన్ స్టోర్లలో రీఛార్జ్ చేసుకునేవారు.. ముందు వెనుక ఆలోచించకుండా తమ నెంబర్లు చెప్పి రీఛార్జ్ పొందుతుంటారు. దీనివల్ల ముక్కు, ముఖం తెలియని వారి వద్దకు మన వ్యక్తిగత ఫోన్ నెంబర్ వెళ్లే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఇటీవల పెరిగిపోయాయి. దీనిని గమనించిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. తమ యూజర్ల కోసం సరికొత్త పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ‘బీఎస్ఎన్ఎల్ కవచ్’ పేరిట కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా మనం ఏదైనా లోకల్ మొబైల్ షాప్ లేదా రీఛార్జ్ సెంటర్కు వెళ్లి రీఛార్జ్ చేయించుకోవాలంటే మొబైల్ నంబర్ను సదరు దుకాణదారుడికి చెప్పాల్సి ఉంటుంది. అయితే బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన ప్రత్యేక వ్యవస్థ ‘బీఎస్ఎన్ఎల్ కవచ్’ ద్వారా వినియోగదారులు తమ అసలు మొబైల్ నంబర్ను బయటపెట్టకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక ప్రత్యేకమైన కోడ్ లేదా ప్రత్యామ్నాయ ఐడీని బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. దీనివల్ల రీఛార్జ్ చేసే వ్యక్తికి కస్టమర్ నెంబర్ తెలిసే అవకాశం ఉండదు.
బీఎస్ఎన్ఎల్ కవచ్ కింద ప్రత్యామ్నయ నెంబర్ లేదా కోడ్ ను పొందేందుకు యూజర్లు కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ఇన్ స్టాల్ చేసుకొని.. మీ నెంబర్ తో లాగిన్ అవ్వండి. యాప్ హోమ్ పేజీలో కవచ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అక్కడ ‘జనరేట్ వర్చువల్ నెంబర్’ ఫీచర్ పై క్లిక్ చేస్తే.. మీ నెంబర్ కు ఎస్ఎంఎస్ రూపంలో 10 అంకెల నెంబర్ వస్తుంది. అయితే ఇది పర్మినెంట్ నెంబర్ కాదు. ఓటీపీ తరహాలో మారుతూ ఉంటుంది. యూజర్లు తమ ఫోన్ నెంబర్ ఆఫ్ లైన్ లో రీఛార్జ్ చేసుకోవాలని భావించిన ప్రతీసారి.. తాత్కాలిక నెంబర్ ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: కూలర్ విసిగిస్తోందా? ఈ 4 పనులు చేస్తే చాలు.. రూమ్ చిల్ అయిపోద్ది!
జియో, ఎయిర్టెల్, వీఐ వంటి ప్రైవేట్ సంస్థలు డిజిటల్ యాప్స్ ద్వారా ఆన్లైన్ రీఛార్జ్లను ఎంతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రిటైల్ షాపుల ద్వారా జరిగే రీఛార్జ్ల విషయంలో ప్రైవసీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ సంస్థల వినియోగదారులు.. రీటైల్ షాపులకు వెళ్లినప్పుడు నేరుగా తమ నంబర్ను రిటైలర్కు ఇవ్వాల్సిందే. దీనివల్ల ముఖ్యంగా మహిళల నంబర్లు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డేటా సెక్యూరిటీపై దృష్టి పెడుతున్న జియో, ఎయిర్టెల్ సంస్థలు.. రిటైల్ పాయింట్లపై కూడా ఫోకస్ పెట్టాలని యూజర్లు కోరుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్ తరహాలో ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
Also Read: కూలర్ + ఎగ్జాస్ట్ ఫ్యాన్.. క్రేజీ కాంబినేషన్ భయ్యా.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!