BSNL Yatra SIM: అమర్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా ‘యాత్రా సిమ్’ (Yatra SIM)ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.196కే లభించే ఈ సిమ్ ద్వారా 15 రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేని కనెక్టివిటీని పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన ‘యాత్రా సిమ్’ కి సంబంధించిన పూర్తి వివరాలు, దాని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త యాత్ర సిమ్ ను రూ.196 ధరకు 15 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. అంటే రోజుకు సుమారు రూ.13 ఖర్చుతోనే భక్తులకు కొన్ని రకాల ప్రయోజనాలు లభించనున్నాయి. దేశంలోని ఏ నెట్వర్క్కైనా ఫ్రీ కాల్స్, ప్రతీ రోజూ 2GB హై స్పీడ్ డేటా.. యాత్రా సిమ్ ద్వారా లభించనుంది. పర్వత ప్రాంతాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ను దీని ద్వారా వాడుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు ప్రతీ రోజూ 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా పంపుకునే వెసులుబాటు సైతం యాత్ర సిమ్ ద్వారా అందిస్తున్నారు.
అమర్ నాథ్ కు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ఈ ‘యాత్రా సిమ్’ ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. యాత్రికులు దీనిని సులభంగా పొందేందుకు జమ్మూ-కశ్మీర్ వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. లఖన్పూర్ బేస్ క్యాంప్, జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్, బాల్టాల్, పహల్గామ్ బేస్ క్యాంపుల వద్ద ఈ సిమ్ అందుబాటులో ఉంటుంది. అలాగే శ్రీనగర్ నౌగామ్ లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్లతో పాటు నిర్దేశిత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ కేంద్రాలలో కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు.
యాత్రా సిమ్ పొందేందుకు భక్తులు తప్పనిసరిగా కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కస్టమర్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఈ ప్రీ-యాక్టివేటెడ్ సిమ్ ను బీఎస్ఎన్ఎల్ వర్గాలు జారీ చేయనున్నాయి. సిమ్ కోసం.. ఆధార్ కార్డ్ లేదా పాస్ పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, ఇటీవల దిగిన పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, యాత్రా రిజిస్ట్రేషన్ స్లిప్ ను తప్పనిసరిగా సమర్పించాలి.
Also Read: గూగుల్ మ్యాప్స్లో దాగున్న.. 5 మ్యాజికల్ ఫీచర్లు.. తెలిస్తే థ్రిల్ అవుతారు!
కేవలం తీర్థయాత్రల రూట్లలోనే కాకుండా దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ తన 4G నెట్వర్క్ను బీఎస్ఎన్ఎల్ శరవేగంగా విస్తరిస్తోంది. అంతేకాకుండా పూర్తి స్వదేశీ సాంకేతికతతో (Indigenous Technology) రూపొందుతున్న తన 5G నెట్వర్క్ ట్రయల్స్ ను పూణే, బెంగళూరు, విశాఖపట్నం, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అధునాతన 5G సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే సర్వం స్వాహా!